సంక్షిప్త వార్తలు (6)

న్యూయార్క్‌ నుంచి దిల్లీ వస్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో గత నవంబరు 26న తోటి మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన కేసులో నిందితుడు శంకర్‌ మిశ్రకు దిల్లీ జిల్లా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Updated : 01 Feb 2023 06:10 IST

విమానంలో మూత్ర విసర్జన ఘటన.. నిందితుడికి బెయిల్‌

దిల్లీ: న్యూయార్క్‌ నుంచి దిల్లీ వస్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో గత నవంబరు 26న తోటి మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన కేసులో నిందితుడు శంకర్‌ మిశ్రకు దిల్లీ జిల్లా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తుతో అదనపు సెషన్స్‌ జడ్జి హర్‌జ్యోత్‌ సింగ్‌ భల్లా మంగళవారం బెయిల్‌ మంజూరు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ.. ‘ఈ ఘటనతో అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్ఠ దెబ్బతింది’ అని కోర్టు ముందు పోలీసులు వాదన వినిపిస్తుండగా.. జడ్జి జోక్యం చేసుకుని ‘‘ఘటన విచారకరం అయి ఉండొచ్చు.. కానీ అది వేరే విషయం. చట్టం ఎలా వ్యవహరిస్తుందో అలా ముందుకెళ్లాలి’’ అన్నారు. అంతకుముందు నిందితుడు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఈ నెల 11న కొట్టివేయగా.. ఆయన జిల్లా కోర్టును ఆశ్రయించారు.


విమాన మరుగుదొడ్డిలో పొగ తాగడంతో అరెస్టు

కొచ్చి: స్పైస్‌జెట్‌ విమానంలోని మరుగుదొడ్డిలో పొగతాగుతూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. కేరళలోని త్రిస్సూరుకు చెందిన సుకుమారన్‌ జనవరి 29న విమానం ఎక్కాడు. మరుగుదొడ్డిలో పొగతాగుతుండగా సిబ్బంది గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతణ్ని అరెస్టు చేసిన పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు.


మహారాష్ట్ర రాష్ట్రగీతంగా.. ‘జై జై మహారాష్ట్ర మాఝా’

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో ‘జై జై మహారాష్ట్ర మాఝా’ను రాష్ట్ర గీతంగా గుర్తించారు. ఈ మేరకు మంగళవారం ఓ అధికారిక ప్రకటన వెలువడింది. ఫిబ్రవరి 19న మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని లాంఛనంగా ప్రకటిస్తారు.


మోర్బీ వంతెన కూలిన కేసులో.. కంపెనీ ఎండీ కోర్టులో లొంగుబాటు

మోర్బీ: గుజరాత్‌లోని మోర్బీలో గతేడాది అక్టోబర్‌ 30న వేలాడే వంతెన కూలి 135 మంది దుర్మరణానికి దారితీసిన కేసులో ఒరేవా గ్రూప్‌ కంపెనీ ఎండీ జయసుఖ్‌ పటేల్‌ మంగళవారం కోర్టులో లొంగిపోయారు. స్థానిక చీఫ్‌ జుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ఎం.జె.ఖాన్‌ ఎదుట లొంగిపోయిన ఆయనను పోలీసులు అరెస్టు చేసి, జైలుకు తరలించారు. బ్రిటిష్‌ కాలం నాటిదైన కూలిన వంతెన నిర్వహణ బాధ్యతలను ఒరేవా కంపెనీయే చూస్తోంది.ముందస్తు బెయిలు కోసం జయసుఖ్‌ దాఖలు చేసిన పిటిషనుపై బుధవారం విచారణ జరగనుంది.


