సీల్డ్‌ కవర్ల పద్ధతి నిలిపివేద్దాం

అర్హులైన మాజీ సైనికులకు ఒకే ర్యాంకు-ఒకే పింఛను (ఓఆర్‌ఓపీ) బకాయిల చెల్లింపుపై తన అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం సీల్డ్‌ కవర్‌లో అందజేయడంపై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated : 21 Mar 2023 06:19 IST

ఓఆర్‌ఓపీ కేసులో కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్‌
మాజీ సైనికులకు పింఛను బకాయిల చెల్లింపులపై కాలపట్టిక నిర్దేశం
2024 ఫిబ్రవరి 28కల్లా పూర్తిచేయాలని ఆదేశం

దిల్లీ: అర్హులైన మాజీ సైనికులకు ఒకే ర్యాంకు-ఒకే పింఛను (ఓఆర్‌ఓపీ) బకాయిల చెల్లింపుపై తన అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం సీల్డ్‌ కవర్‌లో అందజేయడంపై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విధానానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఆ సీల్డ్‌ కవర్‌ను తిరస్కరిస్తూ...‘మేం ఎటువంటి రహస్య పత్రాలు, సీల్డ్‌ కవర్లు తీసుకోం. వ్యక్తిగతంగా నేను వాటికి వ్యతిరేకిని. న్యాయస్థానాల్లో పారదర్శకత ఉండాలి. ఈ కేసులో రహస్యం ఏముంది. మేమిచ్చిన ఆదేశాలు అమలు చేస్తున్నారు అంతేకదా. నేను ఈ సీల్డ్‌ కవర్‌ సంప్రదాయానికి ముగింపు పలుకుదామనుకుంటున్నా. దీనిని సుప్రీంకోర్టు అనుసరిస్తే..హైకోర్టులు అదే బాటలో పయనిస్తాయ’ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. ఎవరి జీవితానికైనా ప్రమాదం కలుగుతుందని భావిస్తే, విశ్వసనీయ సమాచార మూలాల గురించి చెప్పేటప్పుడు ఈ పద్ధతిని అనుసరించవచ్చని అటార్నీ జనరల్‌కు సూచించారు. ధర్మాసనంలో జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహా, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా సభ్యులుగా ఉన్నారు. రూ.28వేల కోట్ల ఓఆర్‌ఓపీ బకాయిలను నాలుగు వాయిదాల్లో చెల్లిస్తామంటూ రక్షణ మంత్రిత్వ శాఖ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపై ఈ నెల 13న సుప్రీంకోర్టు మండిపడింది. ‘ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంది? చెల్లింపుల్లో ప్రాధాన్యతలు, అందుకు ఎలాంటి విధివిధానాలను అనుసరించాలనే అంశాలపై ఈ నెల 20లోగా నివేదిక ఇవ్వాల’ని ఆదేశించింది. ఈ క్రమంలోనే కేంద్రం సోమవారం ఆ వివరాలను సమర్పించింది. అనంతరం కోర్టు తీర్పును వెలువరించింది.

ఇదీ చెల్లింపుల షెడ్యూలు..

మాజీ సైనికులకు 2019-2022లకు గాను చెల్లించాల్సిన రూ.28,000 కోట్ల బకాయిలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 కల్లా చెల్లించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. మొత్తం 25 లక్షల మంది పింఛనుదారులకు గాను ఓఆర్‌ఓపీ పథకానికి 4లక్షల మంది అనర్హులు. ఈ నాలుగు లక్షల మంది ఇప్పటికే పెంచిన పింఛను పొందుతున్నారని ధర్మాసనం పేర్కొంది.

యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు చెందిన కుటుంబాలు, ధైర్యసాహసాల అవార్డుల విజేతలు కలిపి సుమారు ఆరు లక్షల మంది ఉంటారని, వారందరికీ ఒకే విడతలో బకాయిలను ఈ ఏడాది ఏప్రిల్‌30 లోగా చెల్లించాలని తెలిపింది.

70 ఏళ్లు, ఆపై వయసు మాజీ సైనికులు నాలుగైదు లక్షల మంది ఉంటారు. వారికి ఒకటి లేదా అంతకుమించిన వాయిదాల్లో ఈ ఏడాది జూన్‌ 30 కల్లా ఓఆర్‌ఓపీ బకాయిలు ఇచ్చేయాలి.

మిగతా 10-11 లక్షల మంది పెన్షనర్లకు మూడు సమాన వాయిదాల్లో 2024, ఫిబ్రవరి 28 నాటికి మొత్తం బకాయిలను చెల్లించాలని ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని