సంక్షిప్త వార్తలు(6)

నిషేధిత పాపులర్‌ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) అధ్యక్షుడు నాసిర్‌ పాషాతో కలిపి 15 మందిపై ఎన్‌ఐఏతో కలిసి కర్ణాటకలోని కాడుగొండనహళ్లి పోలీసులు కోర్టులో 10,196 పేజీల అభియోగపత్రాన్ని దాఖలు చేశారు. వీరిలో 9మందిపై యూఏపీఏ చట్టం కింద, మిగిలిన వారిపై ఐపీసీ 153 ఏ కింద కేసు నమోదైంది.

Updated : 20 Mar 2023 06:09 IST

పీఎఫ్‌ఐ అధ్యక్షుడిపై  ఎన్‌ఐఏ అభియోగపత్రం

బెంగళూరు, న్యూస్‌టుడే: నిషేధిత పాపులర్‌ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) అధ్యక్షుడు నాసిర్‌ పాషాతో కలిపి 15 మందిపై ఎన్‌ఐఏతో కలిసి కర్ణాటకలోని కాడుగొండనహళ్లి పోలీసులు కోర్టులో 10,196 పేజీల అభియోగపత్రాన్ని దాఖలు చేశారు. వీరిలో 9మందిపై యూఏపీఏ చట్టం కింద, మిగిలిన వారిపై ఐపీసీ 153 ఏ కింద కేసు నమోదైంది.


పొగ పీల్చిన వారిలో కరోనా తీవ్రత ఇంకా ఎక్కువ

దిల్లీ: పొగతాగే అలవాటు లేకపోయినా.. వేరేవారు పొగ తాగుతున్నప్పుడు దానిని పీల్చినవారికి (సెకెండ్‌ హ్యాండ్‌ స్మోకర్స్‌కి) కొవిడ్‌-19 ముప్పు తీవ్రత మరింత ఎక్కువ అని ఎయిమ్స్‌-గోరఖ్‌పుర్‌ అధ్యయనంలో వెల్లడైంది. ఆరు రాష్ట్రాల్లో తొలిసారిగా దీనిని నిర్వహించారు. ఇళ్లలో వేరేవాళ్లు ధూమపానం చేస్తున్నప్పుడు ఆ పొగ పీల్చడం వల్ల తీవ్ర కొవిడ్‌-19కు గురయ్యే అవకాశం 3.03 రెట్లు ఎక్కువని అధ్యయనంలో బయటపడింది. పని ప్రదేశాల్లో ఇలాంటి పరిణామం వల్ల ముప్పు 2.19 రెట్లు ఎక్కువని తేలింది. ఆరోగ్యపరంగా ఇలాంటి ముప్పు తలెత్తడమంటే జీవించే హక్కులోకి చొరబడడమే అవుతుందని ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సురేఖ కిశోర్‌ పేర్కొన్నారు. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ధూమపానం ప్రభావానికి గురి కాకుండా ‘సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం-2003’ని సవరించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. 2020 జనవరి నుంచి 2022 ఫిబ్రవరి మధ్య తీవ్ర కరోనా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరినవారిలో 18 ఏళ్లు పైబడినవారి వివరాలను దీనిలో విశ్లేషించారు. పొగతాగడం వల్ల కరోనా బారిన పడేందుకు, తీవ్రస్థాయి అస్వస్థతకు గురయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది.


అమర్త్యసేన్‌కు విశ్వభారతి షోకాజ్‌ నోటీసు

కోల్‌కతా: చట్ట విరుద్ధంగా ఆక్రమించినట్లుగా చెబుతున్న 5,662 చదరపు అడుగుల ప్లాటును ఖాళీ చేయవలసిందిగా మీకు ఉత్తర్వులు ఎందుకు జారీ చేయకూడదో చెప్పాలంటూ నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌ (89)కు విశ్వభారతి (శాంతినికేతన్‌) విశ్వవిద్యాలయం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు మార్చి 24లోపు స్పందించాలని, అలాగే ఆ ప్లాటు ఆక్రమిత స్థలం కాకపోతే సంబంధిత ఆధారాలతో వ్యక్తిగతంగా లేదా ప్రతినిధి ద్వారా కేంద్రీయ విశ్వవిద్యాలయ ఎస్టేట్‌ అధికారి, జాయింట్‌ రిజిస్ట్రార్‌ అయిన అశోక్‌ మహతో ముందు 29వ తేదీలోపు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. ఆయా తేదీల్లోపు నోటీసుకు స్పందించకపోతే కేసును ఏకపక్షంగా ముగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రముఖ ఆర్థికవేత్త అయిన అమర్త్యసేన్‌ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నందున విశ్వవిద్యాలయ నోటీసుపై ఆయన స్పందన ఏమిటన్నది తెలియరాలేదు.


మరో 19 మందిపై ఎన్‌ఐఏ చార్జిషీటు

దిల్లీ: నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)పై ఎన్‌ఐఏ నమోదు చేసిన అయిదో చార్జిషీటులో 19 మందిపై అభియోగాలు మోపింది. ఇందులో 12 మంది ఆ సంస్థ జాతీయ కార్యనిర్వాహక మండలి సభ్యులు. దేశంలో ఇస్లామిక్‌ ఖలీఫా పాలన తెచ్చేందుకు యుద్ధం చేయాలంటూ పన్నిన కుట్రలో వీరి పాత్ర ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు శనివారం దిల్లీలో ఎన్‌ఐఏ చార్జిషీటు దాఖలు చేసింది.


బ్రిటన్‌ దౌత్యవేత్తకు సమన్లు

లండన్‌లో ఖలిస్థాన్‌ మద్దతుదారులు త్రివర్ణ పతాకాన్ని దించివేయడంపై నిరసన

దిల్లీ: లండన్‌లోని భారత రాయబార కార్యాలయం ఆవరణలోని త్రివర్ణ పతాకాన్ని కొందరు ఖలిస్థాన్‌ మద్దతుదారులు కిందకు దించిన ఘటనపై మనదేశం నిరసన వ్యక్తం చేసింది. దిల్లీలోని బ్రిటన్‌ సీనియర్‌ దౌత్యవేత్త ఒకరిని ఆదివారం రాత్రి విదేశీ వ్యవహారాల శాఖ తమ కార్యాలయానికి పిలిపించి తీవ్ర ఆందోళనను తెలిపింది. సంఘటన సమయంలో భారత దౌత్యకార్యాలయ ప్రాంతానికి, అక్కడి సిబ్బందికి భద్రత లోపించడంపై పూర్తిస్థాయి వివరణ కోరింది. ఈ విషయంలో బ్రిటన్‌ ప్రభుత్వ ఉదాశీనత ఆమోదనీయం కాదని తీవ్రంగా తెలిపింది. బ్రిటిష్‌ రాయబారి అలెక్స్‌ ఎలిస్‌ ప్రయాణంలో ఉండటంతో యూకే హైకమిషన్‌ డిప్యూటీ చీఫ్‌కు సమన్లు అందించింది. ఇదిలా ఉండగా లండన్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద జరిగిన చర్యలను ఖండిస్తున్నట్లు ఎలిస్‌ ట్విటర్‌లో తెలిపారు.


హరిచంద్‌ ఠాకుర్‌ ఆశయాలను నెరవేరుస్తాం

మతువా మహా సంఘానికి చెందిన ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ హరిచంద్‌ ఠాకుర్‌ జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళి. అసమానతలను తొలగించి సామరస్యాన్ని పెంపొందించడంలో ఆయన పాత్ర అసమానమైనది. సామాజిక న్యాయం అవసరాన్ని ఆయన గట్టిగా వినిపించారు. ప్రజలకు విద్యను చేరువ చేయడానికి విశేష కృషి చేశారు. ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు నిరంతరం పాటుపడతాం.  

 నరేంద్ర మోదీ


కశ్మీర్‌ ఘటనపై కేంద్రం స్పందించాలి

ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్నతోద్యోగినని చెప్పుకొన్న గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తికి జమ్మూ-కశ్మీర్‌ అధికారులు జడ్‌ ప్లస్‌ భద్రత కల్పించి మరీ రాచ మర్యాదలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కశ్మీర్‌లో భద్రత మెరుగుపడిందని వల్లె వేస్తుంటారు. అలాంటప్పుడు ఈ ఘటన ఎలా జరిగింది. దేశ భద్రత దృష్ట్యా మోదీ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి.

 సీతారాం ఏచూరి


అభివృద్ధికి పెద్ద ఎత్తున పెట్టుబడులు

మేము ప్రజలపై ఇంధన ధరల భారాన్ని తగ్గిస్తున్నాం. తక్కువ ధరలో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నాం. మంచి వేతనంతో ఉద్యోగాలు కల్పిస్తున్నాం. మెడికేర్‌ ద్వారా తక్కువ వ్యయానికే ఔషధాలు అందిస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాల కోసం పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నాం.  

 బైడెన్‌


నిజమైన స్నేహితులెవరో తెలుసుకోండి

మీరు మారిపోతున్నారని కొందరు అసంతృప్తి చెందుతుంటారు. మీరు ఎదుగుతున్నారని మరికొందరు సంతోషిస్తుంటారు. నిజమైన స్నేహితులు ఎవరో తెలుసుకొని ముందుకు సాగడమే వివేకం. మార్పుతోనే పరిణతి సాధ్యమని గుర్తుంచుకోండి.

 హర్ష్‌ గోయెంకా



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు