స్వలింగ వివాహాలకు చట్టబద్ధత వద్దు

స్వలింగ సంపర్కుల మధ్య వివాహాలను అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. అటువంటి పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించడం సామాజికంగా, నైతికంగా విపరిణామాలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 31 Mar 2023 04:29 IST

అవి మత, సామాజిక, నైతిక విలువలకు విరుద్ధం
సీజేఐకి అల్పసంఖ్యాక వర్గాల ప్రతినిధుల వినతి

దిల్లీ: స్వలింగ సంపర్కుల మధ్య వివాహాలను అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. అటువంటి పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించడం సామాజికంగా, నైతికంగా విపరిణామాలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైయక్తిక చట్టాలు(పర్సనల్‌ లా), మత విశ్వాసాలకు విరుద్ధమని పేర్కొంటూ తమ అభిప్రాయాలను భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌కు లిఖితపూర్వకంగా తెలియజేశారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన వివిధ పిటిషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా తన వ్యతిరేకతను తెలియజేసింది. తాజాగా అజ్‌మేడ్‌లోని ‘చిష్తీ ఫౌండేషన్‌’కు చెందిన సయ్యద్‌ సల్మాన్‌ చిష్తీ, ‘కమ్యూనియన్‌ ఆఫ్‌ చర్చెస్‌ ఇన్‌ ఇండియా’కు చెందిన ప్రకాశ్‌ పి.థామస్‌, జైనుల గురువు ఆచార్య లోకేశ్‌, వెనుకబడిన ముస్లిం(పస్మండ) వర్గానికి చెందిన పర్వేజ్‌ హనీఫ్‌ తదితరులు కూడా స్వలింగ వివాహాలపై తమ అభ్యంతరాలను, ఆందోళనలను జస్టిస్‌ చంద్రచూడ్‌కు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వైవిధ్య భరితమైన భారత దేశంలో మత విశ్వాసాలు, ఆచారాలు, సంప్రదాయాలు, నైతిక, సామాజిక విలువలకు ప్రజలు అత్యధిక ప్రాధాన్యమిస్తారని వారు పేర్కొన్నారు. స్వలింగ వివాహాల అంశం సంక్లిష్టమైనదే కాకుండా సున్నితమైనది కూడానని అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని అత్యంత జాగరూకతతో పరిశీలించి, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆయా సంస్థల ప్రతినిధులు స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని