నేను బతక్కపోవచ్చు.. బిడ్డను జాగ్రత్తగా చూసుకో

జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌ వద్ద కొకెర్‌నాగ్‌ సమీపంలో మొదలైన ఎన్‌కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన అధికారుల విషాదగాథలు వెలుగులోకి వస్తున్నాయి.

Published : 18 Sep 2023 06:29 IST

గాయాలతోనే కుటుంబసభ్యులకు డీఎస్పీ హుమాయూన్‌ ఫోన్‌కాల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌ వద్ద కొకెర్‌నాగ్‌ సమీపంలో మొదలైన ఎన్‌కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన అధికారుల విషాదగాథలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఉగ్రదాడిలో కన్నుమూసిన యువ డీఎస్పీ హుమాయూన్‌ భట్‌ తుదిశ్వాస విడవడానికి ముందు.. గాయాలతోనే తన కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేశారు. తన బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. కర్నల్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌తోపాటు మేజర్‌ ఆశిష్‌ ధొనక్‌తో కలిసి హుమాయూన్‌ భట్‌ కూడా ఆపరేషన్‌ను ముందుండి నడిపిస్తుండగా.. ఉగ్రదాడికి గురయ్యారు. ఈ సమయంలో భట్‌ తీవ్రంగా గాయపడ్డారు. తాను బతకనన్న విషయం అతనికి అర్థమైపోయింది.. వెంటనే కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేశారు. తొలుత తన తండ్రి, విశ్రాంత ఐజీ గులాం హసన్‌ భట్‌కు ఫోన్‌ చేశారు. తాను ఆపరేషన్‌లో గాయపడ్డానని వెల్లడించారు. తనకు ఏమీ కాదని ధైర్యం చెప్పారు. తర్వాత తన భార్య ఫాతిమాకు వీడియోకాల్‌ చేశారు. ‘‘నేను బతక్కపోవచ్చు. ఒక వేళ గాయాలతో చనిపోతే.. మన బిడ్డను జాగ్రత్తగా చూసుకో’’ అని చెప్పారు. ఆ తర్వాత కొద్ది సేపటికే భట్‌ తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనపై జమ్మూకశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ మాట్లాడుతూ..‘‘హుమాయూన్‌ గాయపడిన వెంటనే ఆ విషయాన్ని అతని తండ్రికి తెలియజేశాను. దీంతోపాటు అక్కడేం చేస్తున్నామో వీడియోకాల్‌ చేసి చూపించాం. స్థానికులు, సహాయ బృందాలు అక్కడకు చేరుకొనే సమయానికే రక్తం ఎక్కువగా పోవడంతో హుమాయూన్‌ ప్రాణాలు కోల్పోయారు’’ అని పేర్కొన్నారు. దాదాపు 15 రోజుల క్రితమే హుమాయూన్‌ తొలి వివాహ వార్షికోత్సవం జరుపుకొన్నారు. అతని కుమారుడి వయసు కేవలం నెలరోజులు మాత్రమే. ఉగ్రవాదులు ఎత్తైన ప్రదేశాల్లో నక్కి భద్రతాదళాలను లక్ష్యంగా చేసుకొన్నాయి. దాడి జరిగిన వెంటనే భద్రతా బలగాలు క్షతగాత్రులను ఘటనా స్థలం నుంచి తరలించడం సాధ్యం కాలేదు. దీంతో వారు కొద్దిసేపు అక్కడే గాయాలతో ఉండాల్సి వచ్చింది.

కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌

అనంతనాగ్‌ ఎన్‌కౌంటర్‌ ఐదో రోజుకు చేరుకుంది. గఢోల్‌ అడవుల్లోని ఓ గుహ వంటి స్థావరంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సైన్యం అంచనావేసింది. ఆదివారం ఉదయం దానిపైకి గ్రేనేడ్లను ప్రయోగించి పేల్చివేసింది. ఉగ్రవాదులు తమ మందుగుండును కాపాడుకొనేందుకు ఆగి ఆగి కాల్పులు జరుపుతున్నారు. ఇక్కడ ఎంత మంది ఉగ్రవాదులున్నారనే విషయం ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. ఈ ఆపరేషన్‌ కోసం డ్రోన్లు, హెలికాప్టర్లను సైన్యం తీసుకొచ్చింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని