లొంగుబాటుపై చర్చలు జరపలేదు.. ఆడియో క్లిప్‌లో అమృత్‌పాల్‌

పరారీలో ఉన్న ఖలిస్థాన్‌ వేర్పాటువాది అమృత్‌పాల్‌ సింగ్‌ మాట్లాడిన ఆడియో క్లిప్‌ ఒకటి గురువారం సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది.

Published : 31 Mar 2023 05:06 IST

చండీగఢ్‌: పరారీలో ఉన్న ఖలిస్థాన్‌ వేర్పాటువాది అమృత్‌పాల్‌ సింగ్‌ మాట్లాడిన ఆడియో క్లిప్‌ ఒకటి గురువారం సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. తాను లొంగిపోవడానికి సిద్ధమై కొందరితో చర్చలు జరుపుతున్నట్లు వచ్చిన వార్తలను అతడు అందులో ఖండించాడు. అరెస్టవడానికి కొన్ని షరతులను పెట్టినట్లు వస్తున్న ఊహాగానాలూ నిజం కాదని ప్రకటించాడు. మరోవైపు సిక్కుల సమస్యలపై చర్చించడానికి వెంటనే మత సమావేశాన్ని (సర్బత్‌ ఖల్సా) ఏర్పాటు చేయాలని అకాల్‌ తఖ్త్‌ సంస్థ జతేదార్‌(అధిపతి) జ్ఞాని హర్‌ప్రీత్‌ సింగ్‌ను అమృత్‌పాల్‌ డిమాండ్‌ చేశాడు.

త్వరలో అందరి ముందుకు వస్తా

అమృత్‌పాల్‌కు సంబంధించిన మరో వీడియో గురువారం సామాజిక మాధ్యమాల్లో కనిపించింది. ‘‘నేను పారిపోయా నని, అనుచరులను వదిలేశానని అనుకుం టున్నవారు ఆ భావనను విడిచి పెట్టండి. నేను మరణానికి భయ పడను. పోరాటంలో ఇలాంటి కఠిన సమయాలు ఎదుర్కోక తప్పదు. త్వరలో అందరి ముందుకు వస్తాను’’ అని అమృత్‌పాల్‌ ఆ వీడియోలో పేర్కొన్నాడు.

డ్రోన్‌తో గాలింపు

అమృత్‌పాల్‌ కోసం పంజాబ్‌ పోలీసులు గాలింపును ఉద్ధృతం చేశారు. హోశియార్‌పుర్‌ జిల్లాలోని మర్నైయన్‌ గ్రామ సమీపంలో గురువారం డ్రోన్‌ను రంగంలోకి దింపి అణువణువూ గాలిస్తున్నారు. మంగళవారం రాత్రి ఓ అనుమానాస్పద కారును పోలీసులు వెంబడించడంతో అందులో ఉన్నవారు ఈ గ్రామ సమీపంలో వాహనాన్ని వదిలి పారిపోయిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తులు అమృత్‌పాల్‌, అతడి అనుచరులు అయి ఉండొచ్చన్న అనుమానంతో అక్కడ మూడు రోజులుగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

అమృత్‌పాల్‌ అనుచరుడిపై కశ్మీర్‌లో కేసు

అమృత్‌పాల్‌ అంగరక్షకుడిగా భావిస్తున్న వరిందర్‌ సింగ్‌ అలియాస్‌ ఫౌజీ అనే వ్యక్తిపై జమ్మూకశ్మీర్‌లోని కిస్తవార్‌ జిల్లా పోలీసులు ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. అతడి తుపాకీ లైసెన్సును రద్దు చేశారు. ఆర్మీ జవానుగా పనిచేసిన వరిందర్‌ 2015లో విధుల నుంచి బహిష్కరణకు గురయ్యాడని, అయినప్పటికీ అతడు కశ్మీర్‌లోని వివిధ జిల్లాల్లో తుపాకీ లైసెన్సును పునరుద్ధరించుకుంటూ వచ్చాడని పోలీసులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని