దేశద్రోహ చట్టాన్ని పునరుద్ధరించాల్సిందే

దేశద్రోహ చట్టానికి సంబంధించిన భారతీయ శిక్షాస్మృతిలోని 124ఏ సెక్షన్‌ను పునరుద్ధరించాల్సిందేనని లా కమిషన్‌ కేంద్రానికి తేల్చి చెప్పింది.

Published : 02 Jun 2023 03:51 IST

కేంద్రానికి లా కమిషన్‌ నివేదిక

దిల్లీ: దేశద్రోహ చట్టానికి సంబంధించిన భారతీయ శిక్షాస్మృతిలోని 124ఏ సెక్షన్‌ను పునరుద్ధరించాల్సిందేనని లా కమిషన్‌ కేంద్రానికి తేల్చి చెప్పింది. అయితే కొన్ని సవరణలు చేయడంద్వారా ఈ సెక్షన్‌పై మరింత స్పష్టతనివ్వాల్సి ఉందని అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రాం మేఘ్‌వాల్‌కు 22వ లా కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ రితు రాజ్‌ అవస్థి నేతృత్వంలోని కమిటీ ఒక నివేదిక సమర్పించింది. ‘124 సెక్షన్‌ను దుర్వినియోగం చేయకుండా అడ్డుకునేందుకు కొన్ని మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించాలి. అవసరాన్ని బట్టి సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 154కు 1973 నాటి క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సెక్షన్‌ 196(3) నిబంధనను చేర్చాలి. దీనివల్ల సెక్షన్‌ 124ఏ కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సెక్షన్‌ దుర్వినియోగం అవుతుందనే కారణంతో మొత్తంగా దాన్ని రద్దు చేయాలనుకోవడం తగదు. ఉపా, జాతీయ భద్రతా చట్టాలు సెక్షన్‌ 124ఏ కింద నమోదు చేసే అన్ని కేసులకూ సరిపోవు. 124ఏ లేకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించే కేసుల్లో మరింత కఠినమైన తీవ్రవాద చట్టాలను ప్రయోగించాల్సి వస్తుంది. ఆయా దేశాల్లోని వాస్తవ పరిస్థితుల ఆధారంగా అక్కడి న్యాయ వ్యవస్థలు పనిచేస్తాయి. కొన్ని దేశాల్లో ఇటువంటి సెక్షన్లను రద్దు చేశారని చెప్పి మన దేశంలోనూ గుడ్డిగా అనుసరించలేం. 124ఏ సెక్షన్‌ను సవాలు చేయడంతో సుప్రీంకోర్టు దానిని పక్కనబెట్టింది. స్వాతంత్య్ర సమరయోధులపై అప్పట్లో బ్రిటిష్‌ ప్రభుత్వం దీనికింద కేసులు పెట్టినందున ఇప్పుడు అవసరం లేదని అంటున్నారు. కానీ పరిస్థితులను గమనిస్తే మన న్యాయ వ్యవస్థ నిర్మాణం మొత్తం వలసవాదంపై ఆధారపడిందే. అలాంటి వలసవాదాన్ని బూచిగా చూపించి ఈ సెక్షన్‌ను రద్దుచేయాలని కోరలేం. ఇదొక్కటే కాదు.. పలు చట్టాలను ఎన్నోసార్లు దుర్వినియోగం చేసిన సందర్భాలున్నాయి. అలాంటి వాటిలో కొన్నింటిని సుప్రీంకోర్టు కూడా గుర్తించింది. అందువల్ల కొన్నిసార్లు దుర్వినియోగం జరిగిందని రద్దు చేయాలని అనుకోవడం తగదు. దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకుని 124ఏని కొనసాగించడమే ఉత్తమం’ అని లా కమిషన్‌ కమిటీ స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని