జోషీమఠ్‌ సమీపంలో జల విద్యుత్‌ ప్రాజెక్టులు లేవు

జోషీమఠ్‌ సమీపంలో ఎటువంటి జల విద్యుత్‌ ప్రాజెక్టులు లేవని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌.కే.సింగ్‌ తెలిపారు.

Updated : 03 Feb 2023 05:56 IST

కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌

ఈనాడు, దిల్లీ: జోషీమఠ్‌ సమీపంలో ఎటువంటి జల విద్యుత్‌ ప్రాజెక్టులు లేవని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌.కే.సింగ్‌ తెలిపారు. ఇటీవల జోషీమఠ్‌లో పగుళ్లు, నేల కుంగుబాటు నేపథ్యంలో హిమాలయాల్లోని జల విద్యుత్‌ ప్రాజెక్టులు, వాటి అనుమతులు, జోషీమఠ్‌ ఘటనతో ఆ ప్రాజెక్టుల పడే ప్రభావంపై హైదరాబాద్‌ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ ప్రశ్నించారు. ఓవైసీ ప్రశ్నకు కేంద్ర మంత్రి లోక్‌సభలో గురువారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జోషీమఠ్‌కు దూరంగా తపోవన్‌ విష్ణుగాడ్‌ ప్రాజెక్టు ఉందని సింగ్‌ వెల్లడించారు. ఇటీవల జోషీమఠ్‌లో వచ్చిన పగుళ్లు, నేల కుంగుబాటుల ప్రభావం ఆ ప్రాజెక్ట్‌పై పడలేదని తెలిపారు. అయినప్పటికీ తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని జనవరి అయిదో తేదీన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. 25 మెగావాట్ల కన్నా ఎక్కువ స్థాపిత సామర్థ్యం ఉన్న 30 భారీ జల విద్యుత్‌ ప్రాజెక్టులు హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్నాయని, వాటి మొత్తం స్థాపిత సామర్థ్యం 11,137 మెగావాట్లని మంత్రి పేర్కొన్నారు. 30,800 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పాదన లక్ష్యంగా 2019లో కేంద్రం ప్రారంభించిన పీఎం-కుసుమ్‌ పథకాన్ని 2026 మార్చి వరకు కేంద్రం పొడిగిస్తున్నట్లు మంత్రి మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని