కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ.155 లక్షల కోట్లు

కేంద్ర ప్రభుత్వ అప్పులు 2023 మార్చి నాటికి రూ.155.8 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఇది జీడీపీలో 57.3%కి సమానమని చెప్పారు.

Updated : 21 Mar 2023 06:11 IST

జీడీపీలో 57.3% : నిర్మలాసీతారామన్‌

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వ అప్పులు 2023 మార్చి నాటికి రూ.155.8 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఇది జీడీపీలో 57.3%కి సమానమని చెప్పారు. ఇందులో విదేశీ అప్పు తాజా మారకద్రవ్య విలువ ప్రకారం రూ.7.03 లక్షల కోట్లని (జీడీపీలో 2.6%) తెలిపారు. లోక్‌సభలో సోమవారం భారాస నేత నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు ఆమె ఈమేరకు బదులిచ్చారు. మొత్తం రుణాల్లో విదేశీ అప్పు  4.5% మాత్రమేనని వెల్లడించారు. విదేశీ రుణాలను సాధారణంగా బహుముఖ, ద్వైపాక్షిక సంస్థలు రాయితీ రేటుతో ఇస్తుంటాయని చెప్పారు. అందువల్ల ఇందులో ముప్పు ఏమీ ఉండదని పేర్కొన్నారు.

ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు పెట్టొద్దని చెప్పలేదు..

ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు నింపొద్దని బ్యాంకులకు చెప్పలేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఏటీఎంలలో ఏ నోట్లు ఎంత సంఖ్యలో పెట్టాలన్న విషయమై బ్యాంకులు సొంత అంచనా వేసుకొని నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. అక్కడ వినియోగదారుల అవసరాలు, సీజనల్‌ ట్రెండ్‌ను బట్టి అవి దీనిపై నిర్ణయం తీసుకుంటాయన్నారు. 2019-20 తర్వాత రూ.2 వేల నోట్ల ముద్రణ కోసం ఆర్‌బీఐ ఎలాంటి ఇండెంట్‌ పెట్టలేదని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని