స్టాక్‌ మార్కెట్‌ మోసగాడు.. 27 ఏళ్ల తర్వాత చిక్కాడు

స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో మోసం చేసి పరారైన ఓ వ్యక్తిని 27 ఏళ్ల తర్వాత ముంబయి పోలీసులు అరెస్టు చేశారు.

Published : 24 Mar 2023 04:25 IST

స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో మోసం చేసి పరారైన ఓ వ్యక్తిని 27 ఏళ్ల తర్వాత ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. వీరేంద్ర ప్రవీణ్‌ చంద్ర సంఘ్వీ 1995లో చంద్రభాన్‌ ఖండేల్వాల్‌ అనే వ్యక్తి  వద్ద రూ.20లక్షలు తీసుకున్నాడు. స్టాక్‌మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లు నకిలీ రసీదులు ఇచ్చి.. నగదుతో వీరేంద్ర ఉడాయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు వీరేంద్రను అరెస్టు చేశారు. ఏడాదిన్నర శిక్ష అనుభవించి బయటకు వచ్చిన వీరేంద్ర కోర్టు వాయిదాలకు వెళ్లడం మానేశాడు. అతని ఆచూకీ తెలియక పోవడంతో పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. తాజాగా పోలీసులు ఈ కేసుపై దృష్టి సారించి ముంబయి ఓటర్ల జాబితాను వడపోశారు. వీరేంద్ర ప్రవీణ్‌ చంద్ర సంఘ్వీ పేరుతో ఒకే ఒక్క ఓటరున్నాడు. అందులో పేర్కొన్న చిరునామాకు వెళ్లారు. అయితే, వీరేంద్ర ఆ ఇంటిని ఎప్పుడో విక్రయించి వెళ్లాడని తెలిసింది. పోలీసులు స్థానికుల నుంచి వీరేంద్ర ఫోన్‌ నంబర్‌ సేకరించి నిఘా పెట్టారు. ఎట్టకేలకు దానా బందర్లోని వీరేంద్ర నివాసానికి పోలీసులు వెళ్లారు. అయితే, దాన్ని కూడా వీరేంద్ర అద్దెకు ఇచ్చి మరో చోట ఉంటున్నట్లు తెలుసుకున్నారు. అతడిని ఎలాగైనా రప్పించాలని తాము పోలీసులమని చెప్పకుండా విద్యుత్తు అధికారుల్లా ఫోన్‌ చేశారు. ఇంటి వద్దే చిన్నపాటి వెరిఫికేషన్‌ ఉందని, వెంటనే రావాలని చెప్పారు. అక్కడకు వచ్చిన అతణ్ని పోలీసులు అరెస్టు చేసి కస్టడీకి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని