హామీలను నెరవేర్చకపోతే మళ్లీ ఉద్యమం

రైతన్నలు దిల్లీలోని రాంలీలా మైదానంలో గర్జించారు. గతంలో లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

Published : 21 Mar 2023 05:18 IST

రాంలీలాలో గర్జించిన రైతన్న వేల మందితో ‘మహా పంచాయత్‌’

ఈనాడు, దిల్లీ: రైతన్నలు దిల్లీలోని రాంలీలా మైదానంలో గర్జించారు. గతంలో లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. పార్లమెంటుకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో సోమవారం ‘మహా పంచాయత్‌’ పేరుతో జరిగిన ఈ సభలో వేల మంది రంగురంగుల తలపాగాలతో పాల్గొన్నారు. గతంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేసిన రైతు సంఘాల సంయుక్త కిసాన్‌ మోర్చా ఈ సదస్సుకు నేతృత్వం వహించింది. 2021లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండు చేసింది. కనీస మద్దతు ధరకు న్యాయ భరోసా కల్పించాలని, గతంలో ఆందోళన సందర్భంగా రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, చనిపోయిన రైతులకు పరిహారం చెల్లించడంతోపాటు పింఛను ఇవ్వాలని, రుణాలు, విద్యుత్తు బిల్లులను మాఫీ చేయాలని రైతులు కోరారు. ‘రైతులపై వేలకొద్దీ కేసులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆందోళన సందర్భంగా 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. వారికి పరిహారం ఇవ్వలేదు’ అని జైకిసాన్‌ ఆందోళన్‌ అధ్యక్షుడు అవిక్‌ సాహా విమర్శించారు. ‘చాలా హామీలు పెండింగులో ఉన్నాయి. వాటిని నెరవేర్చకపోతే మరో ఆందోళనకు దిగుతాం. ఏప్రిల్‌ 30న దిల్లీలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈలోగా ఆయా రాష్ట్రాల్లో రైతులు ర్యాలీలు నిర్వహిస్తారు’ అని రైతు నేత దర్శన్‌ పాల్‌ పేర్కొన్నారు. ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి విజూకృష్ణన్‌ , రైతు నేతలు రాకేశ్‌ టికాయిత్‌, తేజిందర్‌ సింగ్‌ విర్క్‌, జోగిందర్‌ సింగ్‌, ఉగ్రహాన్‌, వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితరులు మాట్లాడారు. మహా పంచాయత్‌లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి రావుల వెంకయ్య, కేవీవీ ప్రసాద్‌, ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, కుర్రా నరేంద్ర,  తెలంగాణ నుంచి జక్కుల వెంకటయ్య, జి.గోపాల్‌ ఎండీ ఖాజామొహియుద్దీన్‌, మహేశ్‌, పరంజ్యోతి, సైదులు తదితరులు పాల్గొన్నారు. సదస్సు అనంతరం 15 మంది సంయుక్త కిసాన్‌ మోర్చా నేతలు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ను కలిసి డిమాండ్‌ చార్టర్‌ను అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని