లొంగిపోనున్న అమృత్‌పాల్‌?

ఈ నెల 18న పంజాబ్‌ పోలీసుల నుంచి తృటిలో తప్పించుకుని పరారీలో ఉన్న ఖలిస్థాన్‌ వేర్పాటువాది, వారిస్‌ పంజాబ్‌ దే అధినేత అమృత్‌పాల్‌ సింగ్‌ పోలీసులకు లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Published : 30 Mar 2023 06:02 IST

అకల్‌ తఖ్త్‌ సూచనతో యోచన

చండీగఢ్‌: ఈ నెల 18న పంజాబ్‌ పోలీసుల నుంచి తృటిలో తప్పించుకుని పరారీలో ఉన్న ఖలిస్థాన్‌ వేర్పాటువాది, వారిస్‌ పంజాబ్‌ దే అధినేత అమృత్‌పాల్‌ సింగ్‌ పోలీసులకు లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సిక్కులకు పవిత్రమైన అకల్‌ తఖ్త్‌ సంస్థ సూచన మేరకు అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం అకల్‌ తఖ్త్‌ జతేదార్‌ జ్ఞాని హర్‌ప్రీత్‌ సింగ్‌తో అమృత్‌పాల్‌ సమావేశమవుతాడని, అనంతరం పోలీసులకు లొంగిపోనున్నాడని వార్తలు వచ్చాయి. పోలీసుల నుంచి ఎంతో కాలం తప్పించుకోలేనని భావించిన అమృత్‌పాల్‌ లొంగిపోయేందుకు పంజాబ్‌కు వచ్చాడని నిఘా వర్గాలు వెల్లడించాయి.

పోలీసులు నా ఇంటికి వచ్చుంటే లొంగిపోయేవాణ్ని: అమృత్‌పాల్‌ 

అమృత్‌పాల్‌ మాట్లాడిన వీడియో ఒకటి బుధవారం సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. ‘‘లక్షల మంది పోలీసుల నుంచి దేవుడు మమ్మల్ని కాపాడాడు. పంజాబ్‌ ప్రభుత్వానికి నన్ను అరెస్టు చేసే ఉద్దేశం ఉంటే పోలీసులను నా ఇంటికి పంపి ఉండాల్సింది. అప్పుడు నేను లొంగిపోయేవాణ్ని’’ అని అమృత్‌పాల్‌ వీడియోలో పేర్కొన్నాడు. 

కారును వదిలి పారిపోయాడు!

అమృత్‌పాల్‌ కోసం పంజాబ్‌ పోలీసులు ముమ్మర వేట కొనసాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం హోశియార్‌పుర్‌ జిల్లాలోని ఓ ప్రాంతంలో అనుమానాస్పద కారు ఒకటి కనిపించింది. అందులో అమృత్‌పాల్‌తో పాటు అతడి అనుచరులు ఇద్దరు ఉన్నట్లు అనుమానించిన పోలీసులు దాన్ని వెంబడించారు. ఈ క్రమంలో వాహనంలో ఉన్నవారు మర్నైయన్‌ గ్రామ సమీపంలో దాన్ని వదిలి పారిపోయారు. దీంతో పోలీసులు ఆ గ్రామంతో పాటు సమీప ప్రాంతాల్లో మంగళవారం అర్ధరాత్రి వరకూ పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. మరోవైపు పంజాబ్‌లోని జలంధర్‌ జిల్లా పోలీసుల నుంచి అమృత్‌పాల్‌ తప్పించుకున్న తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆరుగురు పోలీసు అధికారులను బదిలీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని