దిగంబరత, అశ్లీలత ఒకటి కాదు: హైకోర్టు

మహిళలకు వారి శరీరాలపై స్వయం నిర్ణాయక హక్కు తరచూ నిరాకరణకు గురవుతోందని కేరళ హైకోర్టు అభిప్రాయపడింది.

Updated : 06 Jun 2023 05:31 IST

కొచి: మహిళలకు వారి శరీరాలపై స్వయం నిర్ణాయక హక్కు తరచూ నిరాకరణకు గురవుతోందని కేరళ హైకోర్టు అభిప్రాయపడింది. వారు తమ జీవితాలు, శరీరాలపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటే వేధింపులు, వివక్షలతో పాటు ఒంటరితనానికీ గురికావాల్సి వస్తోందని పేర్కొంది. జువెనైల్‌ జస్టిస్‌, పోక్సో, సమాచార సాంకేతిక(ఐటీ) చట్టాల కింద మహిళా హక్కుల కార్యకర్తపై నమోదైన అభియోగాలను సోమవారం కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. మైనర్లు అయిన తన చిన్నారులతో అర్ధనగ్న భంగిమలో రెహనా ఫాతిమా అనే మహిళ తన శరీరంపై పెయింట్‌ వేయించుకున్నారు. ‘శరీరం-రాజకీయాలు’ అనే శీర్షికతో ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ఈ చర్యకు గాను  చిన్నారులపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం(పోక్సో), జువెనైల్‌ జస్టిస్‌, సమాచార సాంకేతిక(ఐటీ) చట్టంలోని నిబంధనల కింద ఆమెపై కేరళలో కేసులు దాఖలయ్యాయి. వీటిని కొట్టివేయాలన్న అభ్యర్థనను దిగువ కోర్టు తిరస్కరించడంతో ఫాతిమా హైకోర్టును ఆశ్రయించారు. శరీర ఎగువ భాగాల అర్ధనగ్నత్వం విషయంలో పురుషులను, మహిళలను వేర్వేరు దృష్టికోణాల్లో చూస్తున్నారని, ఈ వివక్షను ప్రశ్నిస్తూ సందేశమిచ్చేందుకు బాడీ పెయింట్‌ కళను వినియోగించినట్లు తెలిపారు. ‘నగ్నత్వాన్ని కామోద్రేక దృష్టితో ముడిపెట్టడం తగదు. అశ్లీలత, అసభ్యత, కామోద్దీపనలతో దిగంబరత్వాన్ని అన్నివేళలా సమానంగా భావించడం తగదు. కామోద్దీపన అనే భావన చూసే వారి దృష్టిని బట్టే ఉంటుంద’ని న్యాయమూర్తి జస్టిస్‌ ఎడప్పగత్‌ పేర్కొన్నారు. దేవాలయాలపై వివిధ భంగిమల్లోని చిత్తర్వులు ప్రాచీన కాలం నుంచీ ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. తల్లీ,బిడ్డల అనుబంధంలోని గాఢత, పవిత్రతను ఎవరూ ప్రశ్నించలేరని తెలిపారు. ఒక సామాజిక లక్ష్యం కోసం ఫాతిమా రూపొందించిన వీడియోను అవగాహన చేసుకోవడంలో దిగువ కోర్టు విఫలమైందన్నారు. ఆమెపై నమోదైన కేసులన్నింటినీ తొలగించాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అయ్యప్పస్వామి ఆలయ ప్రవేశం చేసేందుకు ప్రయత్నించిన ఫాతిమా అప్పట్లో తీవ్ర విమర్శలకు గురయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని