గాంబియా మరణాలకు కారణం అదే

భారత్‌లో తయారైన కొన్ని కలుషిత దగ్గుమందుల వినియోగం వల్లే గాంబియాలో పిల్లల మరణాలు సంభవించాయని అమెరికా వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ), గాంబియా ఆరోగ్య అధికారుల సంయుక్త దర్యాప్తు నిగ్గుతేల్చింది.

Updated : 05 Mar 2023 06:34 IST

భారత్‌ నుంచి ఎగుమతి అయిన దగ్గు మందులో డైఇథలిన్‌ గ్లైకాల్‌ 

దిల్లీ: భారత్‌లో తయారైన కొన్ని కలుషిత దగ్గుమందుల వినియోగం వల్లే గాంబియాలో పిల్లల మరణాలు సంభవించాయని అమెరికా వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ), గాంబియా ఆరోగ్య అధికారుల సంయుక్త దర్యాప్తు నిగ్గుతేల్చింది. భారత్‌కు చెందిన మైడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ సంస్థ గాంబియాకు ఎగుమతి చేసిన నాలుగు రకాల దగ్గు మందుల్లో నాణ్యత లేదని, వాటిని సేవించిన పిల్లల్లో ఎక్కువ మంది చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) గత అక్టోబరులో హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సీడీసీ-గాంబియా అధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపారు. ఆ నివేదిక శుక్రవారం విడుదలైంది. ‘‘డైఇథలిన్‌ గ్లైకాల్‌(డీఈజీ), ఇథలిన్‌ గ్లైకాల్‌(ఈజీ)తో కలుషితమైన ఔషధాలు గాంబియాలోకి దిగుమతి అయ్యాయి. వాటిని వినియోగించిన పిల్లల్లో తీవ్ర కిడ్నీ గాయాలు(ఏకేఐ) ఏర్పడ్డాయి. డీఈజీ విష ప్రభావం వల్ల మానసిక సమస్యలు, తలనొప్పి, జీర్ణాశయ సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే ప్రధానంగా ఏకేఐ ముప్పు అధికంగా ఉంటుంది. మూత్రం తక్కువగా రావడం, ఇతర కారణాలతో కిడ్నీ వ్యవస్థ విఫలమవుతుంది’’ అని నివేదిక పేర్కొంది. ఉత్పత్తి సంస్థ దగ్గుమందు తయారీ సమయంలో ఖరీదైన ద్రావకం స్థానంలో డీఈజీని వినియోగించినట్లు తెలుస్తోందని నివేదిక వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని