రైళ్ల వేగం 160 కిలోమీటర్లకు పెరగాలి

రైళ్ల వేగాన్ని 160 కిలోమీటర్లకు పెంచడానికి, ఏటా 1,100 కోట్లమంది ప్రయాణికుల అవసరాలు తీర్చడానికి అవసరమైన ఏర్పాట్లు వేగంగా చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తన శాఖ అధికారులకు పిలుపునిచ్చారు.

Updated : 03 Jun 2023 07:10 IST

ఏటా 1,100 కోట్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాలి
అధికారులకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పిలుపు

ఈనాడు, దిల్లీ: రైళ్ల వేగాన్ని 160 కిలోమీటర్లకు పెంచడానికి, ఏటా 1,100 కోట్లమంది ప్రయాణికుల అవసరాలు తీర్చడానికి అవసరమైన ఏర్పాట్లు వేగంగా చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తన శాఖ అధికారులకు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఎదురయ్యే డిమాండ్‌కు తగ్గట్టు రైల్వేను తీర్చిదిద్దడంపై రెండురోజులపాటు ఇక్కడ జరిగిన మేధోమథనంలో ఆయన మాట్లాడారు. ఏటా ఎక్కువ మొత్తంలో ట్రాక్‌లు అందుబాటులోకి తేవడం, ప్రతిరోజు ఎక్కువ లోడింగ్‌ చేయడం, 50% మార్గాల్లో రైళ్లను 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టించడం, ప్రమాదాలను సున్నాకు తీసుకురావడంపై అధికారులతో చర్చించారు. 30,000 రూట్‌ కిలోమీటర్‌లో రైళ్ల వేగాన్ని 160 కిలోమీటర్లకు పెంచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏటా 1,100 కోట్ల మంది ప్రయాణికుల అవసరాలను తీర్చడంతోపాటు, స్టేషన్లలో రద్దీని ఎలా ఎదుర్కోవాలో కూడా ఆలోచించాలని కోరారు. వందే భారత్‌ మెట్రో రైల్‌ డిజైన్‌ ఖరారైందని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ ప్రతిపాదించిన విజన్‌-2047కు తగ్గట్టు రైల్వేలో చేపట్టాల్సిన మార్పులు, అందుకు తగ్గ కార్యాచరణ ప్రణాళికపై ఇందులో చర్చించారు. ఈ సందర్భంగా వివిధ రైల్వేజోన్లకు చెందిన జనరల్‌ మేనేజర్లు బృందాలుగా ఏర్పడి కొత్త ఆలోచనలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ సహాయ మంత్రులు, రైల్వే బోర్డు ఛైర్మన్‌, సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని