రెజ్లర్లపై ఉక్కుపాదం

పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా మహిళల మహా పంచాయత్‌ పేరుతో ఆందోళనకు సిద్ధమైన రెజ్లర్లను అదుపులోకి తీసుకునే క్రమంలో దిల్లీ పోలీసులు వారిని ఈడ్చుకెళ్లి మరీ బస్సులో పడేశారు.

Updated : 29 May 2023 04:41 IST

తీవ్రంగా తోపులాట, ఉద్రిక్తత
కన్నీరు పెట్టుకున్న వినేశ్‌ ఫొగాట్‌
జంతర్‌మంతర్‌లోని సామగ్రినీ తరలించిన పోలీసులు

దిల్లీ: పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా మహిళల మహా పంచాయత్‌ పేరుతో ఆందోళనకు సిద్ధమైన రెజ్లర్లను అదుపులోకి తీసుకునే క్రమంలో దిల్లీ పోలీసులు వారిని ఈడ్చుకెళ్లి మరీ బస్సులో పడేశారు. చాలాకాలంగా జంతర్‌మంతర్‌వద్ద ఆందోళన చేస్తున్న వారు ఆదివారం ఆంక్షలను దాటుకుని పార్లమెంటువైపు బయలుదేరేందుకు సిద్ధంకాగా పోలీసులు అడ్డుకున్నారు. వినేశ్‌ ఫొగాట్‌, సాక్షి మలిక్‌, బజ్‌రంగ్‌ పునియాలను బలవంతగా అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారినీ బస్సుల్లో ఎక్కించి వేర్వేరు చోట్లకు తరలించారు. ఆ వెంటనే జంతర్‌మంతర్‌ను పోలీసులు ఖాళీ చేయించారు.

తమను మానసికంగా, లైంగికంగా వేధించిన రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏప్రిల్‌ 23 నుంచి రెజ్లర్లు జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో పార్లమెంటు భవన ప్రారంభోత్సవం వద్ద ఆందోళన నిర్వహించాలని వారు నిర్ణయించారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. పార్లమెంటువైపు బయలుదేరిన రెజ్లర్లకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. వినేశ్‌, సంగీత, సాక్షి బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించారు. వారిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నించే క్రమంలో తీవ్ర పెనుగులాట జరిగింది. వారిని పోలీసులు ఈడ్చుకెళ్లి బస్సులో ఎక్కించారు. మిగిలిన వారినీ అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్టు చేస్తున్న సమయంలో వినేశ్‌ ఫొగాట్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. న్యాయం చేయాలని డిమాండు చేసినందుకు శిక్షిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడు బ్రిజ్‌భూషణ్‌ పార్లమెంటులో కూర్చున్నారని, దేశం కోసం పతకాలను సాధించిన తమను రోడ్లపై ఈడ్చుకెళ్లారని, ఇది భారత క్రీడారంగానికి చీకటి రోజని సాక్షి మలిక్‌ ధ్వజమెత్తారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న మహిళా రెజ్లర్లను సాయంత్రానికి విడుదల చేశారు. అయితే ఆందోళనకు దిగిన రెజ్లర్లు, వారితోపాటు ఉన్నవారిపై పోలీసులు కేసులు పెట్టారు. జంతర్‌మంతర్‌వద్ద ఆందోళనను కొనసాగిస్తామని, ఆపేది లేదని విడుదలైన అనంతరం సాక్షి మలిక్‌ స్పష్టం చేశారు. మరోవైపు మహిళా మహా పంచాయత్‌ పేరుతో ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో హరియాణా, దిల్లీ సరిహద్దువద్ద పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దిల్లీకి బయలుదేరిన రైతు సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఘాజీపుర్‌వద్ద భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయిత్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసు చర్యలపై ఖండన

రెజ్లర్లను అరెస్టు చేయడాన్ని పలువురు నేతలు, క్రీడాకారులు ఖండించారు. పట్టాభిషేకం అయిపోయిందని, దురహంకారి అయిన రాజు వీధుల్లో ప్రజల గొంతును నొక్కేస్తున్నారని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. దీంతోపాటు పోలీసులు క్రీడాకారులను అరెస్టు చేస్తున్న వీడియోను ఆయన ట్విటర్‌లో ఉంచారు. ప్రజాస్వామ్యమనేది సహనానికి ప్రతీకని, కానీ అరాచక శక్తులు అసహనంతో వ్యతిరేకించిన వారిపై దాడులు చేస్తున్నాయని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. క్రీడాకారులకు ఆమె మద్దతు ప్రకటించారు. పోలీసు చర్య ప్రభుత్వానికి సిగ్గుచేటని సీపీఎం వ్యాఖ్యానించింది. భారత్‌ క్రీడారంగానికి, ప్రజాస్వామ్యానికి ఇది అవమానకరమని మాజీ క్రికెట్‌ క్రీడాకారుడు, తృణమూల్‌ ఎమ్మెల్యే మనోజ్‌ తివారీ అభిప్రాయపడ్డారు. ఈ ఘటనను చూసి తాను చాలా బాధపడ్డానని, వారిని అడ్డుకోవడానికి ఇతర సరైన మార్గాలున్నాయని ఒలింపిక్‌ ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా అభిప్రాయపడ్డారు.

* బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలంటూ దిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ దిల్లీ పోలీసు కమిషనరుకు లేఖ రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు