బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై విచారణకు సుప్రీం అంగీకారం

గుజరాత్‌ అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం నిషేధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

Published : 31 Jan 2023 05:25 IST

పిటిషన్‌దారులపై మండిపడ్డ న్యాయశాఖ మంత్రి రిజిజు

దిల్లీ: గుజరాత్‌ అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం నిషేధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై వచ్చే వారం విచారణ చేపడతామని సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది. న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేయగా తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రా, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎన్‌.రామ్‌ల తరపున అడ్వకేట్‌ సీయూ సింగ్‌ మరో పిల్‌ వేశారు. డాక్యుమెంటరీని చూస్తున్న పౌరులు, విద్యార్థులను కేంద్రం అరెస్టులు చేయిస్తోందని ఎం.ఎల్‌.శర్మ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు స్వయంగా డాక్యుమెంటరీని వీక్షించి గుజరాత్‌ అల్లర్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రం తనకున్న ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించేలా తాము చేసిన ట్వీట్‌లను తొలగించిందని ఎన్‌. రామ్‌ తదితరులు తమ పిటిషన్‌లో ప్రస్తావించారు. తమ పోస్టులను పునరుద్ధరించేలా గూగుల్‌, ట్విటర్‌లను ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. వ్యాజ్యాలను పరిశీలించిన ధర్మాసనం వచ్చే సోమవారం వీటిని విచారిస్తామని వెల్లడించింది. ఈ పిటిషన్‌లు దాఖలు చేసిన వారిపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు మండిపడ్డారు. వేల మంది సామాన్యులు న్యాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇలాంటి పిటిషన్లు వేయడం సుప్రీంకోర్టు విలువైన సమయాన్ని వృథా చేయడమేనని విమర్శించారు.

బీబీసీపై ధ్వజమెత్తిన రష్యా

తమ దేశంపైనే కాకుండా విదేశీ వ్యవహారాల్లో స్వతంత్రంగా వ్యవహరించే ప్రతి దేశంపైనా సమాచార యుద్ధానికి దిగుతోందని విమర్శిస్తూ బీబీసీపై రష్యా దుమ్మెత్తిపోసింది. భారత ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ గురించి ప్రస్తావిస్తూ రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని