Orphan: అనాథకు.. తండ్రిని చూపిన అన్నదానం

ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని రామ్‌గఢ్‌ పట్టణంలో జరిగిన ఓ అనూహ్య ఘటన అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.

Published : 05 Jun 2023 09:23 IST

ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని రామ్‌గఢ్‌ పట్టణంలో జరిగిన ఓ అనూహ్య ఘటన అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. ఓంకార్‌ మిషన్‌ నిర్వహిస్తున్న స్థానిక అనాథాశ్రమంలో శుక్రవారం మధ్యాహ్నం పేదలకు అన్నదానం ఏర్పాటు చేశారు. అదే ఆశ్రమంలో పెరుగుతున్న శివం (13) అనే 8వ తరగతి విద్యార్థికి ఇటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం అలవాటు. ఎప్పటిలా శివం అందరికీ వడ్డిస్తూ వచ్చి.. గడ్డంతో ఉన్న ఓ వ్యక్తి దగ్గర ఆగిపోయాడు. తాను ఫొటోలో చూసిన తండ్రి రూపం అదే అని ఆ చిన్నారి ఇట్టే గ్రహించాడు. తండ్రి టింకు వర్మ కూడా కుమారుణ్ని గుర్తించాడు. ఇద్దరూ ఒకరినొకరు హత్తుకొని కన్నీటిపర్యంతం అయ్యారు. పదేళ్ల కిందట.. శివం మూడేళ్ల పిల్లాడిగా ఉండగా అతడి తల్లి అనుమానాస్పదంగా మృతిచెందింది. ఈ కేసులో టింకు వర్మను అరెస్టు చేసిన పోలీసులు శివం సంరక్షణ బాధ్యతను ఆశ్రమానికి అప్పగించారు. జైలు నుంచి విడుదలై జీవనం కోసం ఆటోరిక్షా నడుపుతున్న టింకు వర్మ ఇన్నాళ్లకు తన కుమారుణ్ని ఇలా కలుసుకోగలిగాడు. ఆశ్రమ మేనేజర్‌ రాజేశ్‌ నేగి మాట్లాడుతూ.. అధికారిక లాంఛనాలు పూర్తయ్యాక శివంను అతడి తండ్రికి అప్పజెబుతామన్నారు. ‘‘నేను జీవితంలో నాన్నను కలుస్తానని అనుకోలేదు. ఇది ఆ దేవుడి కానుక’’ అంటూ శివం ఆనందం వ్యక్తం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని