కేరళలో ఇంటర్నెట్‌ ఇక ప్రాథమిక హక్కు!

అక్షరాస్యతలో అందరికంటే ముందున్న కేరళ.. డిజిటల్‌ రంగంలోనూ ముందడుగు వేసింది. ఇంటర్నెట్‌ను ప్రాథమిక హక్కుగా ప్రకటించి, అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఆవిర్భవించింది.

Published : 08 Jun 2023 05:43 IST

డిజిటల్‌ అంతరం తగ్గించే తొలి రాష్ట్రంగా గుర్తింపు
20 లక్షల కుటుంబాలకు ఉచితంగా నెట్‌
మిగిలినవారికి రాయితీ ధరలకు..

అక్షరాస్యతలో అందరికంటే ముందున్న కేరళ.. డిజిటల్‌ రంగంలోనూ ముందడుగు వేసింది. ఇంటర్నెట్‌ను ప్రాథమిక హక్కుగా ప్రకటించి, అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఆవిర్భవించింది. ప్రజల మధ్య డిజిటల్‌ అంతరాన్ని తగ్గించే దిశగా తమ ప్రభుత్వం తొలి విడతలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కేరళ ఫైబర్‌ ఆప్టికల్‌ నెట్‌వర్క్‌ను (కేఎఫ్‌ఓఎన్‌) పినరయి విజయన్‌ ప్రభుత్వం తాజాగా ఆరంభించింది. దేశంలోని ఏకైక వామపక్ష ప్రభుత్వం దీనిని తమ ప్రత్యామ్నాయ అభివృద్ధి మోడల్‌గా అభివర్ణిస్తోంది.

కేఎఫ్‌ఓఎన్‌ ద్వారా రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందుబాటులోకి వస్తుంది. అంతేగాకుండా కేఎఫ్‌ఓఎన్‌ సాయంతో రాష్ట్రంలో ఇ-పాలనను పెంచాలని, విజ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థగా (నాలెడ్జ్‌ బేస్డ్‌ ఎకానమీ) మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

కేఎఫ్‌ఓఎన్‌ 30వేల కిలోమీటర్ల పొడవున విస్తరించే ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌. కేబుల్‌ ఆపరేటర్లతోపాటు ఇతర సర్వీస్‌ ప్రొవైడర్లకూ ఈ వ్యవస్థను అందుబాటులో ఉంచుతారు. కేఎఫ్‌ఓఎన్‌ ద్వారా ప్రభుత్వ కార్యాలయాలకు ఇంటర్నెట్‌ అందిస్తారు. వ్యక్తిగత కనెక్షన్లను స్థానిక ప్రైవేటు, సర్వీసు ప్రొవైడర్లు, కేబుల్‌ ఆపరేటర్ల ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది.

తొలి విడతలో...

30వేల ప్రభుత్వ కార్యాలయాలకు, 20 లక్షల నిరుపేద కుటుంబాలకు ఉచితంగా హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ను అందివ్వాలని ఈ ప్రాజెక్టులో లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి విడతలో మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 చొప్పున బీపీఎల్‌ కుటుంబాలను ఎంపిక చేసి కనెక్షన్‌ ఇస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని సుమారు 18వేల ప్రభుత్వ కార్యాలయాలను, 2వేలకుపైగా ఇళ్లను ఈ వ్యవస్థతో అనుసంధానించారు. 9వేల ఇళ్లకు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇచ్చేలా కేబుల్‌ నెట్‌వర్క్‌ వేశారు. ప్రస్తుతం 10 ఎంబీపీఎస్‌ నుంచి 10 జీబీపీఎస్‌ దాకా స్పీడ్‌ ఉన్న ఈ వ్యవస్థను మొబైల్‌ టవర్లతో అనుసంధానిస్తే 4జీ, 5జీ స్పీడ్‌ను అందుకుంటుందని చెబుతున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండే కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా నెట్‌ను అందిస్తుంది. మిగిలిన వారికి రాయితీ ధరలకు ఇస్తారు.

వామపక్ష నమూనాగా..

కేరళ రాష్ట్ర విద్యుత్‌ బోర్డు (కేఎస్‌ఈబీ), కేరళ ఐఐటీ మౌలిక సదుపాయాల మండలి సంయుక్త ప్రాజెక్టు ఈ కేఎఫ్‌ఓఎన్‌. సుమారు రూ.1,611 కోట్ల వ్యయంతో దీన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ ఈ ప్రాజెక్టు అమలు బాధ్యత తీసుకుంది. 2017లో ఈ ప్రాజెక్టును ప్రకటించి.. 2019లో పని మొదలెట్టారు. ప్రైవేటు ఆపరేటర్ల ఆధిపత్యం సాగుతున్న టెలికాం రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ సమర్థంగా నిలుస్తుందని కేఎఫ్‌ఓఎన్‌ ద్వారా నిరూపించాలన్నది కేరళ సీపీఎం ప్రభుత్వ లక్ష్యంగా చెబుతున్నారు. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ స్పీడ్‌ తక్కువగా ఉంటోంది. ఇదో రకమైన సామాజిక సాంకేతిక అంతరం, వివక్ష! గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఈ డిజిటల్‌ అంతరాన్ని తగ్గించి ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ ఒకే స్పీడు ఇంటర్నెట్‌ను అందించాలన్నది కేరళ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. అన్ని ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో ఇంటర్నెట్‌ స్పీడ్‌ పెరిగితే పాలన, పౌర సేవలు, బోధన మెరుగుపడతాయి. ఇ-పాలన పెంచటం ద్వారా అవినీతిని తగ్గించటానికి వీలవుతుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోనూ ఈ ప్రాజెక్టు భారీ మార్పులకు దోహదపడుతుందని కేరళ ప్రభుత్వ భావిస్తోంది. ప్రపంచంలో ఫిన్లాండ్‌, ఎస్తోనియా, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, గ్రీస్‌, కోస్టారికాలాంటి కొన్ని దేశాలు మాత్రమే ఇంటర్నెట్‌ను ప్రాథమిక జీవన హక్కుగా ప్రకటించాయి.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని