టికెట్‌ లేని ప్రయాణికులకూ నష్టపరిహారం

ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటనలో టికెట్‌ లేని ప్రయాణికులకూ నష్టపరిహారం లభించనుంది. గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన ఓ తీర్పు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం భారతీయ రైల్వే ప్రకటించింది.

Published : 05 Jun 2023 07:14 IST

భారతీయ రైల్వే ప్రకటన

దిల్లీ: ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటనలో టికెట్‌ లేని ప్రయాణికులకూ నష్టపరిహారం లభించనుంది. గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన ఓ తీర్పు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం భారతీయ రైల్వే ప్రకటించింది. ‘‘ప్రయాణికులకు టికెట్‌ ఉందా లేదా అన్నదాంతో సంబంధం లేకుండా ప్రమాదానికి గురైన వారందరికీ పరిహారం అందుతుంది’’ అని రైల్వే ప్రతినిధి అమితాబ్‌ శర్మ తెలిపారు. మరో సీనియర్‌ రైల్వే అధికారి మాట్లాడుతూ.. మృతి చెందిన, గాయపడిన వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు.. హెల్ప్‌లైన్‌ నంబరు 139కి ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ‘‘మృత దేహాలను తీసుకువెళ్లడానికి, గాయపడిన వారిని కలవడానికి కుటుంబసభ్యులు వస్తామంటే మాకు ఫోన్‌ చేయొచ్చు. ప్రయాణానికి, ఇతరత్రా అయ్యే ఖర్చులన్నీ మేం భరిస్తాం’’ అని ఆమె తెలిపారు.

123 రైళ్ల రద్దు.. 56 దారి మళ్లింపు

ఒడిశా రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో 123 రైళ్లను పూర్తిగా, పదింటిని పాక్షికంగా రద్దు చేశారు. 56 రైళ్లను దారి మళ్లించారు. 14 రైళ్ల షెడ్యూల్‌ను మార్చారు. రద్దైనవాటిలో హావ్‌డా చెన్నై మెయిల్‌, కన్యాకుమారి-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌, తిరుపతి వీక్లీ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, ఎస్‌ఎమ్‌వీటీ- బెంగళూరు సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని