దేశంలో వాస్తవ కరోనా కేసులు ప్రభుత్వ లెక్కల కన్నా 17 రెట్లు అధికం!

మన దేశంలో ఇప్పటి వరకూ ఎంత మందికి కరోనా వైరస్‌ సోకి ఉండవచ్చు? ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం సుమారు 4.50 కోట్ల మంది ఆ మహమ్మారి బారిన పడ్డారు.

Updated : 09 Feb 2023 06:22 IST

బీహెచ్‌యూ శాస్త్రవేత్తల అధ్యయనం

దిల్లీ: మన దేశంలో ఇప్పటి వరకూ ఎంత మందికి కరోనా వైరస్‌ సోకి ఉండవచ్చు? ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం సుమారు 4.50 కోట్ల మంది ఆ మహమ్మారి బారిన పడ్డారు. అయితే, బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం(బీహెచ్‌యూ) శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం వాస్తవంగా కరోనా సోకిన వారి సంఖ్య అంతకు 17 రెట్లు అధికంగా ఉంటుంది. వారి అధ్యయన పత్ర వివరాలు ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌’ (ఐజేఐడీ)లో ప్రచురితమయ్యాయి. ప్రభుత్వ గణాంకాలకు, వాస్తవ పరిస్థితికి మధ్య ఈ వ్యత్యాసం ప్రధానంగా అసింప్టమాటిక్‌ (వైరస్‌ సోకినా లక్షణాలు బహిర్గతం కాని) కేసుల వల్లేనని అధ్యయనానికి నేతృత్వం వహించిన బీహెచ్‌యూ జన్యుశాస్త్ర ప్రొఫెసర్‌ జ్ఞానేశ్వర్‌ చౌబే తెలిపారు. అసింప్టమాటిక్‌ కేసులు యువ జనాభా(26-35 ఏళ్ల వయస్సు)లో అత్యధికమని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 34 పరిశోధన సంస్థలకు చెందిన 88 మంది శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో భాగస్వాములయ్యారు. ఆరు రాష్ట్రాల పరిధిలోని 14 జిల్లాల్లో 2020 సెప్టెంబరు-డిసెంబరు మాసాల మధ్య ఈ బృందం విస్తృత స్థాయిలో సీరోసర్వే(యాంటీబాడీ) పరీక్షలు నిర్వహించింది. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు వీరిలో ఉన్నారు. వారందరూ తమకు ఎన్నడూ కరోనా లక్షణాలు కనిపించలేదని లేదా ఆర్టీపీసీఆర్‌ పరీక్షకు వెళ్లలేదని చెప్పిన వారే. కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకూ దేశంలో 4,46,83,639 మందికి కరోనా సోకింది. వీరిలో 5,30,746 మంది మృతి చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని