ప్రతి 5 విద్యార్థి వీసాల్లో ఒకటి భారతీయులకే.. అమెరికా రాయబారి వెల్లడి

ప్రపంచ వ్యాప్తంగా 2022లో జారీ చేసిన ప్రతి 5 విద్యార్థి వీసాల్లో ఒకటి భారతీయులకే దక్కిందని భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టీ తెలిపారు.

Updated : 08 Jun 2023 09:22 IST

ఈనాడు-హైదరాబాద్‌, దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా 2022లో జారీ చేసిన ప్రతి 5 విద్యార్థి వీసాల్లో ఒకటి భారతీయులకే దక్కిందని భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టీ తెలిపారు. అది భారత్‌ జనాభాను ప్రపంచ జనాభాతో పోల్చి చూసినప్పుడు చాలా ఎక్కువని పేర్కొన్నారు. బుధవారం ఏడో విద్యార్థి వీసా దినోత్సవం సందర్భంగా దిల్లీ, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబయిలలోని కాన్సులేట్‌లలో 4500 విద్యార్థి వీసా దరఖాస్తులను పరిష్కరించామని తెలిపారు. ‘ప్రపంచంలోని ఏ దేశంతో పోల్చి చూసినా భారతీయ విద్యార్థులే అధికంగా అమెరికా వస్తున్నారు. భారతీయ విద్యార్థులు చదువుల్లోనే కాదు.. దశాబ్దాలుగా వృత్తి నైపుణ్యంలోనూ ప్రతిభ కనబరుస్తున్నారు. మేం ప్రస్తుతం చరిత్రలోనే అత్యధిక విద్యార్థి వీసా దరఖాస్తులను పరిష్కరించే దిశగా సాగుతున్నాం. గతంలో ఎన్నడూలేని విధంగా అత్యధిక వీసా దరఖాస్తులను స్వీకరిస్తున్నాం. రాబోయే జులై, ఆగస్టులలో వేల సంఖ్యలో విద్యార్థి వీసా స్లాట్లను విడుదల చేయబోతున్నాం’ అని గార్సెట్టీ వివరించారు. దిల్లీలోని రాయబార కార్యాలయంలో విద్యార్థులకు రాయబారి ఎరిక్‌ గార్సెట్టీ వీసాలను అందజేశారు. హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ కార్యాలయంలో ఇంటర్వ్యూలకు హాజరైన విద్యార్థులకు కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ వీసాలను అందజేశారు.  రాయబార కార్యాలయం విడుదల చేసిన లెక్కల ప్రకారం.. 2022లో భారతీయలకు 1,25,000 విద్యార్థి వీసాలను అమెరికా జారీ చేసింది. ఇది మొత్తం వీసాల్లో 17.5శాతం. ఉద్యోగ వీసాలైన హెచ్‌, ఎల్‌లలో 65శాతం మన వాళ్లకే దక్కాయి. గత ఏడాది 12లక్షల మంది భారతీయులు అమెరికాను సందర్శించారు. 2021-22లో అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో భారతీయుల వాటా 21శాతం. ప్రస్తుతం 2లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు