సిగ్నలింగ్‌ వ్యవస్థలో తీవ్ర లోపాలు.. 3 నెలల క్రితమే హెచ్చరించిన రైల్వే ఉన్నతాధికారి

రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థలో తీవ్రస్థాయి లోపాలు ఉన్నట్లు ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మూడు నెలల క్రితమే హెచ్చరించిన సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది.

Updated : 05 Jun 2023 08:36 IST

దిల్లీ: రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థలో తీవ్రస్థాయి లోపాలు ఉన్నట్లు ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మూడు నెలల క్రితమే హెచ్చరించిన సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. ‘ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు’ కారణంగానే ఒడిశాలో ప్రమాదం జరిగిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రాథమికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో- ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ వైఫల్యాన్ని ఆ ఉన్నతాధికారి గతంలోనే ఎత్తిచూపిన విషయం చర్చనీయాంశమవుతోంది. నైరుతి రైల్వే జోన్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ మేనేజర్‌ తన ఉన్నతాధికారులకు ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఓ లేఖ రాశారు. అంతకుముందు రోజు చోటుచేసుకున్న ఓ అనూహ్య ఘటనను అందులో ప్రస్తావించారు. ‘‘ఫిబ్రవరి 8న సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. నాడు వాస్తవానికి అప్‌ మెయిన్‌ లైన్‌లో వెళ్లేందుకు ఆ రైలుకు తొలుత అనుమతి లభించింది. కానీ కొద్దిదూరం వెళ్లాక డౌన్‌ మెయిన్‌ లైన్‌లో వెళ్లేలా ఇంటర్‌లాకింగ్‌ ఉండటం కనిపించింది. దాన్ని గుర్తించిన లోకోపైలట్‌ అప్రమత్తమయ్యారు. రైలును వెంటనే నిలిపివేశారు. ఇంటర్‌లాకింగ్‌ ఉన్న ప్రకారం వెళ్లి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదే. సిగ్నలింగ్‌ వ్యవస్థలో తీవ్ర లోపాలు ఉన్నాయని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది’’ అని లేఖలో వివరించారు. కొన్నిసార్లు సిగ్నల్‌ ప్రకారం రైలు ప్రారంభమయ్యాక.. అది వెళ్లాల్సిన ట్రాక్‌ మారిపోతోందని పేర్కొన్నారు. ఈ వైఫల్యాలను నివారించేలా తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. లేనిపక్షంలో ఘోర ప్రమాదాలు జరిగే ముప్పుందని లేఖలో హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు