ప్రజాస్వామ్య మూలనిధి.. చరిత్రలో మైలురాయి

వర్తులాకారంలో, నిలువెత్తు రాతి స్తంభాలతో, గంభీరంగా, హుందాగా కనపడే మన పార్లమెంటు భవనానిది 96 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర.

Published : 18 Sep 2023 06:29 IST

96 ఏళ్లు సేవలందించిన పార్లమెంటు పాత భవంతి
రేపటి నుంచి కొత్త భవనంలో కార్యకలాపాలు!

దిల్లీ: వర్తులాకారంలో, నిలువెత్తు రాతి స్తంభాలతో, గంభీరంగా, హుందాగా కనపడే మన పార్లమెంటు భవనానిది 96 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర. వలసవాద పాలనను, రెండో ప్రపంచ యుద్ధాన్ని, స్వాతంత్య్రం సిద్ధించిన ఘటనను, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన క్షణాలను.. తదనంతరం ఎన్నో ఘట్టాలను ఈ భవనం మౌనసాక్షిలా వీక్షించింది. రాజ్యాంగం పురుడుపోసుకోవడం నుంచి ఎన్నో శాసనాలను చూసిన భవనమిది. ఇందులో కొన్ని చరిత్రాత్మకమైనవి, మరికొన్ని వివాదాస్పదమైనవి. ఈ భవనంలో సోమవారం జరగబోయేదే బహుశా చివరి సమావేశం కావచ్చు. దీనికి సమీపంలోనే నిర్మించిన కొత్త భవనంలో మంగళవారం నుంచి సమావేశాలు కొనసాగనున్నాయి.

మొదట్లో దీనిపేరు ‘కౌన్సిల్‌ హౌస్‌’

రైసీనా హిల్‌ ప్రాంతంలో ప్రస్తుత భవనాన్ని బ్రిటిష్‌ పాలనలో 1927 జనవరి 18న అప్పటి వైస్రాయ్‌- లార్డ్‌ ఇర్విన్‌ ప్రారంభించారు. మొదటి అంతస్తులో 144 రాతి స్తంభాలతో మొత్తంగా ఆరు ఎకరాల విస్తీర్ణంలో కొలువుదీరిన ఈ భవంతి.. దేశ రాజధాని నగరంలో ప్రముఖ కట్టడాల్లో ఒకటిగా నిలిచిపోయింది. బ్రిటిష్‌ పాలకులు దేశ రాజధానిని దిల్లీకి మార్చడంతో ‘కౌన్సిల్‌ హౌస్‌’ పేరుతో దీనిని నిర్మించారు. అప్పట్లో అట్టహాసంగా ప్రారంభ వేడుక నిర్వహించారు. మైలులో మూడోవంతు చుట్టుకొలతతో, 560 అడుగుల వ్యాసంతో ఉన్న భవనానికి ఆకృతిని సర్‌ హెర్బెర్ట్‌ బేకర్‌, సర్‌ ఎడ్విన్‌ లుట్యెన్స్‌ రూపొందించారు. బంగారు తాళం చెవులను బేకర్‌ అందజేయగా లార్డ్‌ ఇర్విన్‌ ఈ భవంతిని తెరచి, ప్రారంభించారు. దేశ విదేశాల్లోని ప్రసార మాధ్యమాల్లో అప్పట్లో ఈ ప్రారంభ వేడుకపై ఎంతో చర్చ జరిగింది. ప్రపంచంలోనే ప్రత్యేకమైన భవంతుల్లో ఒకటిగా ఇది నిలిపోయింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గత 75 ఏళ్లలో ప్రజాస్వామ్య దేవాలయం లాంటి పార్లమెంటు సాగించిన ప్రస్థానంపై సోమవారం ప్రత్యేక సమావేశాల్లో చర్చించనున్నారు. మంగళవారం కొత్త భవనంలోకి మారిపోతే.. పాత భవనం ముచ్చటంతా చరిత్రగా మారనుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని