2022 నాటికి సుప్రీంకోర్టులో 69,768 అపరిష్కృత కేసులు

సుప్రీంకోర్టులో 2022 నాటికి 69,768 కేసులు అపరిష్కృతంగా (పెండింగ్‌) ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు.

Updated : 04 Feb 2023 05:32 IST

తెలంగాణ హైకోర్టులో 2,36,549 కేసుల పెండింగ్‌

ఈనాడు, దిల్లీ: సుప్రీంకోర్టులో 2022 నాటికి 69,768 కేసులు అపరిష్కృతంగా (పెండింగ్‌) ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. ఎంపీలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. తెలంగాణ హైకోర్టులో 2,36,549 కేసులు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 2,40,569 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని మంత్రి వెల్లడించారు. 2002 సెప్టెంబరు 30 నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లో 8,27,790 కేసులు, తెలంగాణలోని జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లో 8,22,658 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు.

* ఒకే ర్యాంకు-ఒకే పింఛను కింద 2014 నుంచి ఇప్పటి వరకు సైనికులు, సైనిక కుటుంబాల పింఛన్ల కోసం రూ.57 వేల కోట్లు చెల్లించినట్లు రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్‌భట్‌ తెలిపారు. ఏడాదికి సగటున రూ.7,123 కోట్లు చెల్లించామన్నారు. ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కనుమూరు రఘురామ కృష్ణరాజు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో 72,706, తెలంగాణలో 30,657, దేశవ్యాప్తంగా 26,70,920 మంది మాజీ సైనికోద్యోగులు ఉన్నారని వీరిలో మాజీ సైనికోద్యోగుల కోటాలో వివిధ విభాగాల్లో 44,904 మంది ఉద్యోగాలు చేస్తున్నారని రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌ తెలిపారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

ఈ-లోక్‌ అదాలత్‌లలో భాగంగా 2020 నుంచి ఇప్పటి వరకు ఏపీలో 22,733 కేసులు విచారించి 15,714 కేసులు, తెలంగాణలో 13,337 కేసులకు 11,270 పరిష్కరించినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. ఎంపీ మార్గాని భరత్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీలో 9, తెలంగాణలో 6 శాశ్వత లోక్‌అదాలత్‌లు పని చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని