Delhi liquor policy case: అప్రూవర్‌గా మారిన శరత్‌చంద్రారెడ్డి

దిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకొంది. ఈ కేసులో ఏ-7గా ఉన్న అరబిందో ఫార్మా డైరెక్టర్‌ పెనక శరత్‌చంద్రారెడ్డి (వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు) అప్రూవర్‌గా మారారు.

Updated : 02 Jun 2023 09:49 IST

దిల్లీ మద్యం కేసులో ప్రత్యేక న్యాయస్థానం క్షమాభిక్ష
ఆయన సాక్ష్యాల ఆధారంగా ఇకపై విచారణ
ప్రముఖుల పాత్రను నిరూపించే ఎత్తుగడ
ఈనాడు - దిల్లీ

దిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకొంది. ఈ కేసులో ఏ-7గా ఉన్న అరబిందో ఫార్మా డైరెక్టర్‌ పెనక శరత్‌చంద్రారెడ్డి (వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు) అప్రూవర్‌గా మారారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలను స్వచ్ఛందంగా వెల్లడించడానికి తాను సిద్ధమేనని, అప్రూవర్‌గా మారేందుకు అనుమతించాలని శరత్‌చంద్రారెడ్డి సమర్పించిన అభ్యర్థనను ఇక్కడి రౌజ్‌ అవెన్యూలోని సీబీఐ, ఈడీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఆమోదించి క్షమాభిక్ష ప్రసాదించింది. ఫలితంగా ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, వారి పాత్రలేంటి, నేరం జరిగిన విధానం తదితర అంశాలపై ఆయన దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇవ్వనున్నారు. దాని ఆధారంగా భవిష్యత్తులో కీలక పరిణామాలు చోటుచేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. శరత్‌చంద్రారెడ్డి, వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ్‌, భారాస ఎమ్మెల్సీ కవితలు సౌత్‌గ్రూప్‌ను తెరవెనుక ఉండి నడిపించారని.. ఆప్‌ నేతలకు రూ.100 కోట్ల ముడుపులిచ్చి, మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారు చేయించుకున్నారన్నది ప్రధాన అభియోగం. ఇందులో మనీల్యాండరింగ్‌ జరిగిందని ఆరోపిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. మద్యం కుంభకోణంలో శరత్‌ కీలక వ్యక్తి అని ఈడీ ఇదివరకు దాఖలు చేసిన రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది.‘దిల్లీ మద్యం విధానం ప్రకారం ఏ వ్యక్తీ రెండు రిటైల్‌ జోన్లకు మించి నియంత్రించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా శరత్‌చంద్రారెడ్డి తన సొంత, బినామీ సంస్థల ద్వారా తొమ్మిది రిటైల్‌జోన్లను నియంత్రిస్తున్నారు. తయారీదారులు, టోకు, చిల్లర వ్యాపారులతో కలిపి సౌత్‌గ్రూప్‌ పేరుతో ఏర్పాటైన అతిపెద్ద సిండికేట్‌లో శరత్‌చంద్రారెడ్డి ప్రధాన భాగస్వామి’ అని ఈడీ పేర్కొంది.

అత్యున్నతస్థాయి వ్యూహంతోనే!

దిల్లీ మద్యం కేసులో వివిధ రాజకీయపార్టీలకు చెందిన పెద్ద నేతల ప్రమేయాన్ని బలంగా నిరూపించడానికే అత్యున్నతస్థాయి వ్యక్తుల ప్రోద్బలంతో శరత్‌రెడ్డి అప్రూవర్‌గా మారినట్లు కథనాలు వినిపిస్తున్నాయి.

నవంబరులో అరెస్టు.. తర్వాత బెయిల్‌

2022 నవంబరు 10వ తేదీ అర్ధరాత్రి 12.20 గంటలకు శరత్‌రెడ్డిని ఈడీ అరెస్టు చేసింది. 2023 మే 8న దిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. అంతకుముందు జనవరి 27న ఆయన నాయనమ్మ అంత్యక్రియల కోసం 14 రోజులపాటు మధ్యంతర బెయిల్‌ పొందారు. తర్వాత భార్య అనారోగ్యం కారణంగా ఏప్రిల్‌ 1న కోర్టు నాలుగు వారాల బెయిల్‌ ఇచ్చింది. తర్వాత తనకు అనారోగ్య సమస్యలున్నాయంటూ అపోలో ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా శరత్‌ దిల్లీ హైకోర్టులో దరఖాస్తు చేసుకుని.. పూర్తిస్థాయి బెయిల్‌ పొందారు. దిల్లీ మాజీ మంత్రి సత్యేంద్రజైన్‌ అనారోగ్య సమస్యలపై బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు దిల్లీలోని ప్రభుత్వాసుపత్రులు ఇచ్చిన ధ్రువీకరణపత్రాలపై తమకు అనుమానం ఉందని, అందువల్ల ఎయిమ్స్‌లో పరీక్షలు చేయించి.. నిర్ణయం తీసుకోవాలని ఈడీ న్యాయవాదులు వాదించారు. కానీ అంతకుముందు దిల్లీ హైకోర్టులో శరత్‌రెడ్డి బెయిల్‌ విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించారు. అనారోగ్య కారణాల వల్ల నిందితులకు బెయిల్‌ ఇవ్వడం సాధారణమేనని, కోర్టు సంతృప్తి చెందితే తగిన ఉత్తర్వులు జారీచేయొచ్చని చెప్పారు. ఆయన మధ్యంతర బెయిల్‌పై ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేయలేదని, సాక్ష్యాలను చెరిపేసేందుకూ ప్రయత్నించలేదని కూడా సమర్థించారు.  


అప్రూవర్‌గా మారితే..

శరత్‌రెడ్డిని ఇకపై నిందితుడిగా కాకుండా సాక్షిగా/అప్రూవర్‌గా చూపుతారు. ప్రాసిక్యూషన్‌ సమయంలో మిగతా నిందితులకు వ్యతిరేకంగా ఈయన సాక్ష్యం చెప్పే వీలు ఉంటుంది. నేరంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాల్గొన్న వారు అప్రూవర్‌గా మారినప్పుడు సీఆర్‌పీసీ సెక్షన్‌ 306 కింద చట్టపరంగా క్షమాభిక్ష ప్రసాదిస్తారు. ఇందుకు ప్రతిఫలంగా ఆ వ్యక్తి.. నేరం జరిగిన తీరు, అందులో వ్యక్తుల ప్రమేయం, అందుకు సాక్ష్యాలు, ఇతర అంశాలను దర్యాప్తు సంస్థలకు అందించి సహకరించాల్సి ఉంటుంది. దర్యాప్తు, విచారణ ఏ దశలో ఉన్నప్పుడైనా క్షమాభిక్ష ప్రసాదించొచ్చు. నేరానికి సంబంధించి సంపూర్ణమైన వాస్తవాలు వెల్లడించాలన్న షరతుతోనే కోర్టు అప్రూవర్లకు క్షమాభిక్ష ప్రసాదిస్తుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు