చీతాల ఆవాస ప్రాంతానికి కంచె వేయం

దక్షిణాఫ్రికా, నమీబియాల నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కుకి తీసుకొచ్చిన చీతాల కోసం అటవీ ప్రాంతంలో ప్రత్యేకంగా కంచెలు నిర్మించబోమని ప్రభుత్వ కమిటీ ఛైర్మన్‌ రాజేశ్‌ గోపాల్‌ స్పష్టం చేశారు.

Updated : 02 Jun 2023 05:06 IST

దక్షిణాఫ్రికా నిపుణుడి సూచనను తోసిపుచ్చిన ప్రభుత్వ కమిటీ ఛైర్మన్‌

దిల్లీ: దక్షిణాఫ్రికా, నమీబియాల నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కుకి తీసుకొచ్చిన చీతాల కోసం అటవీ ప్రాంతంలో ప్రత్యేకంగా కంచెలు నిర్మించబోమని ప్రభుత్వ కమిటీ ఛైర్మన్‌ రాజేశ్‌ గోపాల్‌ స్పష్టం చేశారు. అటవీ జంతువుల సంరక్షణ ప్రాథమిక నిబంధనలకు ఇది విరుద్ధమని తెలిపారు. చీతాల పునఃప్రవేశ ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీకి రాజేశ్‌ గోపాల్‌ నేతృత్వం వహిస్తున్నారు. కునో పార్కులో ఇటీవల వరుసగా మూడు పెద్ద చీతాలు, మరో మూడు చీతా కూనలు మృతి చెందిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా నిపుణుడు విన్సెంట్‌...కంచె నిర్మాణ సూచన చేశారు. తమ దేశంలో ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలిపారు. చీతాలు సంచరించే ప్రాంతాల్లోకి ఇతర అటవీ జంతువులు, మనుషుల సంచారాన్ని నిరోధించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని విన్సెంట్‌ వ్యక్తపరిచారు. అయితే, ఇటువంటి కంచెలు అటవీ జంతువుల సహజ సంచారానికి అవరోధంగా నిలుస్తాయని, జంతువుల మధ్య జన్యు మార్పిడికి ఆటంకం కలిగిస్తాయని రాజేశ్‌ గోపాల్‌ గురువారం దిల్లీలో పేర్కొన్నారు. గత 50 ఏళ్లుగా పులుల సంరక్షణను మన దేశం విజయవంతంగా చేపడుతోందని, చీతాల విషయంలోనూ సఫలం కాగలమన్న భరోసా వ్యక్తం చేశారు.

చీతాలకు ఏమి జరిగినా బాధ్యత మాదే: కేంద్ర మంత్రి

కునో పార్కులో చీతాలకు ఏమి జరిగినా తాము బాధ్యత వహిస్తామని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ అన్నారు. చీతాల ప్రాజెక్టు విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. చీతాల వరుస మరణాలతో ప్రాజెక్టు సఫలతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ...‘ఇది అంతర్జాతీయ ప్రాజెక్టు. కొన్ని మరణాలు సంభవిస్తాయని ముందే ఊహించాం. తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్లే చీతా కూనలు మృతి చెందాయి. అయినప్పటికీ అందుకు బాధ్యత వహిస్తాం. ప్రాజెక్టు విజయవంతం అవుతుంది’ అని టైమ్స్‌ నెట్‌వర్క్‌ కాంక్లేవ్‌లో అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు