Medical colleges: ఇక కొత్త వైద్య కళాశాలలకు ‘మార్బ్‌’ ముద్ర

వైద్య కళాశాలల ఏర్పాటు, కొత్త కోర్సుల అనుమతి కోసం నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ కొత్త నిబంధనలు విడుదల చేసింది.

Published : 10 Jun 2023 07:48 IST

నోటిఫికేషన్‌ విడుదల చేసిన నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌

ఈనాడు, దిల్లీ: వైద్య కళాశాలల ఏర్పాటు, కొత్త కోర్సుల అనుమతి కోసం నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ కొత్త నిబంధనలు విడుదల చేసింది. ఇకపై ఈ పనిచేయడానికి మెడికల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ రేటింగ్‌ బోర్డు (మార్బ్‌)ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ‘ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌, అసెస్‌మెంట్‌ అండ్‌ రేటింగ్‌ రెగ్యులేషన్స్‌ 2023’ పేరుతో నోటిఫికేషన్‌ జారీచేసింది. మార్బ్‌ నుంచి లిఖితపూర్వక అనుమతులు లేకుండా కొత్తగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి కానీ, కొత్త కోర్సులు ప్రారంభించడానికి కానీ వీల్లేదు. ఎంబీబీఎస్‌, పీజీ కోర్సుల నిర్వహణ కోసం కొత్త కళాశాలల ఏర్పాటుకు ఈ సంస్థ దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, విశ్వవిద్యాలయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో ఏర్పాటైన స్వయంప్రతిపత్తి సంస్థలు, సొసైటీస్‌ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ 1860 కింద ఏర్పాటైన సెక్షన్‌-8 కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా వచ్చిన దరఖాస్తులను మార్బ్‌ క్షుణ్నంగా పరిశీలిస్తుంది. అన్ని కోణాల్లో పరిశీలన పూర్తిచేసిన తర్వాత మార్బ్‌ ఆమోదపత్రాన్ని జారీచేస్తుంది.

మార్బ్‌ అనుమతి లేకుండా ఇప్పటికే తరగతులు నిర్వహిస్తున్న ఏ విద్యా సంస్థా సీట్లు పెంచడానికి వీల్లేదు. మెడికల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ రేటింగ్‌ బోర్డు అన్ని వైద్య విద్యాసంస్థల పనితీరును మదింపుచేసి రేటింగ్‌ ఇస్తుంది. ఇందుకోసం మార్బ్‌ స్వతంత్ర థర్డ్‌పార్టీ సంస్థలను నియమిస్తుంది. ఈ నివేదికలు అందిన తర్వాత ప్రతి వైద్య విద్యాసంస్థ రేటింగ్‌ను మార్బ్‌ తన వెబ్‌సైట్‌లో ఉంచుతుంది. ప్రతి వైద్య విద్యాసంస్థ తప్పనిసరిగా యాన్యువల్‌ డిస్‌క్లోజర్‌ రిపోర్ట్‌ని అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ బోర్డులకు సమర్పించాలి. అలాగే ఆ నివేదికను ప్రవేశాలు ముగిసిన 30 రోజుల్లోపు ఆ విద్యా సంవత్సరంలోని విద్యార్థులందరికీ అందించాలి. ఒకవేళ ఈ డిస్‌క్లోజర్‌ రిపోర్ట్‌ సమర్పించకపోతే అలాంటి సంస్థపై క్రమశిక్షణ చర్య తీసుకుంటారు. అలాగే నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ విధించిన నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు దిద్దుబాటుకోసం నిర్దిష్ట గడువుతో నోటీసు జారీచేస్తారు. అప్పటికీ తప్పులు సరిదిద్దుకోని సంస్థలకు ఒక్కో ఉల్లంఘనకు గరిష్ఠంగా రూ.కోటి వరకు జరిమానా విధిస్తారు. మార్బ్‌ తీసుకున్న నిర్ణయంపట్ల అభ్యంతరాలు ఉన్న వారు ఎన్‌ఎంసీకి అప్పీల్‌ చేసుకోవచ్చు. ఈ అప్పీల్‌పై ఎన్‌ఎంసీ 45 రోజుల్లోపు నిర్ణయం తీసుకోకపోతే ఆ తర్వాత 30 రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి రెండో అప్పీల్‌ చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని