Sengol: సెంగోల్‌ అందుకున్న ప్రధాని.. దిల్లీలో మఠాధిపతులతో భేటీ

బ్రిటిష్‌ పాలకుల నుంచి మన దేశానికి 1947లో లభించిన స్వాతంత్య్రానికి చిహ్నంగా నిలిచే ‘ఉత్సవ రాజదండం’ (సెంగోల్‌)కు ఆ తర్వాత తగినంత గౌరవం ఇవ్వకపోగా ప్రయాగ్‌రాజ్‌లోని ఆనంద్‌భవన్‌లో చేతికర్రగా ప్రదర్శనలో ఉంచారని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు.

Updated : 28 May 2023 07:41 IST

దిల్లీ: బ్రిటిష్‌ పాలకుల నుంచి మన దేశానికి 1947లో లభించిన స్వాతంత్య్రానికి చిహ్నంగా నిలిచే ‘ఉత్సవ రాజదండం’ (సెంగోల్‌)కు ఆ తర్వాత తగినంత గౌరవం ఇవ్వకపోగా ప్రయాగ్‌రాజ్‌లోని ఆనంద్‌భవన్‌లో చేతికర్రగా ప్రదర్శనలో ఉంచారని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. ఆదివారం నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనుండడం, దానిలో సెంగోల్‌కు స్థానం లభించనున్న నేపథ్యంలో తమిళనాడుకు చెందిన హిందూ మఠాధిపతులు (అధీనామ్‌లు) ప్రధానిని శనివారం ఆయన నివాసంలో కలిశారు. మంత్రోచ్చారణ నడుమ ఒక సెంగోల్‌ను, మరికొన్ని కానుకలను అందజేశారు. వారిని ప్రధాని స్వాగతిస్తూ, ఆశీస్సులు కోరిన తర్వాత ఈ వ్యాఖ్య చేశారు. పురావస్తుశాలగా ఉన్న నెహ్రూ నివాసం ఆనంద్‌భవన్‌ నుంచి సెంగోల్‌ను తాము బయటకు తీసుకువచ్చినట్లు తెలిపారు.

తమిళుల ప్రాధాన్యాన్ని విస్మరించారు

‘1947 అధికార మార్పిడికి పవిత్ర చిహ్నంగానే కాకుండా వలసవాద పాలన ముందునాటి సంప్రదాయాలను స్వతంత్ర భారత్‌తో అనుసంధానించేదిగా సెంగోల్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. అలాంటి రాజదండానికి తగిన విలువనిచ్చి, గౌరవప్రదమైన స్థితిలో ఉంచిఉంటే ఎంతో బాగుండేది. కానీ దానిని ఒక చేతికర్రగా చూపించారు. అధికార బదలాయింపు చిహ్నంపై ఓ సందేహం ఉండేది. దానిపై ఆరాతీస్తే.. సి.రాజగోపాలాచారి, అధీనామ్‌ల పర్యవేక్షణలో అధికారాల బదిలీ జరిగినట్లు పురాతన తమిళ సంస్కృతిలో ఆధారం లభించింది. అప్పట్లో ప్రత్యేకంగా దీనిని ‘తిరువాదుత్తురై అధీనం’ తయారుచేసింది. గొప్ప సంప్రదాయానికి చిహ్నమైన దానిని ఇప్పుడు పార్లమెంటు నూతన భవనంలో నెలకొల్పబోతున్నామంటే నాకెంతో ఆనందంగా ఉంది. సెంగోల్‌కు ఎట్టకేలకు ప్రజాస్వామ్య దేవాలయంలో సముచిత స్థానం లభిస్తోంది. ప్రభుత్వాన్ని నడుపుతున్నవారు కర్తవ్యపథంలో నడిచి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఇది గుర్తుచేస్తుంటుంది. నూతన భవన ప్రారంభోత్సవంలో అధీనామ్‌లు పాల్గొనబోవడం ముదావహం’ అని మోదీ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు