వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో అజాగ్రత్త వహించడమూ నిర్లక్ష్యపు డ్రైవింగే

వాహనాన్ని దురుసుగా, మితిమీరిన వేగంతో, నిబంధనలు ఉల్లంఘిస్తూ నడపడాన్ని సాధారణంగా నిర్లక్ష్యపు డ్రైవింగ్‌గా పరిగణిస్తుంటారు.

Updated : 31 Mar 2023 05:35 IST

దిల్లీ హైకోర్టు స్పష్టీకరణ

దిల్లీ: వాహనాన్ని దురుసుగా, మితిమీరిన వేగంతో, నిబంధనలు ఉల్లంఘిస్తూ నడపడాన్ని సాధారణంగా నిర్లక్ష్యపు డ్రైవింగ్‌గా పరిగణిస్తుంటారు. అయితే, ముందున్న వాహనం లేదా నిలిపి ఉంచిన వాహనాన్ని దాటి ముందుకెళ్లే క్రమంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడాన్ని కూడా నిర్లక్ష్యపు డ్రైవింగ్‌గానే భావించాలని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌(డీటీసీ) బస్సును రహదారి మధ్యలో పార్కుచేసి ఉంచడం వల్ల బైక్‌పై వస్తున్న వ్యక్తి ప్రమాదానికి గురై మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ విషయాన్ని వెల్లడించింది. 2012 జులై 22 రాత్రి జరిగిన ఆ ప్రమాదానికి గాను బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారాన్ని 7.5శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని బీమా కంపెనీని ‘మోటారు ప్రమాదాల వ్యాజ్యాల ట్రైబ్యునల్‌’ ఆదేశించింది. అయితే, జరిగిన ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న వ్యక్తి నిర్లక్ష్యమూ కొంత ఉందని పేర్కొంటూ పరిహారంలో 20శాతం కోత విధించింది. దీనిని సవాల్‌ చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులు దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ముందున్న వాహనం...అది కదులుతున్నా లేదా నిలిచి ఉన్నా...దానిని ఓవర్‌టేక్‌ చేసే వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని హైకోర్టు అభిప్రాయపడింది. పరిహారాన్ని రూ.42లక్షలకు పెంచింది. ట్రైబ్యునల్‌ మాదిరిగానే నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు గాను 20శాతం కోత విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని