నిర్లక్ష్యం వల్లే ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఒడిశా రైలు ప్రమాదం జరిగిందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

Published : 04 Jun 2023 04:16 IST

భద్రతా వ్యవస్థపై ప్రతిపక్షాల ప్రశ్నల వర్షం
రైల్వే శాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్‌

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఒడిశా రైలు ప్రమాదం జరిగిందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. రైల్వేకు సంబంధించిన భద్రతా వ్యవస్థపై ప్రశ్నల వర్షం కురిపించాయి. ఈ ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. ఈ ప్రమాదాన్ని భయానక ఘటనగా పేర్కొన్న కాంగ్రెస్‌.. రైల్వే నెట్‌వర్క్‌, పనితీరుపై ప్రధానమంత్రి, రైల్వే శాఖ మంత్రిని నిలదీయడానికి తమ వద్ద అనేక ప్రశ్నలు ఉన్నాయని, అయితే ప్రయాణికులకు సహాయం అందించడంపైనే ప్రస్తుతం తాము దృష్టి పెట్టామని పేర్కొంది.


సహాయం అందించండి

మల్లికార్జున ఖర్గే

మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి. కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీ శ్రేణులు ప్రమాద బాధితులకు సహాయ సహకారాలు అందించాలి.


తీవ్రంగా కలచివేసింది

సోనియాగాంధీ

ఒడిశా రైలు ఘటన దురదృష్టకరం. ఈ ప్రమాదం తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.


బాధితులకు బాసటగా నిలవండి:

రాహుల్‌గాంధీ

రైలు ప్రమాదం దిగ్భ్రాంతి కలిగించింది. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనాలి. బాధితులకు బాసటగా నిలవాలి.


కవచ్‌లో కుంభకోణం:

ఆర్జేడీ

కవచ్‌లో కుంభకోణం దాగి ఉంది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేయాలి. కేవలం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోనే ప్రజలు ప్రయాణించాలని మోదీ ప్రభుత్వం ఆశిస్తోంది. ఇది సిగ్గు చేటు.


రైల్వే వ్యవస్థను భాజపా నాశనం చేసింది: లాలూప్రసాద్‌

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రైల్వే వ్యవస్థను నాశనం చేసింది. ప్రయాణికుల భద్రత అంటే ప్రభుత్వానికి లెక్కేలేకుండా పోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు