Budget 2023: సప్త పథం
భయపెడుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులు... తరుముకొస్తున్న ఎన్నికలు... అయినా... స్థిర చిత్తం, ఆత్మనిర్భరత అంటూ బడ్జెట్లో దేశ ఆర్థిక సుస్థిరతకే మొగ్గు చూపింది నరేంద్ర మోదీ సర్కారు! 2024 లోక్సభ ఎన్నికలకు ముందు తమ ఆఖరి పూర్తిస్థాయి బడ్జెట్ పెడుతున్నా భారీ ఆకర్షణలకు పోలేదు... ఆర్భాటాలు ప్రకటించలేదు.
భారీ ఆకర్షణలకు పోని కేంద్ర బడ్జెట్
ఆర్థిక సుస్థిరత, సమ్మిళిత వృద్ధికే ప్రాధాన్యం
రూ.45.03 లక్షల కోట్లతో నిర్మలమ్మ ఎన్నికల పద్దు
మహిళలు, మధ్యతరగతి, యువతపై గురి
వేతన జీవులకు కాసింత ఊరట
రైల్వేలకూ భారీగా నిధుల కేటాయింపు
డిజిటల్ బాట.. గృహ నిర్మాణంపైనా దృష్టి
30 అంతర్జాతీయ నైపుణ్య భారత్ కేంద్రాలు
ఉపాధి హామీకి నిధుల కోత.. సబ్సిడీల తెగ్గోత
భయపెడుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులు... తరుముకొస్తున్న ఎన్నికలు... అయినా... స్థిర చిత్తం, ఆత్మనిర్భరత అంటూ బడ్జెట్లో దేశ ఆర్థిక సుస్థిరతకే మొగ్గు చూపింది నరేంద్ర మోదీ సర్కారు! 2024 లోక్సభ ఎన్నికలకు ముందు తమ ఆఖరి పూర్తిస్థాయి బడ్జెట్ పెడుతున్నా భారీ ఆకర్షణలకు పోలేదు... ఆర్భాటాలు ప్రకటించలేదు. అమృతకాల్ను తలచుకుంటూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2047 వందేళ్ల పండగకు ‘సప్తర్షి’ సంకల్పం పుచ్చుకొన్నారు. ఆర్థిక, సామాజిక సుస్థిరతకు, సమ్మిళిత అభివృద్ధికి పెద్దపీట వేస్తూనే... పొదుపు పథకంతో మహిళలు, ఆదాయపు పన్నులో మార్పులతో మధ్యతరగతి మదిని గెలిచే యత్నం చేశారు! మొత్తానికి సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటూ... పదో పద్దులో అందరికీ ఏదో ఒకటి ఉందనిపించిన నిర్మలమ్మ... గ్రామీణ భారతానికి కీలకమైన ఉపాధిహామీ నిధుల్లో మాత్రం భారీగా కోతపెట్టారు! వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబ్లను సవరించి.. కొత్త పథకాన్ని ఎంచుకునే వారికి రూ.7 లక్షల దాకా ఎలాంటి పన్ను భారం లేకుండా వేతనదారులకు కాసింత ఊరటనిచ్చారు.
పీఎం ప్రణామ్.. అమృత్ ధరోహర్
బడ్జెట్లో కొత్త పథకాలు, కార్యక్రమాలివీ...
సహకార సంఘాలకు జాతీయ సహకార డేటాబేస్
మూడేళ్లలో కోటిమంది రైతులు ప్రకృతి వ్యవసాయంవైపు
ఈనాడు, దిల్లీ: మునుపటిలా తిరుక్కురల్ నీతిసూత్రాల్లేవు. పెద్దగా మహనీయుల హితోక్తులూ లేవు. వారణాసి విశ్వనాథుడి సన్నిధిలో వినిపించే సప్తర్షి (సప్తరుషి) పదాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగానికి ఆలంబనగా చేసుకున్నారు. 30 పేజీల తన ఐదో బడ్జెట్ ప్రసంగాన్ని గంటా 26 నిమిషాల్లో పూర్తి చేశారు. దీన్ని అమృతకాలంలో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్గా అభివర్ణించుకున్న ఆమె... పెద్దగా ప్రజాకర్షక అంశాల జోలికి పోకుండా బడ్జెట్ బండిని జాగ్రత్తగా నడిపే ప్రయత్నం చేశారు. ప్రధాని మోదీ తొలినుంచీ చెబుతున్న సమ్మిళిత అభివృద్ధి, చిట్టచివర ఉన్న వ్యక్తికీ ప్రభుత్వ ప్రయోజనాలు అందించడం, మౌలికవసతులు, పెట్టుబడుల ఆకర్షణ, శక్తిసామర్థ్యాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడం, హరితరంగాలకు ప్రాధాన్యం ఇవ్వడం, యువశక్తిని గరిష్ఠస్థాయిలో ఉపయోగించుకోవడం, ఆర్థికరంగాన్ని సుస్థిరంగా ముందుకుసాగించడానికే... అత్యంత ప్రాధాన్యమిచ్చారు. వాటికి ‘సప్తర్షి’మార్గంగా నామకరణం చేశారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబ్లను సవరించి.. కొత్త పథకాన్ని ఎంచుకునే వారికి రూ.7 లక్షల దాకా ఎలాంటి పన్ను భారం లేకుండా వేతనదారులకు కాసింత ఊరటనిచ్చారు.
10 నుంచి 5కు చేరాం...
2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి దేశ ప్రజల తలసరి ఆదాయాన్ని రెట్టింపుచేసి రూ.1.97 లక్షలకు తీసుకెళ్లినట్లు ఆర్థిక మంత్రి ఘనంగా ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థను 10వ స్థానం నుంచి 5వ స్థానానికి తెచ్చినట్లు పేర్కొన్న ఆమె రాబోయే 25 ఏళ్లలో మహిళా ఆర్థిక సాధికారత, సంప్రదాయ హస్తకళాకారులకు నైపుణ్య శిక్షణ, పర్యాటకరంగ ప్రోత్సాహం, పర్యావరణ అనుకూల విధానాలకు చేయూతనివ్వడం ద్వారా కొత్త అవకాశాలను అందిపుచ్చుకోబోతున్నట్లు ప్రకటించారు. చిరుధాన్యాలకు ‘శ్రీఅన్న’గా నామకరణం చేసి ఆ రంగానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పారు. ఈ బడ్జెట్లో పలు కొత్త పథకాలను ప్రకటించారు.
* కృత్రిమ ఎరువుల వాడకాన్ని తగ్గించడమే లక్ష్యంగా ‘ప్రధానమంత్రి- వ్యవసాయ నిర్వహణకు ప్రత్యామ్నాయ పోషకాల ప్రోత్సాహం (పీఎం-ప్రణామ్)’ పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించే రాష్ట్రాలకు ఈ పథకం కింద ప్రోత్సాహకాలు అందజేస్తారు.
* విలువైన ఉద్యాన పంటలు వేసేందుకు నాణ్యమైన పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చేలా రూ.2,200 కోట్లతో ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ను ప్రారంభించనున్నారు.
* చిత్తడి నేలలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించేందుకు, జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు రానున్న మూడేళ్లపాటు ‘అమృత్ ధరోహర్’ పథకాన్ని అమలు చేయనున్నారు.
* చక్రీయ ఆర్థిక వ్యవస్థ (సర్క్యులర్ ఎకానమీ)ను ప్రోత్సహించేందుకు రూ.10 వేల కోట్ల పెట్టుబడితో గోవర్ధన్ పథకాన్ని ప్రకటించారు.
* తొలి దశలో లక్ష పురాతన శిలాశాసనాల్లోని వివరాలను డిజిటల్ రూపంలో భద్రపర్చడానికిగాను డిజిటల్ ఎపిగ్రఫీ మ్యూజియంలో ప్రత్యేకంగా శాసన భండారాన్ని ఏర్పాటుచేయనున్నారు.
* 30 అంతర్జాతీయ నైపుణ్య భారత్ కేంద్రాల ఏర్పాటు. లక్షల మంది యువత కోసం ‘ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన-4.0’ ప్రారంభం.
* కొత్తగా మిష్ఠీ పథకం కింద.. తీరప్రాంతాల వెంబడి మడ అడవుల పెంపకం.
* ‘ఒక జిల్లా - ఒక ఉత్పత్తి’ పరిధిలోని ఉత్పత్తులు, జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) వస్తువుల ప్రచారం, విక్రయాల కోసం యూనిటీ మాల్లను ఏర్పాటుచేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహం.
* హైదరాబాద్లోని మిల్లెట్ ఇన్స్టిట్యూట్ను సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్గా తీర్చిదిద్దేందుకు కేంద్రం సహకారం.
* కేవైసీ ప్రక్రియను సరళీకరించడంతో పాటు వ్యక్తిగత డేటాను గోప్యంగా ఉంచేందుకు జాతీయ డేటా గవర్నెన్స్ విధానం.
* గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి (ఆర్ఐడీఎఫ్) తరహాలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (యూఐడీఎఫ్) ఏర్పాటు.
* ఆదిమ కాలం నాటి గిరిజన తెగల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు రాబోయే మూడేళ్ల పాటు రూ.15 వేల కోట్లతో ‘ప్రధానమంత్రి - నిర్దిష్ట దుర్బల గిరిజన తెగల (పీఎం-పీవీటీజీ)’ అభివృద్ధి కార్యక్రమం అమలు.
* సహకార సంఘాల పనితీరును పర్యవేక్షించేందుకు జాతీయ సహకార డేటాబేస్కు రూపకల్పన.
* ఈ-కోర్టుల మూడోదశ పథకానికి రూ.7 వేల కోట్లు కేటాయించడం ద్వారా న్యాయాన్ని వేగంగా అందించడానికి ఉన్న అడ్డంకులను తొలగించే ప్రయత్నం చేశారు.
* ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు 66% కేటాయింపులు పెంచి పేదల ఇళ్ల నిర్మాణంలో రాబోయే వేగాన్ని చూపించారు.
* వ్యవసాయ, అనుబంధ రంగాలకు అందించే రుణాలను రూ.20 లక్షల కోట్లకు పెంచుతున్నామని ప్రకటించడం ద్వారా రైతులకు పెట్టుబడిపరమైన ఇబ్బందులు లేకుండా భరోసా కల్పించారు. రాబోయే మూడేళ్లలో కోటిమంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేందుకు 10 వేల బయోఇన్పుట్ రిసోర్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
మూలధనం పెంపుతో ఉపాధికి బాట
బడ్జెట్లో ప్రభుత్వ మూలధన వ్యయాన్ని 33% పెంచి రూ.10 లక్షల కోట్లమేర కేటాయించడం ద్వారా దేశంలో మౌలికవసతులు తద్వారా ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం ఇవ్వబోతున్న ప్రాధాన్యాన్ని మంత్రి చాటి చెప్పారు. రాష్ట్రాలుచేసే మూలధన వ్యయానికి చేయూతనివ్వడానికి ప్రస్తుతం కల్పిస్తున్న 50 ఏళ్ల వడ్డీ రహిత రుణ సౌకర్యాన్ని మరో ఏడాది పొడిగించారు. తద్వారా ఆర్థిక స్థిరత్వం విషయంలో రాష్ట్రాలను కలుపుకొనిపోయే ప్రయత్నం చేశారు. తద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి చేసే మూలధన వ్యయం మొత్తం రూ.13.7 లక్షల కోట్లకు చేరనుంది. రైల్వేలకూ మూలధన వ్యయం కింద రూ.2.40 లక్షల కోట్ల కేటాయింపు, రూ.75 వేల కోట్ల పెట్టుబడితో 100 లాజిస్టిక్స్ ప్రాజెక్టుల నిర్మాణం, ప్రాంతీయ అనుసంధానం కిందికి కొత్తగా 50 ఎయిర్పోర్టులు తీసుకురావడం ద్వారా ఆర్థిక వృద్ధికి రెక్కలు తొడిగే ప్రయత్నం చేశారు.
హరిత ఇంధన విప్లవం
2070 నాటికి కర్బన ఉద్గారాలు లేని ఇంధన వ్యవస్థను సృష్టించాలన్న లక్ష్యంతో గ్రీన్హైడ్రోజన్ మిషన్కు రూ.19,700 కోట్లు, ఇంధన రూపాంతరీకరణ కార్యక్రమానికి రూ.35 వేల కోట్లు, లద్దాఖ్ నుంచి 13 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని గ్రిడ్తో అనుసంధానించే సరఫరా వ్యవస్థ నిర్మాణానికి రూ.20 వేల కోట్లు కేటాయించడం ద్వారా హరిత ఇంధన రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను స్పష్టం చేశారు.
* మూలధన వ్యయ కేటాయింపులను 33%కే పరిమితం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పాత బడ్జెట్లో రూ.89,400 కోట్లు ఖర్చుకాగా, తాజా బడ్జెట్లో దాని కేటాయింపులను రూ.60 వేల కోట్లకు కుదించారు.
కర్ణాటకపై కరుణ
త్వరలో ఎన్నికలకు వెళుతున్న భాజపా పాలిత కర్ణాటకకు నిధుల రూపంలో ఆర్థిక మంత్రి ప్రత్యేక కరుణ చూపించారు. కర్ణాటకలోని కరవుపీడిత ప్రాంతంలో సూక్ష్మసేద్యం కల్పించడానికి రూ.5,300 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పడం ద్వారా పక్షపాతాన్ని ప్రదర్శించారు. కర్ణాటకను ఆనుకొని ఉన్న వెనుకబడిన రాయలసీమప్రాంతంలో, ఇదే సంవత్సరం ఎన్నికలకు వెళ్తున్న తెలంగాణలో కరవు అంతకుమించి ఉన్నప్పటికీ వాటికి సూక్ష్మసేద్య వరాలేమీ ప్రకటించలేదు. వరుసగా ఈ బడ్జెట్లోనూ ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్లోని గిఫ్ట్ సిటీకి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.
పట్టణ పన్నుల పెంపునకు సంకేతం
మున్సిపల్ బాండ్ల జారీకి తగ్గట్టు పట్టణ స్థానిక సంస్థలు తమ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవాలని చెప్పడం ద్వారా పట్టణాల్లో పన్నులు పెంచాలనే సంకేతం ఇచ్చారు. గ్రామీణ మౌలికవసతుల అభివృద్ధి నిధి (ఆర్ఐడీఎఫ్) తరహాలో రూ.10 వేల కోట్లతో పట్టణ మౌలికవసతుల అభివృద్ధి నిధిని ఏర్పాటుచేసి ద్వితీయ, తృతీయ అంచెల్లోని పట్టణాల్లో మౌలిక వసతులు ప్రకటించడం ద్వారా కిందిస్థాయి పట్టణాలకు మెరుగులుదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు వెల్లడించారు.
కేంద్రానిదీ అప్పుల బాటే
ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పదో బడ్జెట్... కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదని చెప్పకనే చెప్పింది. బడ్జెట్లో ప్రకటించిన ఆర్థిక లోటు లెక్కలే అందుకు నిదర్శనం. 2022-23లో కేంద్ర ప్రభుత్వ ఆర్థికలోటు 6.4% మేర నమోదైంది. 2023-24లో అది 5.9%కి పరిమితమవుతుందని మంత్రి ప్రకటించారు. ఈ లోటును భర్తీ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి రూ.11.8 లక్షల కోట్లు, చిన్నమొత్తాల పొదుపు, ఇతర మార్గాల నుంచి రూ.3.6 లక్షల కోట్లు కలిపి మొత్తం రూ.15.4 లక్షల కోట్ల రుణం సమీకరించాలని నిర్ణయించింది. ఈ వనరుల సమీకరణకు ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి సీనియర్ సిటిజన్ల డిపాజిట్ పరిమితులు, నెలవారీ ఆదాయ ఖాతా పథకంలో పొదుపుచేసే గరిష్ఠ సొమ్మును రెట్టింపు చేసింది.
చరిత్రాత్మక బడ్జెట్
అణగారిన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చింది
దేశ అభివృద్ధి కలల సాకారానికి పునాది
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై ప్రశంసలు
తాజా బడ్జెట్ చరిత్రాత్మకమైనది. సమాజంలో అణగారిన వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూనే భారత అభివృద్ధి కలల సంకల్పాన్ని నెరవేర్చేందుకు అమృత కాల తొలి బడ్జెట్ పునాది వేస్తుంది. ఆశల సమాజం, రైతులు, మధ్యతరగతి వర్గాల స్వప్నాలను నెరవేరుస్తుంది. సుసంపన్న, 2047 ఏడాది భారత అభ్యున్నతి లక్ష్యాలను సాకారం చేసే గొప్ప శక్తి మధ్య తరగతిది. ఈ వర్గం సాధికారతకు మా ప్రభుత్వం కొన్నేళ్లుగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా వారికి భారీ పన్ను ఉపశమనాలు కలిగించాం. సంప్రదాయ కళాకారులైన వడ్రంగులు, కమ్మర్లు, స్వర్ణకారులు, కుమ్మర్లు, శిల్పకారులు జాతి నిర్మాతలు. తొలిసారి ఇటువంటి వారందరి కోసం పలు పథకాలు తీసుకొచ్చాం. శిక్షణ, రుణాలు, మార్కెట్ మద్దతు వంటివి అందులో ఉన్నాయి. మరింత బలోపేతం చేయడం ద్వారా మహిళా స్వయం సహాయక బృందాలు అద్భుతాలు సృష్టిస్తాయి. బడ్జెట్లో తీసుకొచ్చిన ప్రత్యేక పొదుపు పథకాలు సాధారణ కుటుంబాల్లోని మహిళలను శక్తిమంతం చేస్తాయి. సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార నిల్వ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొస్తోంది. విజయవంతమైన డిజిటల్ చెల్లింపుల విధానం వ్యవసాయ రంగంలోనూ ఆవిష్కృతం కావాలి. ఇందుకోసం డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక పథకాన్ని తీసుకొస్తున్నాం. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఇరుసుగా సహకరిస్తుంది. మౌలిక రంగంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా చేస్తున్న రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి అభివృద్ధికి వేగాన్ని, కొత్త శక్తిని అందిస్తుంది. యువతకు ఉపాధి కల్పిస్తుంది. దేశ అభివృద్ధి నిర్మాణానికి దోహదపడే బడ్జెట్ను రూపొందించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు, ఆమె బృందానికి అభినందనలు.
నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఉపాధి ఆలోచనేదీ?
దేశంలో ఉపాధి కల్పన, ద్రవ్యోల్బణం నియంత్రణ వంటి ఆలోచనల్లేని మోదీ ‘మిత్ర్ కాల్’ బడ్జెట్ ఇది. భావి భారత నిర్మాణానికి కేంద్రం వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని రుజువైపోయింది. అసమానతలు తగ్గించే ఉద్దేశమే వీరికి లేదు. ఒక శాతం ధనికుల వద్ద 40 శాతం సంపద పేరుకుపోయింది. 42 శాతం యువత నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోంది. అయినా ప్రధానికి ఏమీపట్టదు.
సమ్మిళిత, దార్శనిక బడ్జెట్
స్వావలంబన భారత నిర్మాణమే మోదీ ప్రభుత్వ సంకల్పం. దీన్ని నెరవేర్చేందుకు దోహదపడేలా సర్వ సమ్మిళిత, దార్శనికతతో బడ్జెట్ను రూపొందించారు. పటిష్ఠ మౌలిక సదుపాయాలు, శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థ రూపకల్పనను ఇది ప్రతిబింబించింది. మధ్యతరగతి, వేతన జీవులకు ఊరట కలిగిస్తూ పన్ను రాయితీ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు ప్రతిపాదించారు.
అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
ఎరుపురంగు సంచిలో ట్యాబ్
కొవిడ్ నిబంధనల నేపథ్యంలో ఎంపీలకు 2021 నుంచి బడ్జెట్ పత్రాలు ఇవ్వట్లేదు. బుధవారం ఆయా పత్రాలను వెబ్సైట్, ప్రత్యేక యాప్ ద్వారా సభ్యులకు అందుబాటులో ఉంచారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2019 నుంచి ఆచరిస్తున్నట్లుగానే.. జాతీయ చిహ్నంతో కూడిన ఎరుపు రంగు వస్త్ర సంచిలో ట్యాబ్ను పెట్టుకొని పార్లమెంటుకు వచ్చారు.
వరుసగా 5 బడ్జెట్లు.. 6వ ఆర్థిక మంత్రి
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక వరుసగా 5 బడ్జెట్లు ప్రవేశపెట్టిన 6వ కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ గుర్తింపు పొందారు. 2019లో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టగా.. బుధవారం ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్ 5వది. ఇంతకుముందు వరుసగా 5, అంతకన్నా ఎక్కువగా కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్సిన్హా, మన్మోహన్సింగ్, మొరార్జీ దేశాయ్ల సరసన ప్రస్తుతం నిర్మలా సీతారామన్ చేరారు. అలానే ఇందిరాగాంధీ తర్వాత కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళగానూ ఆమె ఇప్పటికే గుర్తింపు పొందారు.
* 2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక.. (2019లో సాధారణ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్తో కలిపి) ప్రవేశపెట్టిన 11వ బడ్జెట్ ఇది.
ఇదే చిన్నప్రసంగం
నిర్మలా సీతారామన్ ఇప్పటివరకు చేసిన బడ్జెట్ ప్రసంగాల్లో ఈసారే అతి తక్కువ సమయం కొనసాగింది. ఈసారి ఆమె దేశ పద్దును 86 నిమిషాల్లో(1 గంట 26 నిమిషాలు) పార్లమెంటు వేదికగా ప్రజల ముందుంచారు. అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా ఆమె ఖాతాలోనే ఉంది. 2020-21 బడ్జెట్ ప్రవేశపెడుతూ 162 నిమిషాల పాటు ప్రసంగించారామె. ఒంట్లో నలత కారణంగా మరో రెండు పేజీలు మిగిలి ఉండగానే ప్రసంగాన్ని ముగించారు. బడ్జెట్ చరిత్రలో ఇదే ఇప్పటివరకు సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది.
విజిటర్స్ గ్యాలరీలో వాంగ్మయి పరకాల
నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నప్పుడు లోక్సభ సందర్శకుల గ్యాలరీ కిటకిటలాడింది. మంత్రి బంధువర్గంతో కలిసి కూర్చొన్న కుమార్తె వాంగ్మయి పరకాల అందరి దృష్టిని ఆకర్షించారు. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, పలువురు రాజ్యసభ సభ్యులు సైతం గ్యాలరీలో కూర్చొని బడ్జెట్ ప్రతిపాదనలు రాసుకోవడం కనిపించింది.
రాష్ట్రపతి ఇంటి నిర్వహణ ఖర్చు రూ.10 కోట్లు తగ్గింది
రాష్ట్రపతి నివాసం నిర్వహణ ఖర్చుల కోసం కేటాయించే నిధులను బడ్జెట్లో తగ్గించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.10 కోట్ల మేర కేటాయింపులు తగ్గాయి. 2023-24 బడ్జెట్లో రాష్ట్రపతి భవన్ ఖర్చులు..సిబ్బంది జీతాలకు రూ.36.22 కోట్లు కేటాయించారు. గత ఏడాది ఇదే పనుల కోసం రూ.41.68 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల మేరకు ఖర్చు రూ.46.27 కోట్లకు చేరింది.
పొల్యూటింగ్.. పొలిటికల్
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తుక్కు విధానం గురించి మాట్లాడుతుండగా దొర్లిన తప్పు అధికార, విపక్ష సభ్యుల్లో నవ్వులు పూయించింది. ‘రీప్లేసింగ్ ఓల్డ్ పొల్యూటింగ్ వెహికల్స్’ బదులు ‘రీప్లేసింగ్ ఓల్డ్ పొలిటికల్...’ అని చదవడంతో అందరూ నవ్వారు. ఆర్థిక మంత్రి ఒక్కక్షణం ఆగి, తనూ నవ్వుకుని తప్పును సరిదిద్దుకుని ప్రసంగాన్ని కొనసాగించారు.
చిరుధాన్యం... శ్రీఅన్నం
చిరుధాన్యాలను ‘శ్రీఅన్న’గా నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. భారతదేశ ఆహార విధానంలో శతాబ్దాలుగా చిరుధాన్యాలు భాగంగా ఉన్నాయని గుర్తుచేశారు.
అమృత్కాల్లో ప్రవేశ పెడుతున్న తొలి బడ్జెట్ ఇది. అన్ని వర్గాల సంక్షేమానికీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.
75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపు కొంటున్న తరుణాన మనదేశ ఆర్థికవ్యవస్థను ‘ధ్రువతార’గా ప్రపంచం గుర్తించింది.
సవాళ్లను ఎదుర్కొనేందుకు, స్థిరమైన ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు ‘వసుధైక కుటుంబం’ ఇతివృత్తంగా ప్రతిష్ఠాత్మకంగా ముందుకు సాగుతున్నాం.
నిర్మలా సీతారామన్
సబ్కా సాథ్ సబ్కా వికాస్’ అనే ప్రభుత్వ విధానం వల్ల రైతులు, మహిళలు, యువత, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి సులభతరమైంది.
పంచామృతం’ కోసం భారత్ దృఢంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా 2070 నాటికి కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించేందుకు... హరిత పారిశ్రామిక వృద్ధి సాధనకు పాటుపడతాం.
ప్రామాణిక తగ్గింపు (స్టాండర్డ్ డిడక్షన్) ప్రయోజనాన్ని కొత్త పన్ను విధానానికి విస్తరించాలని నేను ప్రతిపాదిస్తున్నా. వార్షికాదాయం రూ.15.5 లక్షలకు పైగా ఉన్న వేతనజీవులు ప్రతి ఒక్కరూ రూ.52,500 మేర లబ్ధి పొందుతారు.
తగ్గనున్న వాస్తవ జీడీపీ
దేశ నామినల్ జీడీపీ (వాస్తవ జీడీపీ, ద్రవ్యోల్బణం కలిపి) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15.4% మేర వృద్ధి చెందుతుందని అంచనా. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ పెరుగుదల తగ్గనుంది. వాస్తవ జీడీపీ ప్రస్తుత విత్త సంవత్సరంలో 7% మేర, వచ్చే ఏడాది 6-6.5% మేర వృద్ధి చెందుతుందని అంచనా.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర బడ్జెట్లో ముఖ్యాంశాలు
* బడ్జెట్లో ఏడు ప్రాధాన్యాలను ఎంచుకున్న నిర్మలాసీతారామన్ వాటిని ‘సప్తర్షి’గా అభివర్ణించారు.
* అమృత కాలంలో వస్తున్న ఈ తొలి బడ్జెట్...అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దేందుకు బలమైన పునాదిని నిర్మిస్తుందన్నారు.
* 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 5.9 శాతానికి పరిమితం చేస్తామని పేర్కొన్నారు. 2022-23లో ద్రవ్యలోటును 6.4 శాతంగా సవరించారు.
* మూలధన పెట్టుబడి వ్యయం అంచనాను 33 శాతం మేర భారీగా పెంచి రూ.10 వేల కోట్లు కేటాయించారు. ఈ మొత్తం జీడీపీలో 3.3 శాతానికి సమానం. తాజా కేటాయింపు 2020లో కన్నా మూడు రెట్లు అధికం.
* మహిళలకు కొత్త పొదుపు పథకం.. మహిళా సమ్మాన్ పొదుపు పత్రం. రూ.2 లక్షల వరకూ ఏకకాలంలో పొదుపు చేసుకోవచ్చు. రెండేళ్ల పాటు ఆ సొమ్మును దాచుకోవచ్చు. వడ్డీ 7.5శాతం.
* వయోధికులు పొదుపు పథకాల్లో గరిష్ఠంగా మదుపు చేసుకునే పరిమితి మొత్తం రెట్టింపయ్యింది. ప్రస్తుతమున్న రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెరిగింది.
* వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణాలు రూ.20 లక్షల కోట్లకు పెంపు.
* రాష్ట్రాల ద్రవ్యలోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో 3.5శాతం వరకు ఉండవచ్చు. ఇందులో 0.5 శాతాన్ని విద్యుత్ రంగ సంస్కరణలతో ముడిపెట్టారు.
* దేశ ప్రజల తలసరి ఆదాయం రూ.1.97 లక్షలకు పెరిగింది.
కరోనా మహమ్మారి విజృంభించిన కష్టకాలంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే మానవతా దృక్పథంతో 28 నెలల పాటు 80 కోట్ల మందికి ఉచితంగా తిండి గింజల్ని అందించాం.
విస్తృత సంస్కరణలు, ఘనమైన విధానాలను ‘సబ్ కా ప్రయాస్’ ద్వారా అమలు చేయడంతో ‘జన్ భాగిదారి’ సాధ్యమైంది. ఫలితంగా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంతో పాటు ప్రతికూల పరిస్థితుల్లోనూ రాణించాం.
నిర్మలా సీతారామన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
Sunetra Pawar: బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు రూ.25 వేల కోట్ల బ్యాంకు స్కామ్ కేసులో క్లీన్ చిట్ లభించింది. -
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
Viral video: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
ఎన్నికల వేళ.. రాజస్థాన్లోని బన్స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. -
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