ఒకేసారి క్లోమం, మూత్రపిండ మార్పిడి

చండీగఢ్‌: ఏకకాలంలో ఒక వ్యక్తికి క్లోమం, మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌ సంస్థ వైద్య నిపుణులు ఈ ఘనత సాధించారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ యువకుడి నుంచి క్లోమాన్ని, రోగి సోదరి నుంచి మూత్రపిండాన్నీ తీసి ఈ చికిత్స పూర్తిచేశారు. ఇందుకోసం సంస్థలోని వివిధ విభాగాలకు చెందిన 30 మంది వైద్య సిబ్బంది 12 గంటల పాటు శ్రమించారు. మరణించిన దాత కుందన్‌ బైఠా (21) కుటుంబ ఔదార్యం నలుగురి ప్రాణాలను కాపాడిందని పీజీఐఎంఈఆర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. బిహార్‌కు చెందిన కుందన్‌ ఈ నెల 22న బైక్‌ మీద వెళుతూ జారిపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. జనవరి 23న అతడిని పీజీఐఎంఈఆర్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. 29 నుంచి అతడి మెదడు పనిచేయడం మానేసింది. దీంతో కుందన్‌ను బ్రెయిన్‌ డెడ్‌గా ఆసుపత్రి ప్రకటించింది. ఈ వార్త విని తీరని విషాదంలో కూరుకుపోయిన తండ్రి నర్సింగ్‌ బైఠా.. అపార మనోస్థైర్యాన్ని ప్రదర్శించారు. కుమారుడి అవయవాలను దానం చేశారు. వైద్యులు కుందన్‌ గుండె, కాలేయం, క్లోమం, మూత్రపిండాలను తీసి భద్రపరిచారు. గడచిన 21 ఏళ్లుగా టైప్‌ 1 మధుమేహంతో బాధపడుతూ మూత్రపిండ వైఫల్యానికి గురైన ఒక రోగికి కుందన్‌ క్లోమాన్ని అమర్చారు. రోగి సోదరి మూత్రపిండం అందించారు. కుందన్‌ మూత్ర పిండాలను ఇద్దరు రోగులకు అమర్చారు.


నాయకుడు సజావుగా నడిపించారు

కొవిడ్‌తో తలెత్తిన కల్లోల పరిస్థితుల్లోనూ దేశ ఆర్థిక వ్యవస్థను అనుభవజ్ఞుడైన నాయకుడు మోదీ సజావుగా ముందుకు నడిపించారని ఆర్థిక సర్వే-2023 పునరుద్ఘాటించింది. ప్రపంచమంతా మందగమనంతో ఇబ్బందిపడుతున్నవేళ.. మన దగ్గర మాత్రం అన్ని రంగాల్లోనూ ఆశావాహ పరిస్థితులు నెలకొన్నాయి. భారత్‌ అంతర్జాతీయ అగ్రశక్తిగా ఎదగబోతోందని చెప్పేందుకు ఇది సంకేతం.

 అమిత్‌ షా


భారత్‌కు మెరుగైన పాలన కావాలి

ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో నిరుద్యోగిత, ధరల పెరుగుదల, సంపదలో అసమానతలు, చైనా దూకుడు, ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో వైఫల్యాలు, వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల్లో తగ్గుదల, విద్వేష ప్రచారం వంటి అంశాలను ప్రస్తావించకపోవడం విచారకరం. భారత్‌కు మెరుగైన పాలన అవసరం.  

 రణదీప్‌సింగ్‌ సుర్జేవాలా


మోదీ దూరంగా ఉండాలి

హిండెన్‌బర్గ్‌ ఆరోపణలన్నీ అవాస్తవాలని కోర్టులో అదానీ నిరూపించుకునేదాకా భాజపా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆయన నుంచి మోదీ దూరంగా ఉండాలి. లేకపోతే- వాటర్‌గేట్‌ కుంభకోణం కారణంగా 1973-79 మధ్య అమెరికాలో రిపబ్లికన్లు ఘోరంగా దెబ్బతిన్నట్టే 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా తీవ్రంగా నష్టపోతుంది.

 సుబ్రమణ్య స్వామి


కలిసికట్టుగా పోరాడదాం

మానవులు స్వేచ్ఛా జీవులు. అందరికీ సమాన హక్కులు ఉంటాయి. మనమంతా కలిసికట్టుగా జాత్యహంకారంపై పోరాడాలి. మానవహక్కుల పరిరక్షణకు కృషిచేయాలి. అందుకు విద్య చాలా కీలకం.

 యునెస్కో



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు