మళ్లీ తెరపైకి ఖలిస్థాన్!
ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్పాల్సింగ్.. పంజాబ్లో పోలీసుల కళ్లుగప్పి పారిపోవడంతో ఖలిస్థాన్ వేర్పాటువాదం మరోసారి వార్తల్లోకెక్కింది.
మునుపటి ఉద్రిక్తతలు ఇంకోసారి తలెత్తుతాయా?
పంజాబ్లో ప్రశాంతతపై నీలి నీడలు
ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్పాల్సింగ్.. పంజాబ్లో పోలీసుల కళ్లుగప్పి పారిపోవడంతో ఖలిస్థాన్ వేర్పాటువాదం మరోసారి వార్తల్లోకెక్కింది. ‘జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే 2.0’గా పేరుతెచ్చుకొని ఖలిస్థానీ వేర్పాటువాదాన్ని ఎగదోయడానికి గతేడాది దుబాయ్ నుంచి వచ్చిన అమృత్పాల్ సింగ్.. ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. సంస్థను స్థాపించిన పంజాబ్ నటుడు దీప్ సిద్ధూ మరణానంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల ఓ కేసులో ఇరుక్కున్న తన అనుచరుడు లవ్ప్రీత్ సింగ్ తూఫాన్ను విడిపించుకునేందుకు పవిత్ర గ్రంథం గురుగ్రంథ్ సాహెబ్ను చేతపట్టుకొని ఏకంగా ఆజ్నాలా పోలీస్స్టేషన్పైనే అమృత్పాల్ దాడికి దిగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
స్వయం ప్రతిపత్తి నినాదంతో..
సిక్కులకు స్వయం ప్రతిపత్తితో ఒక రాష్ట్రం ఉండాలనే లక్ష్యంతో ఖలిస్థాన్ ఉద్యమం పురుడు పోసుకుంది. భారత్, పాక్ విడిపోయినప్పటి నుంచి అది వివిధ రూపాల్లో బలపడుతూ వస్తోంది. 1984లో చేపట్టిన ‘ఆపరేషన్ బ్లూస్టార్’లో జర్నైల్ సింగ్ భింద్రన్వాలే మరణించిన తర్వాత రెండు దశల్లో ‘ఆపరేషన్ బ్లాక్ థండర్’ ద్వారా మిగిలిన వేర్పాటువాదులను ప్రభుత్వం అణచివేసింది. ఖలిస్థాన్ భావజాలాన్ని వ్యాప్తిచేసే వ్యక్తులు ప్రపంచంలో ఇంకా మిగిలిఉన్నారు. కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో స్థిరపడిన వీరు మనదేశాన్ని అస్థిర పరిచేందుకు పావులు కదుపుతున్నారు.
ఎప్పుడు మొదలైంది?
1947లో భారత్, పాక్లు వేరుపడటంతో నాటి పంజాబ్ సంస్థానం రెండు ముక్కలై,. మతహింస చెలరేగింది. వేలమంది శరణార్థులుగా మారారు. సిక్కుల పవిత్ర స్థలం నాన్కానా సాహిబ్ భారత్ చేజారింది. జనాభాలో 2% ఉన్న సిక్కుల స్వయంప్రతిపత్తి కోసం రాజకీయ పోరాటం మొదలైంది. పంజాబీ మాట్లాడే వారి కోసం పంజాబీ సూబా ఉద్యమం ప్రారంభమైంది. 1955లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నివేదిక ఆ డిమాండ్ను తిరస్కరించింది. చివరికి 1966లో పంజాబ్ పునర్వ్యవస్థీకరణ జరిగింది. పంజాబ్, హిమాచల్ప్రదేశ్, హరియాణా రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
ఆనంద్పూర్ సాహిబ్ తీర్మానం
శిరోమణి గురుద్వారా టాస్క్ఫోర్స్గా 1920లో అకాలీదళ్ ఏర్పడింది. గురుద్వారాలలో సంస్కరణలు కోరుతూ ఈ పార్టీ అకాలీ ఉద్యమాన్ని నడిపింది. ది పంజాబ్ సూబా ఉద్యమంతో అకాలీదళ్ బలపడింది. అవిభక్త తూర్పు పంజాబ్తో కలిపి పంజాబీ మాట్లాడే వారితో రాష్ట్రం ఏర్పాటు కావాలని సంత్ ఫతేసింగ్ నాయకత్వంలో డిమాండ్ చేశారు. పంజాబ్ ఏర్పడిన తర్వాత ఈ పార్టీ ప్రధాన శక్తిగా అవతరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను దీటుగా ఎదుర్కొంది. 1971 లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ జైత్రయాత్ర కారణంగా అకాలీదళ్ బలహీనపడింది. దాంతో ఆ పార్టీ ఆనంద్పూర్ సాహిబ్లో సమావేశమైంది. అది ‘ఖల్సా’ కేంద్రం. పంజాబ్కు స్వయంప్రతిపత్తి, అంతర్గత రాజ్యాంగం ఉండాలని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. వాస్తవానికి భారత్ నుంచి విడిపోవాలనే అంశం ఈ తీర్మానంలో లేదు. దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి.
తెరపైకి భింద్రన్ వాలే
పంజాబ్లో వేర్పాటువాదం కోరుకొన్నవారిలో భింద్రన్ వాలే ఒకరు. ఆయన ఎదుగుదలలో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ పాత్ర ఉందనే విమర్శలున్నాయి. 1980 నాటికి ప్రభుత్వానికి పెను సవాల్గా మారిన భింద్రన్ వాలేకి యువతలో, అణగారిన వర్గాల్లో విశేష ఆదరణ లభించింది. ఈ క్రమంలో భింద్రన్ అనుచరులు 1982లో ‘ధరమ్ యుద్ధ మోర్చా’ పేరిట శాసనోల్లంఘన ఉద్యమం మొదలుపెట్టారు. దీనికి అకాలీదల్ నాయకత్వం కూడా సహకరించింది. స్వర్ణ దేవాలయంలోని పవిత్రమైన అకల్తక్త్ను భింద్రన్ తన స్థావరంగా మార్చుకుని అక్కడినుంచే తన అనుచరులను పోలీసులపై దాడులకు పంపేవాడు. భింద్రన్వాలే రెచ్చగొట్టడంతో హిందువులు, ప్రభుత్వ అధికారులపై దాడులు పెరిగిపోయాయి. దేవాలయం వద్ద డీఐజీ స్థాయి అధికారిని కాల్చి చంపారు.
ఆపరేషన్ బ్లూస్టార్
భింద్రన్వాలేను ఎలాగైనా అణచివేయాలని ఇందిరాగాంధీ ప్రభుత్వం నిర్ణయించింది. సైన్యాన్ని స్వర్ణ దేవాలయంలోకి పంపింది. భింద్రన్ వాలే వర్గం తీవ్రంగా ప్రతిఘటించింది. సైన్యం మరింత దూకుడుగా ముందుకు వెళ్లడంతో 83 మంది సైనికులు, 493 మంది వేర్పాటువాదులు, పౌరులు మరణించారు. పవిత్ర స్థలంలో ఇలాంటి చర్య జరగడాన్ని ఆ వర్గం జీర్ణించుకోలేకపోయింది. భింద్రన్ వాలే మరణంతో సమస్య ముగిసినట్లే కనిపించినా స్వర్ణ దేవాలయ ఘటన సిక్కులను తీవ్రంగా కలచివేసింది. దాంతో ఖలిస్థాన్ వేర్పాటువాదం మరింతగా బలపడింది. 1984 అక్టోబరు 31న ఇందిరాగాంధీని అంగరక్షకులే హత్యచేశారు. దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగి, వేలమంది సిక్కులు మరణించారు. భింద్రన్ మరణానికి ప్రతీకారంగా ఉగ్రవాదులు ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చివేశారు. 329 మంది మరణించారు.
బ్లాక్ థండర్ ఆపరేషన్స్
భింద్రన్ వాలే మరణించిన తరువాత కూడా వేర్పాటువాదులు స్వర్ణ దేవాలయాన్ని వీడలేదు. దాంతో 1986 ఏప్రిల్ 30న ఆపరేషన్ బ్లాక్ థండర్-1 చేపట్టి 200 మందిని బంధించారు. వెయ్యి మంది ఎన్ఎస్జీ, బీఎస్ఎఫ్ జవాన్లు ఇందులో పాల్గొన్నారు. ఎనిమిది గంటలపాటు సాగిన ఈ ఆపరేషన్కు నాటి అకాలీదళ్ నేత, ముఖ్యమంత్రి సూర్జిత్ సింగ్ బర్నాలా, మితవాద సిక్కు నాయకులు కూడా ఆమోదం తెలిపారు. 1988లో ఆపరేషన్ బ్లాక్ థండర్-2 చోటు చేసుకుంది. దాదాపు 200 మంది వేర్పాటువాదులు పట్టుబడ్డారు. 46 మందిని హతమార్చారు. తర్వాత వేర్పాటువాదం తగ్గిపోయింది. ఉద్యమం బలహీనపడింది. వేర్పాటువాదుల గొంతులు పూర్తిగా మూగబోయాయి. పంజాబ్లో చాలాకాలం ప్రశాంత వాతావరణం ఉంది. విదేశీ శక్తులు మాత్రం అప్పుడప్పుడు వేర్పాటువాద ఉద్యమాన్ని వివిధ రూపాల్లో బలపర్చేందుకు యత్నిస్తున్నాయి. అమృత్పాల్ సింగ్ రాకతో మళ్లీ మునుపటి వాతావరణం వచ్చేలా ఉందని శాంతికాముకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL Final: ‘బాగా బౌలింగ్ చేస్తున్న వాడిని ఎందుకు డిస్టర్బ్ చేశావు’.. హార్దిక్పై సెహ్వాగ్ ఫైర్
-
Movies News
The Night Manager: ‘ది నైట్ మేనేజర్’.. పార్ట్ 2 వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?
-
India News
Maharashtra: మరో జిల్లాకు పేరు మారుస్తూ శిందే సర్కార్ ప్రకటన
-
Movies News
Director Teja: నమ్మిన వాళ్లే నన్ను అవమానించారు: తేజ
-
India News
Punjab: డ్రగ్స్ స్మగ్లింగ్పై ఉక్కుపాదం.. 5,500 మంది పోలీసులు.. 2వేల చోట్ల దాడులు!
-
Politics News
Smriti Irnai: మంత్రి మిస్సింగ్ అంటూ కాంగ్రెస్ ట్వీట్.. కౌంటర్ ఇచ్చిన స్మృతి ఇరానీ!