దొరకని అమృత్‌పాల్‌ సింగ్‌.. ముమ్మరంగా అన్వేషణ

చిక్కినట్లే చిక్కి చేజారిపోయిన వివాదాస్పద మతబోధకుడు, ఖలిస్థానీ సానుభూతిపరుడైన అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం పంజాబ్‌ పోలీసుల వేట ముమ్మరంగా కొనసాగుతోంది.

Updated : 20 Mar 2023 06:08 IST

కారులో లభ్యమైన తూటాలు..  
మొబైళ్లలో ఇంటర్నెట్‌పై నిషేధం పొడిగింపు

చండీగఢ్‌: చిక్కినట్లే చిక్కి చేజారిపోయిన వివాదాస్పద మతబోధకుడు, ఖలిస్థానీ సానుభూతిపరుడైన అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం పంజాబ్‌ పోలీసుల వేట ముమ్మరంగా కొనసాగుతోంది. రహదారులపై భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వదంతుల వ్యాప్తిని నిరోధించడానికిగానూ మొబైళ్లలో ఇంటర్నెట్‌, ఎస్‌ఎంఎస్‌ సేవల నిలుపుదలను సోమవారం మధ్యాహ్నం వరకు పొడిగిస్తూ పంజాబ్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రులు, బ్యాంకుల సేవల్ని దృష్టిలో పెట్టుకుని బ్రాడ్‌బ్యాండ్‌పై మాత్రం నిషేధం విధించలేదు. తమ నాయకుడిపై పోలీసుల చర్యలకు నిరసనగా ఆదివారం ధర్నాకు పిలుపునిచ్చిన 34 మంది సానుభూతిపరులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా ప్రధాన నగరాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. అమృత్‌పాల్‌ కాన్వాయ్‌కి చెందినదిగా భావిస్తున్న ఓ కారును జలంధర్‌ జిల్లాలో పోలీసులు గుర్తించారు. దాని తాళాలు, ఒక వాకీటాకీ, తుపాకీ, డజన్ల కొద్దీ తూటాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తమ నాయకుడే కొనుగోలు చేశాడని పోలీసులకు పట్టుబడిన ‘వారిస్‌ పంజాబ్‌ దే’ అనుచరుడొకరు వెల్లడించాడు. దీంతో అక్రమ ఆయుధాల కోణంలో అమృత్‌పాల్‌, అతని అనుచరులు కొందరిపై పోలీసులు కొత్తగా రెండు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేసినట్లు అమృత్‌సర్‌ సీనియర్‌ ఎస్పీ వెల్లడించారు. వీరి నుంచి 12 తుపాకులు, 193 తూటాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

2,500 కి.మీ. దూరానికి తరలింపు

అరెస్టయిన అనుచరుల్లో కీలకమైన నలుగురు వ్యక్తులను ప్రత్యేక విమానంలో అస్సాంలోని డిబ్రూగఢ్‌ కేంద్ర కారాగారానికి అధికారులు ఆదివారం తరలించారు. 2,500 కి.మీ. దూరానికి తరలించడానికి కారణమేమిటనేది చెప్పేందుకు ఏ అధికారీ సుముఖత వ్యక్తపరచలేదు. నలుగురికీ జైల్లో పూర్తి రక్షణ కల్పిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ దిల్లీలో విలేకరులకు తెలిపారు. తాము దాదాపు 25 కి.మీ. దూరం వరకు వెంటాడినా ప్రధాన నిందితుడు వాహనాలు మారుతూ తప్పించుకున్నాడని, త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. శీఘ్ర స్పందన బలగాలతో కలిసి జలంధర్‌ పోలీసు కమిషనర్‌ ఆ నగరంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. గాలింపు చర్యల్లో భాగంగా అమృత్‌పాల్‌ స్వగ్రామం జల్లుపుర్‌లోని నివాసంలోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. పంజాబ్‌ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పదంగా కనిపిస్తున్న ప్రతి వాహనాన్నీ తనిఖీ చేస్తున్నారు.

హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు

అమృత్‌పాల్‌సింగ్‌ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారనీ, విడుదలకు ఆదేశించాలని కోరుతూ పంజాబ్‌-హరియాణా హైకోర్టులో ఆదివారం అత్యవసరంగా హెబియస్‌  కార్పస్‌ పిటిషన్‌ దాఖలైంది. దీనిపై మంగళవారంలోగా స్పందించాల్సిందిగా పంజాబ్‌ ప్రభుత్వానికి జస్టిస్‌ ఎన్‌.ఎస్‌.షెకావత్‌ ఆదేశాలు జారీచేశారు. ఆదివారం సెలవుదినం కావడంతో తన నివాసంలోనే విచారణ జరిపారు.


వ్యసన విముక్తి పేరుతో మానవ బాంబుల తయారీ..!

ఖలిస్థాన్‌ అనుకూల బోధకుడు అమృత్‌పాల్‌సింగ్‌ కార్యకలాపాలపై నిఘా వర్గాల సమాచారం ఆధారంగా అధికారులు ఒక నివేదిక రూపొందించారు. మాదకద్రవ్య వ్యసన విముక్తి కేంద్రాలను, ఒక గురుద్వారాను అడ్డం పెట్టుకుని ఆయుధాలను నిల్వ చేయడంతోపాటు ఆత్మాహుతి దాడులకు యువతను సిద్ధం చేస్తున్నాడని దీనిలో పేర్కొన్నారు. దుబాయ్‌ నుంచి తిరిగివచ్చిన ఈ వ్యక్తి అనేకమంది యువకుల మనసుల్ని మార్చి, వారిని మానవ బాంబులుగా మారుస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదులు హతమైనప్పుడు వారిని పోరాటయోధులుగా కీర్తిస్తుండేవాడని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని