తక్షణమే ఆయుధాలను అప్పగించండి

మణిపుర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రం చర్యలు వేగవంతం చేసింది. ఈశాన్య రాష్ట్ర పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గురువారం విలేకరుల సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించారు.

Updated : 02 Jun 2023 05:12 IST

లేకుంటే కఠిన చర్యలు తప్పవు
మణిపుర్‌ తీవ్రవాదులకు అమిత్‌ షా హెచ్చరిక

ఇంఫాల్‌: మణిపుర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రం చర్యలు వేగవంతం చేసింది. ఈశాన్య రాష్ట్ర పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గురువారం విలేకరుల సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఘర్షణలపై త్వరలోనే హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో దర్యాప్తు కమిటీని, గవర్నర్‌ ఆధ్వర్యంలో శాంతి సంఘాలను ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. హింస వెనుక కుట్రలు ఉన్నాయంటూ ఆరోపణలతో దాఖలైన ఆరు ఎఫ్‌ఐఆర్‌లపై సీబీఐ దర్యాప్తు చేయిస్తామని తెలిపారు. ‘‘ప్రస్తుత సంక్షోభానికి చర్చలే పరిష్కారం. హింస తాత్కాలిక దశ. త్వరలోనే అపార్థాలు తొలగిపోతాయి. పరిస్థితి సాధారణస్థితికి రానుంది’’ అని షా ఆశాభావం వ్యక్తం చేశారు. కుకీ, మైతీ వర్గాలతో పాటు.. ఇతర పౌర సమాజ సంస్థలతోనూ తాను మాట్లాడానని.. అందరూ శాంతికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వదంతులను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లైసెన్సు లేని ఆయుధాలను తక్షణం అప్పగించాలని కోరారు. లేకపోతే  కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

కొత్త డీజీపీగా రాజీవ్‌సింగ్‌

మణిపుర్‌ కొత్త డీజీపీగా త్రిపుర క్యాడర్‌కు చెందిన 1993 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి రాజీవ్‌ సింగ్‌ను గురువారం కేంద్రం నియమించింది. ప్రస్తుత డీజీపీ పి.దౌంగెల్‌ను హోంశాఖకు బదిలీ చేసింది. రాజీవ్‌ సింగ్‌.. గతంలో సీఆర్‌పీఎఫ్‌ ఐజీగా పనిచేశారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో మే 29న ఆయన్ను రాష్ట్రానికి ప్రత్యేక అధికారిగా పంపింది. తాజాగా డీజీపీ బాధ్యతలు అప్పగించింది.

ముగ్గురు పోలీసులకు గాయాలు

ఓవైపు హోంమంత్రి పర్యటన జరుగుతుండగానే మణిపుర్‌లో పోలీసులు, కుకీ తీవ్రవాదుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. కుంబీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. గాయపడిన పోలీసులు ఇంఫాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని