త్వరలో పర్యాటక పాలసీ

కేంద్ర ప్రభుత్వం త్వరలో జాతీయ పర్యాటక విధానాన్ని ప్రకటించనుందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు.

Updated : 23 May 2023 05:46 IST

జీ-20 సదస్సులో కిషన్‌రెడ్డి వెల్లడి
శ్రీనగర్‌లో ఘనంగా ప్రారంభమైన సమావేశం

ఈనాడు, దిల్లీ- శ్రీనగర్‌: కేంద్ర ప్రభుత్వం త్వరలో జాతీయ పర్యాటక విధానాన్ని ప్రకటించనుందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ పర్యాటక పెట్టుబడుల సదస్సునూ నిర్వహించాలని భావిస్తున్నామని వెల్లడించారు. పర్యాటక రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. పర్యాటకాభివృద్ధిలో దేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు జీ-20 దేశాలను భాగస్వాములను చేస్తున్నామని పేర్కొన్నారు. పర్యాటక రంగ ప్రచారంలో ప్రస్తుతం సినీ టూరిజం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని, కశ్మీర్‌తోపాటు దేశవ్యాప్తంగా పర్యాటకానికి మరింత ఊతమిచ్చేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. పర్యాటకం ద్వారా ఆతిథ్య, ఆహార రంగాల్లో ఎన్నో ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. సినిమాల్లో ప్రకృతి రమణీయ స్థలాలను చూసిన తర్వాత ఆ ప్రాంతాలకు పర్యాటకులు పెరిగిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సోమవారం నుంచి 3 రోజులపాటు జరుగుతున్న జీ-20 సమావేశాల్లో ‘ఆర్థిక వృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ కోసం సినిమా పర్యాటకం’ అన్న ఇతివృత్తంపై ఆయన మాట్లాడారు. ‘భూతల స్వర్గమైన శ్రీనగర్‌ ప్రకృతి రమణీయత గురించి ప్రాచీన కాలం నుంచీ ఎంతో గొప్పగా వివరిస్తూ వచ్చారు. అందుకే ఇక్కడ సినిమాలు తీసేందుకు పలువురు నిర్మాతలు, దర్శకులు ఆసక్తి చూపేవారు.

దేశంలో ప్రకృతి వైవిధ్యం కారణంగా సినిమాల ద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి విస్తృతమైన అవకాశాలున్నాయి. దేశంలో ఎత్తయిన పర్వతాలు, రంగురంగుల పూల లోయలు, సముద్ర తీరాలు, నదులు, వేడి, చల్లటి ప్రాంతాలు, వివిధ మతాలకు చెందిన ఆధ్యాత్మిక క్షేత్రాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, వారసత్వ నిర్మాణాల వంటివెన్నో సినిమాల నిర్మాణానికి ఉపయోగపడతాయి. వీటితోపాటు దేశంలో నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులతోపాటు అత్యాధునిక పోస్టు ప్రొడక్షన్‌ యూనిట్లున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు పర్యాటక రంగాభివృద్ధిలో సినిమాల పాత్రను గుర్తించి ప్రోత్సహిస్తున్నాయి. దీనివల్ల ఆర్థిక ప్రగతితోపాటు ఉపాధి కల్పనా పెరుగుతుంది’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నటుడు, ఆస్కార్‌ అవార్డు ద్వారా నాటు నాటు పాటతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రామ్‌ చరణ్‌ను ఆహూతులకు కిషన్‌రెడ్డి పరిచయం చేశారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం కరతాళ ధ్వనులతో మారుమోగింది. కార్యక్రమంలో 61 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. చైనా ప్రతినిధులు మాత్రం హాజరుకాలేదు. జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌, పర్యాటకశాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌, జీ-20 షెర్పా అమితాబ్‌ కాంత్‌, జీ-20 కోఆర్డినేటర్‌ హర్షవర్ధన్‌ శ్రింగ్లా, పర్యాటకశాఖ కార్యదర్శి అరవింద్‌ సింగ్‌, చలనచిత్ర నిర్మాత దిల్‌ రాజు తదితరులు హాజరయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు