2022లో హక్కుల ఉల్లంఘన ఎక్కువే

చట్ట విరుద్ధంగా, ఏకపక్షంగా కొందరిని మట్టుబెట్టడం, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు, అల్పసంఖ్యాక వర్గాలవారిపై హింస పరంగా 2022లో భారత్‌లో పెద్దఎత్తున హక్కుల ఉల్లంఘన చోటు చేసుకుందని అమెరికా నివేదిక ఒకటి పేర్కొంది.

Published : 21 Mar 2023 05:13 IST

భారత్‌లో పరిస్థితిపై అమెరికా నివేదిక

వాషింగ్టన్‌: చట్ట విరుద్ధంగా, ఏకపక్షంగా కొందరిని మట్టుబెట్టడం, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు, అల్పసంఖ్యాక వర్గాలవారిపై హింస పరంగా 2022లో భారత్‌లో పెద్దఎత్తున హక్కుల ఉల్లంఘన చోటు చేసుకుందని అమెరికా నివేదిక ఒకటి పేర్కొంది. ఈ మేరకు ‘వార్షిక మానవ హక్కుల నివేదిక’ను విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ సోమవారం విడుదల చేశారు. ‘భారత్‌లో ఏ స్థాయిలోనూ అధికార దుర్వినియోగానికి జవాబుదారీతనం లేదు. అలసత్వం, సుశిక్షితులైన పోలీసు అధికారుల కొరత, తగినన్ని వనరులు లేక సతమతమవుతున్న న్యాయవ్యవస్థ వల్ల తక్కువమందికే శిక్షలు పడుతున్నాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పోలీసులు కొందరిని హతమారుస్తుండడం, జైళ్లలో చిత్రహింసలు పెట్టడం, అమానవీయంగా వ్యవహరించడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. జైళ్లలో పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి. ఏకపక్షంగా కొందరిని నిర్బంధిస్తున్నారు. గోప్యతలో చొరబడుతున్నారు. పత్రికా స్వేచ్ఛకు ఆంక్షలు విధిస్తున్నారు. అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు. పాత్రికేయుల్ని ప్రాసిక్యూట్‌ చేస్తున్నారు. ఇంటర్నెట్‌ స్వేచ్ఛపైనా ఆంక్షలు విధిస్తున్నారు. ఇలాంటి ఎన్నో ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయి’ అని నివేదిక పేర్కొంది. వివిధ దేశాల్లో హక్కుల ఉల్లంఘనల గురించి దీనిలో పొందుపరిచారు. ముఖ్యంగా రష్యా, చైనాల్లో భారీగా ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. ఇరాన్‌, ఉత్తర కొరియా, మయన్మార్‌ వంటి ఇతర దేశాల్లోని పరిస్థితులనూ ప్రస్తావించారు. చైనాలోని జిన్‌జియాంగ్‌లో ముస్లిం యూగర్లు, ఇతర అల్పసంఖ్యాక వర్గాలవారిపై దమనకాండ సాగిందని పేర్కొన్నారు.

‘భారత్‌లో ఇంధన ఆత్మనిర్భరత సాధ్యమే’

భారత్‌ 2047లో స్వాతంత్య్ర స్వర్ణోత్సవాలు జరుపుకొనేటప్పటికి ఇంధన రంగంలో స్వావలంబన సుసాధ్యమని అమెరికా ఇంధన శాఖకు చెందిన లారెన్స్‌ బర్కిలీ నేషనల్‌ లేబరేటరీ అధ్యయనం పేర్కొంది. అమోల్‌ ఫాడ్కే, నికిత్‌ అభయంకర్‌, ప్రియాంకా మహంతి అనే ముగ్గురు భారత సంతతి శాస్త్రవేత్తలు ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధనపై అధ్యయనం నిర్వహించారు. వీరంతా బర్కిలీ లేబరేటరీకి చెందినవారు. స్వావలంబనకు దారితీసే హరిత ఇంధన వ్యవస్థ కోసం భారత్‌ 3 లక్షల కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని అధ్యయనకర్తలు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని