అమృత్‌పాల్‌కు సహకరించింది పపల్‌ప్రీత్‌

ఖలిస్థాన్‌ వేర్పాటువాద సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ పోలీసులకు చేజిక్కినట్లే కనిపించి తప్పించుకోవడం వెనుక పపల్‌ప్రీత్‌ సింగ్‌ అనేవ్యక్తి హస్తం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

Published : 23 Mar 2023 05:32 IST

బైక్‌ నడిపింది అతడే
పాక్‌ ఐఎస్‌ఐ నుంచి ఆదేశాలు

చండీగఢ్‌: ఖలిస్థాన్‌ వేర్పాటువాద సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ పోలీసులకు చేజిక్కినట్లే కనిపించి తప్పించుకోవడం వెనుక పపల్‌ప్రీత్‌ సింగ్‌ అనేవ్యక్తి హస్తం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ప్రధాన నిందితుడికి మార్గదర్శకునిగా వ్యవహరిస్తున్న ఈ వ్యక్తికి పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో సన్నిహిత సంబంధాలున్నాయని గుర్తించారు. ఖలిస్థాన్‌ ఉద్యమాన్ని విస్తరించి, పంజాబ్‌ను మళ్లీ మునుపటి మాదిరి చీకటి రోజుల్లోకి తీసుకువెళ్లేందుకు ఐఎస్‌ఐ నుంచి ఎప్పటికప్పుడు అతనికి ఆదేశాలు అందుతున్నాయని వారు తెలిపారు. అమృత్‌పాల్‌ ప్రయాణించిన బైకును నడిపింది ఈ వ్యక్తేనని, తర్వాత దానిని ఒకచోట వదిలేశారని పోలీసులు గుర్తించారు. మత ప్రబోధకుని ఆహార్యాన్ని విడిచిపెట్టి సాధారణ వ్యక్తి మాదిరి దుస్తులు ధరించాల్సిందిగా నిందితుడికి సూచించిన వ్యక్తి పపల్‌ప్రీత్‌ అని వారి విచారణలో బయటపడింది. పరారీకి సహకరించి అరెస్టయిన నలుగురు వ్యక్తుల్ని విచారించిన మీదట ఇలాంటి కొన్ని విషయాలు తెలియవచ్చాయి. ‘‘పంజాబ్‌లో స్థానిక గ్యాంగుల్ని నడిపే మన్‌ప్రీత్‌సింగ్‌, గుర్‌దీప్‌సింగ్‌ అనే ఇద్దరు వ్యక్తులు బైకును సమకూర్చారు. వారే ఓ గురుద్వారా వద్దకు నిందితుడిని చేర్చేలా చూశారు. మన్‌ప్రీత్‌ అక్కడ దుస్తులు మార్చుకుని, వేరేరంగు తలపాగా ధరించాడు. బైకుపై జారుకున్నాడు’’ అని పోలీసులు తెలిపారు.

తుపాకీతో బెదిరించి దుస్తులు అడిగారు

అమృత్‌పాల్‌ పరారయ్యేముందు 45 నిమిషాలు ఓ గురుద్వారాలోనే గడిపినట్లు సమాచారం. ‘అమృత్‌పాల్‌ నలుగురు అనుచరులతో శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు గురుద్వారాకు చేరుకున్నాడు. 1.45 గంటల వరకు మా దగ్గరే ఉన్నాడు. అతడి కోసం పోలీసులు వెతుకుతున్నట్లు మాకు తెలియదు. ఒక కార్యక్రమానికి వెళ్తున్నామని, కొన్ని దుస్తులు కావాలని వారు తుపాకీ చూపించి డిమాండ్‌ చేయడం ఆశ్చర్యమనిపించింది. ఇవ్వకపోతే చంపేస్తామన్నారు. భయంతో మా కుమారుడి దుస్తులు ఇచ్చాం. తర్వాత మా ఫోన్‌ అడిగి తీసుకున్నారు. వెళ్లడానికి ముందు తిరిగి ఇచ్చేశారు’ అని నంగల్‌ అంబియన్‌ గురుద్వారా గ్రంథీ తెలిపారు. ఆ మేరకు అమృత్‌పాల్‌పై మరో కేసు నమోదైంది. ఇద్దరు డీఎస్పీలు సహా ఓ పోలీసు బృందం అమృత్‌సర్‌ జిల్లాలోని అమృత్‌పాల్‌సింగ్‌ స్వగ్రామానికి వెళ్లి, కొందరు కుటుంబ సభ్యుల్ని కలిసింది. నిందితుల్లో ఏడుగురిని ఖైదు చేసిన అస్సాంలోని డిబ్రూగఢ్‌ కేంద్ర కారాగారంలో బహుళ అంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటుచేశారు. జైలు ప్రహరీ మొత్తానికి సీసీటీవీలు అమర్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని