Budget 2023: ‘హోం’కు పెరిగిన కేటాయింపులు

అంతర్గత భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ తాజా బడ్జెట్‌లో రూ.1.96 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. గత ఏడాది చేసిన రూ.1,85,776.55 కోట్ల కేటాయింపుల కన్నా ఇది అధికం.

Updated : 02 Feb 2023 05:50 IST

అంతర్జాతీయ సరిహద్దుల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యం  
ప్రధాని భద్రతా విభాగానికి రూ.433.59 కోట్లు

దిల్లీ: అంతర్గత భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ తాజా బడ్జెట్‌లో రూ.1.96 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. గత ఏడాది చేసిన రూ.1,85,776.55 కోట్ల కేటాయింపుల కన్నా ఇది అధికం. హోంశాఖకు తాజాగా చేసిన కేటాయింపుల్లో సింహ భాగాన్ని కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, నిఘా సేకరణ యంత్రాంగానికి కేంద్రం ప్రత్యేకించింది. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి రోడ్లు వంటి సౌకర్యాలకు, పోలీసు మౌలిక వసతుల మెరుగుకు, పోలీసు దళాల ఆధునికీకరణకు గణనీయ స్థాయిలో కేటాయింపులు జరిగాయి.

తాజా బడ్జెట్‌లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు రూ.1,27,756.74 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది ఈ కేటాయింపులు రూ.1,19,070.36 కోట్లుగా ఉన్నాయి.

అంతర్గత భద్రత విధుల్లో నిమగ్నమయ్యే సీఆర్పీఎఫ్‌కు రూ.31,772.23 కోట్లు ప్రతిపాదించారు. గత బడ్జెట్‌లో ఈ దళానికి రూ.31,495.88 కోట్లు కేటాయించారు.

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ వెంబడి ఉన్న సరిహద్దులను రక్షించే బీఎస్‌ఎఫ్‌కు గత ఏడాది రూ.23,557.51 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.24,771.28 కోట్లు ప్రతిపాదించారు.

అణు కేంద్రాలు, విమానాశ్రయాల వంటి కీలక ప్రదేశాల భద్రతను పర్యవేక్షించే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాని (సీఐఎస్‌ఎఫ్‌)కి గత బడ్జెట్‌లో రూ.12,293.23 కోట్లను ఇవ్వగా, తాజాగా 13,214.68 కోట్లు కేటాయించారు.

నేపాల్‌, భూటాన్‌ సరిహద్దులను రక్షించే సశస్త్ర సీమా బల్‌కు గత ఏడాది రూ.8,019.78 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.8,329.10 కోట్లు ప్రతిపాదించారు.

భారత్‌-చైనా సరిహద్దు భద్రత బాధ్యతలను చేపట్టే ఐటీబీపీకి గత బడ్జెట్‌లో రూ.7,626.38 కోట్లు కేటాయించగా ఇప్పుడు రూ.8,096.89 కోట్లు ప్రత్యేకించారు.

భారత్‌-మయన్మార్‌ సరిహద్దుల్లో, ఈశాన్య ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న అస్సాం రైఫిల్స్‌కు గత బడ్జెట్‌లో రూ.6,561.33 కోట్లు ప్రతిపాదించగా తాజాగా రూ.7,052.46 కోట్లు కేటాయించారు.

అత్యవసర భద్రతా పరిస్థితులను ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసిన జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ)కి రూ.1,286.54 కోట్లు కేటాయించారు. గత ఏడాది ఈ దళానికి రూ.1,183.80 కోట్లు ప్రత్యేకించారు.

ఇంటెలిజెన్స్‌ బ్యూరోకు రూ.3,418.32 కోట్లు, దిల్లీ పోలీసు విభాగానికి రూ.11,662.03 కోట్లు కేటాయించారు.

ప్రధాని భద్రతను చూసే ప్రత్యేక భద్రతా దళాని(ఎస్‌పీజీ)కి గత ఏడాది రూ.411.88 కోట్లు కేటాయించగా.. తాజా బడ్జెట్‌లో రూ.433.59 కోట్లు ప్రత్యేకించారు.

సరిహద్దుల్లో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.3,545.03 కోట్లు కేటాయించారు. గత ఏడాది ఈ పద్దు కింద రూ.3,738.98 కోట్లు ప్రతిపాదించారు.

పోలీసు మౌలిక వసతుల అభివృద్ధికి రూ.3,636.66 కోట్లను ఇచ్చారు. 2022-23 బడ్జెట్‌లో రూ.2,188.38 కోట్లను ప్రత్యేకించారు.

పోలీసు దళాల ఆధునికీకరణకు రూ.3,750 కోట్లను ప్రతిపాదించారు. గత ఏడాది దీనికోసం రూ.2,432.06 కోట్లు కేటాయించారు.

భద్రత సంబంధ వ్యయం కోసం రూ.2780.88 కోట్లు, జనాభా లెక్కల సేకరణ పనులకు రూ.1,564.65 కోట్లు, మహిళా భద్రతా పథకాలకు రూ.1,100 కోట్లు, ఫోరెన్సిక్‌ సంస్థల ఆధునికీకరణకు రూ.700 కోట్లు, సరిహద్దు చెక్‌పోస్టుల నిర్వహణకు రూ.350.61 కోట్లు కేటాయించారు.


సీబీఐకి స్వల్ప పెరుగుదల

దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐకి తాజా బడ్జెట్‌లో రూ.946 కోట్లు కేటాయించారు. గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే ఇది 4.4 శాతం అధికం. 2022-23 బడ్జెట్‌ అంచనాల్లో ఈ విభాగానికి రూ.841.96 కోట్లు కేటాయించగా.. సవరించిన అంచనాల్లో అది రూ.906.59 కోట్లకు పెరిగింది. తాజా బడ్జెట్‌లో సీబీఐ శిక్షణ కేంద్రాల ఆధునికీకరణ, సాంకేతిక, ఫోరెన్సిక్‌ తోడ్పాటు విభాగాలకు నిధులు ప్రత్యేకించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని