అరిహాను స్వదేశానికి పంపండి.. మూడేళ్ల పాప కోసం జర్మనీపై భారత్‌ ఒత్తిడి

బెర్లిన్‌లో గత ఇరవై నెలలుగా అధికారుల సంరక్షణలో ఉన్న చిన్నారి అరిహా షా (3)ను వీలైనంత త్వరగా స్వదేశానికి పంపాలని భారత ప్రభుత్వం శుక్రవారం జర్మనీని కోరింది.

Updated : 03 Jun 2023 07:59 IST

దిల్లీ: బెర్లిన్‌లో గత ఇరవై నెలలుగా అధికారుల సంరక్షణలో ఉన్న చిన్నారి అరిహా షా (3)ను వీలైనంత త్వరగా స్వదేశానికి పంపాలని భారత ప్రభుత్వం శుక్రవారం జర్మనీని కోరింది. అరిహా షా ఏడు నెలల చిన్నారిగా ఉన్నపుడు.. తల్లిదండ్రులు ఆ పాపను వేధిస్తున్నారని కారణం చూపుతూ 2021 సెప్టెంబరు 23న జర్మనీ అధికారులు ఆమె సంరక్షణ బాధ్యతలను తీసుకున్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ దీనిపై మీడియాతో మాట్లాడుతూ.. అరిహా సుదీర్ఘకాలం జర్మన్ల సంరక్షణలో ఉండటం ఆమెకున్న సామాజిక, సాంస్కృతిక, భాషాపరమైన హక్కుల ఉల్లంఘనగా భారత ప్రభుత్వంతోపాటు ఆమె తల్లిదండ్రులు భావిస్తున్నట్లు తెలిపారు.  ముంబయికి చెందిన భవేష్‌ షా, ధారా షా దంపతులు 2018లో ఉపాధి నిమిత్తం జర్మనీకి వెళ్లారు. అక్కడే వారికి అరిహా షా జన్మించింది. పాప ఆడుకుంటూ కింద పడిపోవడంతో ప్రైవేటు అవయవం వద్ద గాయమైంది. దీంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చిన్నారికి అయిన గాయం తీరు కారణంగా ఆమెపై లైంగికదాడి జరిగి ఉండవచ్చన్న అనుమానాలతో పాపను జర్మనీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. మరో రెండు నెలల్లో భవేష్‌ షా దంపతుల వీసా గడువు ముగిసిపోనుండటంతో అరిహా కోసం వారు తీవ్రంగా కలత చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని