Population Census: లోక్‌సభ ఎన్నికల ముందు జనాభా లెక్కింపు లేనట్లే..!

దేశంలో పదేళ్లకోసారి నిర్వహించే జనాభా గణన వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోపు చేపట్టే అవకాశం లేదని అధికార వర్గాలు తెలిపాయి.

Updated : 29 May 2023 10:16 IST

ఈసారి డిజిటల్‌ గణన.. పౌరులకు 31 ప్రశ్నలు

దిల్లీ: దేశంలో పదేళ్లకోసారి నిర్వహించే జనాభా గణన వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోపు చేపట్టే అవకాశం లేదని అధికార వర్గాలు తెలిపాయి. ఈసారి 2020 ఏప్రిల్‌ 1 - సెప్టెంబరు 30 మధ్య ఈ లెక్కింపును చేపట్టాల్సి ఉండగా కొవిడ్‌  కారణంగా ఆ కార్యక్రమం నిరవధికంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. 2024 ఏప్రిల్‌-మే మధ్య లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. వచ్చే అక్టోబరు నుంచి ఈసీ చేపట్టే కార్యక్రమాల్లో, జనాభా గణన ప్రక్రియలోనూ ఒకే సిబ్బంది పాల్గొనాల్సి ఉంటున్నందున ఆ సమయంలో జనాభా లెక్కింపును చేపట్టడానికి అవకాశం ఉండదని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాతే జనాభా లెక్కింపు ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఈసారి చేపట్టే కార్యక్రమం తొలి డిజిటల్‌ జనాభా గణనగా ఉంటుంది. పౌరులు సొంతంగా వివరాలను సమర్పించే అవకాశాన్ని కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన స్వీయగణన పోర్టల్‌ను సంబంధిత యంత్రాంగం రూపొందించింది. ఈ ప్రక్రియలో ప్రజలు ఆధార్‌ లేదా మొబైల్‌ నంబరును అందించాల్సి ఉంటుంది. అలాగే పౌరులను అడిగే 31 ప్రశ్నల్లో.. ఇంటిలో ఎంతమంది నివసిస్తున్నారు? యజమాని ఎవరు? టెలిఫోన్‌ లైన్‌, ఇంటర్నెట్‌ కనెక్షన్‌, మొబైల్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌, సైకిలు, ద్విచక్రవాహనాలు, కారు, జీపు, వ్యాను వంటివి ఏమైనా ఉన్నాయా? తినడానికి వినియోగించే ప్రధాన ఆహార ధాన్యాలేమిటి? వంటివి ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని