దిల్లీ వర్సిటీలోని మొగల్‌ గార్డెన్స్‌.. ఇక గౌతమ బుద్ధ సెంటినరీ

దేశ రాజధానిలోని దిల్లీ విశ్వవిద్యాలయంలో ఉన్న మొగల్‌ గార్డెన్స్‌ పేరును గౌతమ బుద్ధ సెంటినరీగా మారుస్తున్నట్లు రిజిస్ట్రార్‌ వికాస్‌ గుప్తా సోమవారం వెల్లడించారు.

Published : 31 Jan 2023 04:49 IST

పేరు మారుస్తూ విశ్వవిద్యాలయం నిర్ణయం

దిల్లీ: దేశ రాజధానిలోని దిల్లీ విశ్వవిద్యాలయంలో ఉన్న మొగల్‌ గార్డెన్స్‌ పేరును గౌతమ బుద్ధ సెంటినరీగా మారుస్తున్నట్లు రిజిస్ట్రార్‌ వికాస్‌ గుప్తా సోమవారం వెల్లడించారు. వర్సిటీలోని నార్త్‌ క్యాంపస్‌లో ఈ గార్డెన్‌ ఉంది. ‘‘15 ఏళ్ల క్రితం నిర్మించిన గౌతమ బుద్ధ విగ్రహం గార్డెన్‌ మధ్యలో ఉంది. ఇది మొగల్‌ గార్డెన్స్‌ నమూనాలో లేదు. మొగల్‌ నిర్మించిన గార్డెనూ కాదు. రాష్ట్రపతి భవన్‌లో ఉన్న మొగల్‌ గార్డెన్స్‌ పేరు మార్పునకు 15 రోజుల ముందే ఈ ప్రతిపాదన దస్త్రం ఉపకులపతి దగ్గరకు వెళ్లింది. మార్చిలో జరిగే పూల ప్రదర్శన కార్యక్రమానికి ముందే పేరు మార్చాలని భావించాం’’ అని ఓ అధికారి అన్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఉన్న మొగల్‌ గార్డెన్స్‌ పేరును అమృత్‌ ఉద్యాన్‌గా మారుస్తూ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

మొగల్‌ గార్డెన్‌ నమూనా..!

అసలు మొగల్‌ గార్డెన్‌ అంటే ఏంటీ, ఎందుకు ఆ పేరుతో పిలుస్తుంటారు అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. ‘‘మొగల్‌ గార్డెన్‌ అనేది పర్షియన్‌ నిర్మాణంలో ఉంటుంది. కాలువలు, కొలనులతో పాటు జలపాతాలు ఉంటాయి. నీలిరంగు టైల్స్‌ ఈ గార్డెన్‌లో కనిపిస్తాయి. ఇరువైపులా కొండలు, వాటి మధ్యలో నీరు ప్రవహిస్తున్నట్లు ఉంటుంది. ఈ గార్డెన్‌లో పూలు, పండ్ల చెట్లు ఉంటాయి. తాజ్‌మహల్‌లో ఇలాంటి నమూనా గార్డెన్‌ ఉంది’’ అని వర్సిటీలోని ఓ అధికారి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని