రూ.2000 నోటు ఉపసంహరణ

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. చలామణి నుంచి రూ.2,000 నోటును ఉపసంహరిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 20 May 2023 06:53 IST

మే 23 నుంచి సెప్టెంబరు 30 వరకు మార్చుకోవడానికి, డిపాజిట్‌ చేసేందుకు అవకాశం
ఒక్కోసారి రూ.20 వేల వరకే మార్చుకునేందుకు వీలు
తక్షణం బ్యాంకులు రూ.2వేల నోట్ల   జారీ నిలిపేయాలి
ఆర్‌బీఐ ఉత్తర్వులు

ఈనాడు, దిల్లీ: భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. చలామణి నుంచి రూ.2,000 నోటును ఉపసంహరిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ నోట్లు ఉన్న ప్రజలు వాటిని ఈనెల 23 నుంచి సెప్టెంబరు 30వ తేదీలోపు బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చని, ఇతర నోట్లలోకి మార్చుకోవచ్చని వెల్లడించింది. ‘క్లీన్‌ నోట్‌ పాలసీ’ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

2016లో జారీ

‘‘ఆర్‌బీఐ చట్టం 1934 సెక్షన్‌ 24(1) కింద 2016 నవంబరులో రూ.2,000 నోటును ప్రవేశపెట్టాం. అప్పటివరకు చలామణిలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో... ఎదురైన ఆర్థిక అవసరాలను వేగంగా అందిపుచ్చుకోవడానికి రూ.2,000 నోట్లు ప్రవేశపెట్టాం. ప్రస్తుతం ఇతర నోట్లు తగినంత సంఖ్యలో అందుబాటులోకి రావడంతో రూ.2,000 నోట్ల జారీ లక్ష్యం పూర్తయింది. అందుకే 2018-19లోనే వీటి ముద్రణ నిలిపేశాం. ఇప్పటివరకున్న రూ.2,000 నోట్లలో 89% వరకు, 2017 మార్చి ముందు జారీ చేసినవే. అంటే ఆ నోట్లు జారీ అయి 4-5 ఏళ్లు అవుతోంది.

ప్రస్తుతమున్నది రూ.3.62 లక్షల కోట్లే

2018 మార్చి 31 నాటికి గరిష్ఠంగా రూ.6.73 లక్షల కోట్ల మేర రూ.2.000 నోట్లు చలామణిలో ఉన్నాయి. చలామణిలో ఉన్న నగదులో ఇది 37.3 శాతం. 2023 మార్చి 31 నాటికి రూ.3.62 లక్షల కోట్లకు (చలామణిలో ఉన్న నగదులో 10.8%) తగ్గిపోయాయి. అంటే ఈ నోట్లను సాధారణ లావాదేవీలకు ఉపయోగించడం లేదు. ప్రస్తుతం ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఇతర నోట్ల నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘క్లీన్‌ నోట్‌ పాలసీ’కి అనుగుణంగా రూ.2,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నాం’’ అని ఆర్‌బీఐ తెలిపింది. గతంలోనూ ఆర్బీఐ 2005 నుంచి అమల్లో ఉన్న పాత నోట్లను 2014 ఏప్రిల్‌ 1 నుంచి చలామణి నుంచి ఉపసంహరించింది.

ప్రజలేం చేయాలంటే...

‘‘రూ.2,000 నోట్ల చెల్లుబాటు (లీగల్‌ టెండర్‌) కొనసాగుతుంది. అందువల్ల ప్రజలు తమ అవసరాలకు ఈ నోటును వినియోగించుకోవచ్చు. చెల్లింపుల కింద స్వీకరించవచ్చు కూడా. అయితే తమ వద్ద ఉన్న రూ.2,000 నోట్లను సెప్టెంబరు 30లోగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవాలని... లేదా బ్యాంకు శాఖలకు వెళ్లి ఇతర నోట్లలోకి మార్చుకోవాలని సూచిస్తున్నాం. ప్రస్తుత సూచనలు, కేవైసీ వంటి చట్టబద్ధమైన నిబంధనలకు లోబడి, ఎలాంటి ఆంక్షలు లేకుండా ఈ నోట్లను సాధారణంగానే బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చు’’ అని ఆర్‌బీఐ తెలిపింది.

* బ్యాంకింగ్‌ కరస్పాండెంట్ల ద్వారా కూడా రోజుకు రూ.4,000 విలువ వరకు ఒక ఖాతాపై రూ.2,000 నోట్లను మార్చుకునే వీలుంది. తక్షణం రూ.2,000 నోట్ల జారీని ఆపేయాలని బ్యాంకులకు ఉత్తర్వులు జారీ చేశాం. సెప్టెంబరు 30 వరకు ఇచ్చిన గడువును ఉపయోగించుకుని, ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడం కానీ, మార్చుకోవడం కానీ చేసుకోవచ్చు’’ అని ఆర్‌బీఐ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.


నిర్వహణ సౌకర్యం, బ్యాంకు శాఖల సాధారణ కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా చూడటానికి ఈనెల 23 నుంచి ఏ బ్యాంకు శాఖలోనైనా, ఒక లావాదేవీలో రూ.20 వేల విలువ వరకు రూ.2,000 నోట్లను ఇతర నోట్లలోకి ఎటువంటి రుసుము లేకుండా మార్చుకోవడానికి వీలు కల్పిస్తున్నాం. ప్రజలకు తగినంత సమయం ఇచ్చేందుకే వీటి డిపాజిట్‌/మార్పిడికి 2023 సెప్టెంబరు 30వరకు గడువు ఇస్తున్నాం. ఇందుకోసం బ్యాంకులకు ప్రత్యేక నిబంధనలు జారీ చేశాం. ఈనెల 23 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ 19 ప్రాంతీయ కార్యాలయాల వద్దా ఒక్కోసారి రూ.20 వేల విలువ వరకు రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు వీలు కల్పిస్తున్నాం.

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని