Train Accidents: లాల్‌ బహదూర్‌ బాటలో... నడిచిన రైల్వే మంత్రులు వీరే

మన దేశంలో రైళ్లు ప్రమాదానికి గురైతే అందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ శాఖ మంత్రి పదవి నుంచి వైదొలిగే సంప్రదాయం దివంగత మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రితో మొదలైంది.

Updated : 04 Jun 2023 07:11 IST

ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ పదవులకు రాజీనామా

దిల్లీ: మన దేశంలో రైళ్లు ప్రమాదానికి గురైతే అందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ శాఖ మంత్రి పదవి నుంచి వైదొలిగే సంప్రదాయం దివంగత మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రితో మొదలైంది. ఆయన రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో తమిళనాడులోని అరియళూరు వద్ద 1956 నవంబరులో భారీ ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో 142 మంది రైలు ప్రయాణికులు మృతి చెందారు. దీంతో తీవ్ర కలత చెందిన శాస్త్రి నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేశారు. లాల్‌బహదూర్‌ నైతిక నిష్ఠను కొనియాడిన అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ...ఆయనకు మరో మంత్రిత్వశాఖను కేటాయించారు. తదనంతర పరిణామాల్లో శాస్త్రి ప్రధాన మంత్రి పదవినీ చేపట్టారు.


నీతీశ్‌కుమార్‌: రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ ఆ శాఖ బాధ్యతల నుంచి వైదొలగిన రెండో వ్యక్తి నీతీశ్‌కుమార్‌. లాల్‌బహదూర్‌ శాస్త్రి రాజీనామా తర్వాత 43 ఏళ్లకు ఇది చోటు చేసుకుంది. 1999 ఆగస్టులో బెంగాల్‌లోని గైసాల్‌ దుర్ఘటనలో 285 మందికి పైగా రైలు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్పటి రైల్వే మంత్రి నీతీశ్‌ కుమార్‌ మంత్రి పదవిని త్యజించారు.


మమతాబెనర్జీ: 2000లో రెండు రైలు ప్రమాదాలు జరగడంతో అప్పటి రైల్వే మంత్రిగా ఉన్న మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేశారు. అయితే, అప్పటి ప్రధాని వాజ్‌పేయీ తిరస్కరించారు.


సురేశ్‌ ప్రభు: నాలుగు రోజుల వ్యవధిలో రెండు రైళ్లు (కైఫియత్‌ ఎక్స్‌ప్రెస్‌, పూరీ-ఉత్కళ ఎక్స్‌ప్రెస్‌) ప్రమాదాలకు గురికావడంతో 2017 సెప్టెంబరులో అప్పటి రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు మంత్రి పదవి నుంచి వైదొలగేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఆయన రాజీనామాను ప్రధాని మోదీ తోసిపుచ్చారు. సురేశ్‌ ప్రభు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడే 2016 నవంబరులో ఇందౌర్‌-రాజేంద్రనగర్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 14 కోచ్‌లు పట్టాలు తప్పడంతో పుఖరాయన్‌ రైలు కూడా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 152 మంది మృత్యువాతపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని