చార్‌ధామ్‌ యాత్రకు ప్రారంభంలోనే రద్దీ

ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ యాత్రకు ఈసారి భారీసంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు.  మంచుకొండల్లో ప్రయాణానికి అక్కడక్కడా వీరికి కొంత అసౌకర్యం కలుగుతున్నట్లు తెలుస్తోంది.

Published : 01 Jun 2023 04:27 IST

ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ యాత్రకు ఈసారి భారీసంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు.  మంచుకొండల్లో ప్రయాణానికి అక్కడక్కడా వీరికి కొంత అసౌకర్యం కలుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. బద్రీనాథ్‌ - కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ ఛైర్మన్‌ అజేంద్ర అజయ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏప్రిల్‌ 25 నుంచి ఇప్పటివరకు కేదార్‌నాథ్‌ను 6 లక్షల మంది సందర్శించారు. బద్రీనాథ్‌ తెరిచినప్పటి (ఏప్రిల్‌ 27) నుంచి 5 లక్షల మంది వచ్చారు. ‘భక్తుల రద్దీ విపరీతంగా పెరిగి ట్రాఫిక్‌ నియంత్రణ ఇబ్బందిగా మారడంతోపాటు ఆలయాలకు వెళ్లే ట్రెకింగ్‌ మార్గాలు కొన్నిసార్లు జామ్‌ అవుతున్నాయి. నవంబరు రెండోవారం వరకూ ఈ యాత్ర ఉంటుంది. ఆలయాలను దర్శించడానికి సెప్టెంబర్‌ రెండోవారం తర్వాత అనుకూలమైన సమయం’ అని ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌కుమార్‌ తెలిపారు. గంగోత్రి, యమునోత్రి కోసం హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణాల నుంచి వచ్చే భక్తులు ముస్సోరీ మార్గాన్ని అనుసరించవద్దని సూచించారు. వాతావరణ సమాచారాన్ని ముందే తెలుసుకొని యాత్రకు బయలుదేరాలని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి చార్‌ధామ్‌ భక్తులకు విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని