కేసుల సుడిలో సెంట్రల్‌ విస్టా

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు సహా పార్లమెంటు నూతన భవనం గత కొన్ని సంవత్సరాలుగా పలు న్యాయ సవాళ్లను ఎదుర్కొన్నాయి.

Published : 29 May 2023 05:23 IST

పార్లమెంటు నూతన భవనం కూడా...

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు సహా పార్లమెంటు నూతన భవనం గత కొన్ని సంవత్సరాలుగా పలు న్యాయ సవాళ్లను ఎదుర్కొన్నాయి. 2019 సెప్టెంబరులో ప్రాజెక్టును ప్రకటించగా 2020, డిసెంబరు 10న పార్లమెంటు నూతన భవనానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. వీటికి సంబంధించిన కేసులన్నీ సుప్రీంకోర్టు, దిల్లీ హైకోర్టుల్లో ఉన్నాయి. తాజాగా దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో పార్లమెంటు కొత్త భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ప్రారంభింపజేసేలా లోక్‌సభ సెక్రటేరియట్‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ తమిళనాడుకు చెందిన న్యాయవాది జయ సుకిన్‌ వెకేషన్‌ బెంచ్‌ ముందుకు పిల్‌ దాఖలు చేశారు. దీన్ని విచారించేందుకు జస్టిస్‌ జె.కె.మహేశ్వరి, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహలతో కూడిన ధర్మాసనం శుక్రవారం నిరాకరించింది. సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయడాన్ని రాజీవ్‌ సూరి, అంజు శ్రీవాస్తవలతో బాటు మరికొందరు తొలిసారి దిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. చివరకు సుప్రీం కోర్టుకు చేరిన ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చింది. 2021లో కొవిడ్‌ మహమ్మారి రెండో దశ విజృంభణ సందర్భంగా ఆరోగ్యం, భద్రతాపరమైన ఆందోళనలను వ్యక్తం చేస్తూ నిర్మాణ పనులు నిలిపేయాలంటూ అనన్య మల్హోత్రా, సొహైల్‌ హష్మీ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు వారి వాదనను తోసిపుచ్చి నిర్మాణపనులకు పచ్చజెండా ఊపింది.  జాతీయ చిహ్నంలోని నాలుగు సింహాలు ఉగ్రంగా ఉన్నాయంటూ కొందరు పిటిషనర్లు, న్యాయవాది అల్దానీశ్‌ రెయిన్‌ సుప్రీంను ఆశ్రయించారు.

ఇక దృష్టి వీపీ ఎన్‌క్లేవ్‌పైనే

దిల్లీ: సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పార్లమెంటు నూతన భవన నిర్మాణం విజయవంతంగా పూర్తి కావడంతో ఇక ఈ ప్రాజెక్టులోని ఇతర నిర్మాణాలపై దృష్టి మళ్లనుంది. వాటిలో వైస్‌ప్రెసిడెంట్‌ ఎన్‌క్లేవ్‌, కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్‌ బిల్డింగ్స్‌, డిఫెన్స్‌ ఎన్‌క్లేవ్‌, ఎంపీల ఛాంబర్లు, ప్రధానమంత్రి కొత్త నివాసం, కార్యాలయం ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో తొలి నిర్మాణంగా గతంలో రాజ్‌పథ్‌గా వ్యవహరించిన కర్తవ్యపథ్‌ ఆధునికీకరణ పూర్తయింది. రెండోదైన పార్లమెంటు నూతన భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్‌ నిర్మించింది. పీఎంవోకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్‌ ఎన్‌క్లేవ్‌ హౌసింగ్‌, కేబినెట్‌ సెక్రటేరియట్‌, ఇండియా హౌస్‌-నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సెక్రటేరియట్‌ నిర్మాణాలను ఎల్‌ అండ్‌ టీ లిమిటెడ్‌ రూ.1189 కోట్ల అంచనా వ్యయంతో 2022 నవంబరులో చేపట్టింది. అప్పటి నుంచి 24 నెలల కాలంలో పూర్తి చేయాలన్నది లక్ష్యం. అలాగే రూ.3,142 కోట్ల అంచనా వ్యయంతో అదే సంస్థ కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్‌కు చెందిన మూడు భవనాలను నిర్మిస్తోంది. 2024 జూన్‌ నాటికి ఇందిరా గాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్ట్స్‌ (ఐజీఎన్‌సీఏ) కొత్త భవనాన్ని, 2026 డిసెంబరు నాటికి సెంట్రల్‌ కాన్ఫెరెన్స్‌ సెంటర్‌ నిర్మించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని