‘వసుధైక కుటుంబం’ ప్రపంచానికి పరిష్కార మార్గం

‘వసుధైక కుటుంబం’ అనే భారతీయ భావజాలం ప్రపంచానికి పరిష్కార మార్గాలు చూపుతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా వారణాసిలో శుక్రవారం నిర్వహించిన ‘వన్‌ వరల్డ్‌ టీబీ సమిట్‌’లో ఆయన ప్రసంగించారు.

Published : 25 Mar 2023 04:54 IST

క్షయవ్యాధిపై భారత్‌ పోరు అద్వితీయం
రోగులకు కొత్తగా మూడు నెలల చికిత్స
వన్‌ వరల్డ్‌ టీబీ సదస్సులో ప్రధాని మోదీ

వారణాసి: ‘వసుధైక కుటుంబం’ అనే భారతీయ భావజాలం ప్రపంచానికి పరిష్కార మార్గాలు చూపుతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా వారణాసిలో శుక్రవారం నిర్వహించిన ‘వన్‌ వరల్డ్‌ టీబీ సమిట్‌’లో ఆయన ప్రసంగించారు. 2025 లోగా దేశంలో క్షయను నిర్మూలించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. జీ20 అధ్యక్ష దేశంగా భారత్‌ ‘ఒక కుటుంబం, ఒక ప్రపంచం, ఒక భవిష్యత్తు’ నినాదాన్ని ఎంచుకుందని తెలిపారు. క్షయ రోగులకు కొత్తగా ఆరు నెలలకు బదులు మూడు నెలల చికిత్సను ప్రవేశపెడుతున్నట్లు ప్రధాని ప్రకటించారు. గతంలో రోగులు రోజూ మందులు వేసుకోవాల్సి వచ్చేదని, కొత్త పద్ధతిలో వారంలో ఒకసారి తీసుకుంటే సరిపోతుందని వివరించారు. 2014 తరువాత నుంచి క్షయవ్యాధిపై భారత్‌ చేపట్టిన పోరు అద్వితీయమని గుర్తుచేశారు. భారత్‌ అనుసరిస్తున్న ఈ తరహా విధానాల ప్రయోజనాలను మరిన్ని దేశాలు పొందాలని ఆకాంక్షించారు. టీబీ రహిత భారత్‌ ప్రచారంలో ప్రజలు ‘ని-క్షయ మిత్ర’లుగా చేరి.. 10 లక్షల మంది క్షయ రోగులను దత్తత తీసుకున్నారని, వీరంతా రూ.వెయ్యి కోట్లకు పైగా ఆర్థిక సాయాన్ని అందజేసినట్లు వివరించారు. అలాగే 2018 నుంచి రూ.2,000 కోట్ల ఆర్థిక సాయాన్ని 75 లక్షల మంది రోగుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా క్షయవ్యాధి నిర్మూలనకు వివిధ కార్యక్రమాలు ప్రారంభించిన ప్రధాని పలు రాష్ట్రాలకు అవార్డులు సైతం అందజేశారు. 2023 ఏడాది క్షయ వ్యాధి నివేదిక విడుదల చేసిన అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని