Rajinikanth: అందుకే రాజకీయాలకు దూరమయ్యా: రజనీకాంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

తనకు మూత్రపిండాల సమస్య ఉండటం వల్లే రాజకీయాలకు దూరమయ్యానని ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌ వెల్లడించారు. శనివారం రాత్రి చెన్నైలోని మ్యూజిక్‌ అకాడమీలో జరిగిన సేఫియన్స్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ రజతోత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడితో కలిసి ఆయన అతిథిగా పాల్గొన్నారు.

Updated : 12 Mar 2023 07:35 IST

దేవుడు లేడనేవారు రక్తం తయారుచేసి చూపించాలని సవాల్

చెన్నై (టీ నగర్‌), న్యూస్‌టుడే: తనకు మూత్రపిండాల సమస్య ఉండటం వల్లే రాజకీయాలకు దూరమయ్యానని ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌ వెల్లడించారు. శనివారం రాత్రి చెన్నైలోని మ్యూజిక్‌ అకాడమీలో జరిగిన సేఫియన్స్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ రజతోత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడితో కలిసి ఆయన అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూత్రపిండాల సమస్యతో చికిత్స పొందుతున్నప్పుడే రాజకీయ ప్రవేశం చేయాలని అనుకున్నట్లు తెలిపారు. కానీ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనరాదని అప్పట్లో డాక్టర్‌ రాజన్‌ రవిచంద్రన్‌ సలహా ఇచ్చారన్నారు. కరోనా సమయంలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా చాలామంది తనకు ఇదే సలహా ఇచ్చారని వెల్లడించారు. బహిరంగ సభల్లోనూ పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిందని, అందువల్లే రాజకీయాల నుంచి వైదొలిగానని తెలిపారు. ఈ విషయాలన్నీ చెబితే తాను భయపడుతున్నానని అనుకుంటారని, అందుకే ఎక్కడా చెప్పలేదని వివరించారు.

శరీరంలోని వ్యవస్థను చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుందని, రక్తాన్ని మానవులెవరూ తయారు చేయలేరని అన్నారు. దేవుడున్నాడు అనేందుకు ఇదే నిదర్శనమని తెలిపారు. దేవుడు లేడు అనేవారు కనీసం ఒక బొట్టు రక్తాన్నైనా తయారుచేసి చూపించాలని సవాలు చేశారు. ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావొద్దని రజనీకాంత్‌కు తాను హితవు పలికినట్లు గుర్తుచేశారు. ఆ సమయంలో తనను ఆయన అపార్థం చేసుకున్నారని తెలిపారు. యువత ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటు పడుతున్నారని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొనేలా పెద్దలు చొరవ చూపాలని హితవు పలికారు. కార్యక్రమంలో సేఫియన్స్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రాజన్‌ రవిచంద్రన్‌, ట్రస్టీ సుందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు