సెకనుకు 800 ల్యాప్‌టాప్‌ల పారవేత

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు 800 పాత ల్యాప్‌టాప్‌లను పక్కన పడేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు.

Published : 30 Jan 2023 05:31 IST

ఈ-వ్యర్థాల్లో 17 రకాల  విలువైన లోహాలు
చెత్త నుంచి   బంగారం వెలికితీయొచ్చు
మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ

ఈనాడు, దిల్లీ: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు 800 పాత ల్యాప్‌టాప్‌లను పక్కన పడేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు. వాటిలో నిక్షిప్తమై ఉండే 17 రకాల విలువైన లోహాలను వెలికితీస్తే ఈ-వ్యర్థాల నుంచి బంగారాన్ని సృష్టించవచ్చని  పేర్కొన్నారు. ఆయన ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం ద్వారా దేశప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘‘ఈ రోజు ప్రతి ఇంట్లో మొబైల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు సర్వసాధారణమైపోయాయి. దేశంలో వాటి సంఖ్య వందల కోట్లకు చేరిపోయింది. ఈ-వ్యర్థాన్ని సరిగా వదిలించుకోకపోతే అది పర్యావరణానికి చేటుచేయొచ్చు. దాన్ని సరిగా పునర్‌వినియోగించుకుంటే సర్క్యులర్‌ ఎకానమీకి బలమైన వనరుగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 50 మిలియన్‌ టన్నుల ఈ-వ్యర్థాలను పారబోస్తున్నట్లు ఐక్య రాజ్య సమితి నివేదిక చెబుతోంది. దాని పరిమాణం ఎంతన్నది మీరు ఊహించగలరా? మానవ చరిత్రలో ఇప్పటి వరకు తయారైన వాణిజ్య విమానాలన్నింటినీ కలిపి తూకం వేసినా సమానం కాదు. ప్రస్తుతం ప్రతి సెకనుకు 800 ల్యాప్‌టాప్‌లను పారేస్తున్నారు. అయితే విభిన్న శుద్ధికార్యక్రమాల ద్వారా వాటి నుంచి బంగారం, వెండి, రాగి, నికెల్‌ సహా 17 రకాల విలువైన లోహాలను వెలికితీయొచ్చని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ దిశలో పనిచేసే స్టార్టప్‌లకు ప్రస్తుతం కొదవలేదు. ఇప్పుడు దాదాపు 500 ఈ-వ్యర్థాల రీసైక్లర్స్‌ పనిచేస్తున్నారు. చాలామంది కొత్త ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వారితో జతకలుస్తున్నారు. ఈ రంగం వేలమందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తోంది. బెంగళూరులోని ఈ-పరిసర సంస్థ ఇలాంటి ప్రయత్నం చేస్తోంది. ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డుల నుంచి విలువైన లోహాలను వెలికితీసే స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అది తయారు చేసింది. అలాగే ముంబయి, ఉత్తరాఖండ్‌లోని రవుర్కెలా, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన విభిన్న సంస్థలు మొబైల్‌ యాప్‌ ద్వారా టన్నుల కొద్దీ ఈ-వ్యర్థాలను సేకరిస్తున్నాయి. ఇవన్నీ భారత్‌ను ప్రపంచ రీసైక్లింగ్‌ హబ్‌గా మార్చేందుకు దోహదపడుతున్నాయి. ఇలాంటి ప్రయత్నాలు విజయవంతం కావాలంటే ప్రజలు కూడా ఈ-వ్యర్థాలను పద్ధతి ప్రకారం పక్కన పెట్టాలి’’ అని ప్రధాని పేర్కొన్నారు. 

* చిరుధాన్యాల వాడకాన్ని ప్రోత్సహించాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

*  దేశీయ పేటెంట్‌ దరఖాస్తులతో పోలిస్తే దేశం నుంచి విదేశీ పేటెంట్‌ల కోసం చేస్తున్న దరఖాస్తులు ఎక్కువగా ఉంటున్నాయని మోదీ వివరించారు.

* ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డులు పొందిన వ్యక్తుల జీవితాల గురించి తెలుసుకోవాలని ప్రధాని.. దేశ ప్రజలకు సూచించారు.


తెలంగాణ ఇంజినీరు విజ్ఞప్తితో ‘ఈ’ ప్రస్తావన

నమో యాప్‌ ద్వారా తెలంగాణకు చెందిన విజయ్‌ అనే ఇంజినీర్‌ చేసిన విజ్ఞప్తి మేరకు తాను ఈ-వ్యర్థాల ప్రస్తావన తీసుకొచ్చినట్లు ప్రధాని పేర్కొన్నారు. అలాగే గిరిజన భాషల అభ్యున్నతి కోసం కృషి చేస్తూ ఇటీవల పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన బి.రామకృష్ణారెడ్డి పేరునూ ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు. వరంగల్‌ కాకతీయ వంశ రాజుల గణతంత్ర సంప్రదాయాల గొప్పతనాన్ని కొనియాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని