దోషుల విడుదలలో ఏకరూప ప్రమాణాలే పాటించారా?

గుజరాత్‌ అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానోపై అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య ఘటనలు భయంకరమైనవని సుప్రీంకోర్టు పేర్కొంది.

Published : 28 Mar 2023 04:46 IST

బిల్కిస్‌ బానో కేసులో గుజరాత్‌  ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీం
శిక్ష తగ్గింపు నిర్ణయం పత్రాలను 18న అందజేయాలని ఆదేశం

దిల్లీ: గుజరాత్‌ అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానోపై అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య ఘటనలు భయంకరమైనవని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో దోషులుగా తేలిన 11 మందికి...ఇతర హత్యకేసుల్లోని ఖైదీలను జైలు నుంచి విడుదల చేయడానికి అనుసరించే ప్రమాణాలనే వర్తింపజేశారా? అని ప్రశ్నించింది. దోషుల విడుదలను సవాల్‌ చేస్తూ బాధితురాలు బిల్కిస్‌ బానో, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. జైలు నుంచి దోషుల విడుదల నిర్ణయానికి సంబంధించిన పత్రాలను ఏప్రిల్‌ 18న సమర్పించాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును భావోద్వేగాలతో కాకుండా, చట్ట ప్రకారం విచారిస్తామని పేర్కొంది. అనేక అంశాలు ఇమిడి ఉన్నందున సమగ్ర విచారణ అవసరమని తెలిపింది. కేంద్రం, గుజరాత్‌ ప్రభుత్వంతో పాటు దోషులకు నోటీసులు జారీ చేసింది.

తదుపరి విచారణ జరిగే ఏప్రిల్‌ 18నాటికి వారి వాదనలను దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ‘అంత తీవ్రంగాని నేరాలకు జైలు శిక్షపడిన వ్యక్తులు ముందస్తు విడుదల కోరుతూ దాఖలు చేసుకునే పిటిషన్లను పట్టించుకోని సందర్భాలను చూస్తుంటాం. అత్యంత తీవ్రమైన ఈ కేసులో ఇతర కేసులతో సమానమైన ప్రమాణాలనే పాటించారా అన్నదే అసలు విషయం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దోషుల విడుదలపై నిర్ణయం తీసుకోవాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిందా అని ప్రశ్నించింది. ఇది వరకు జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ బేలా ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం ముందుకు బిల్కిస్‌ బానో కేసు విచారణకు రాగా జనవరి 4న జస్టిస్‌ త్రివేది తప్పుకొన్నారు.


ప్రభుత్వ కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే వెంట బిల్కిస్‌ బానో కేసులో దోషి

దోహోద్‌: బిల్కిస్‌ బానోపై అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో శిక్షపడి, జైలు నుంచి విడుదలైన 11 మంది ఖైదీల్లో శైలేష్‌ భట్‌ ఒకరు. జైలు నుంచి వీరిని గుజరాత్‌ ప్రభుత్వం నిర్ణయం మేరకు విడుదల చేయడం తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో శైలేష్‌ భట్‌ శనివారం గుజరాత్‌లోని దాహోద్‌ జిల్లా లిమ్‌ఖేడాలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో భాజపా ఎంపీ జశ్వంత్‌ భాభోర్‌, ఎమ్మెల్యే శైలేష్‌ భాభోర్‌తో కలిసి వేదికను పంచుకున్నారు. దీనికి సంబంధించిన చిత్రాన్ని శైలేష్‌ భాభోర్‌ ట్విటర్‌లోనూ పోస్ట్‌ చేశారు. రూ.100 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన పైప్‌లైన్‌ నిర్మాణ పనుల ప్రారంభం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని